‘అన్ని అంశాలు పాఠాలు చెప్తాయి. చారిత్రక అంశాలు గుణపాఠాలు నేర్పిస్తాయి’ ఇది తెలంగాణ ప్రజలను చైతన్యపరచిన మేధావి డాక్టర్ జయశంకర్ ఒక సందర్భంలో చెప్పిన, చాలా విలువైన మాట. ఆ చరిత్రలను అర్థం చేసుకున్న పాలకులు పాఠాలు నేర్చుకొని చిరంజీవులుగా మానవజాతి ఉన్నన్నాళ్లూ కీర్తింపబడుతారు. ఆ విధంగా పాఠాలు నేర్చుకోక కొందరు నియంతలుగా మారి ప్రజా కంటకులుగా గుర్తింపబడుతారు. వారిని తలచుకున్నప్పుడల్లా జనాలకు ఏవగింపు తప్ప ఇంకో భావం కలగదు. అంటే వారు జీవించిలేకపోయినా సామాన్య జనాలు తిట్టుకుంటారు. ఇప్పుడు నడుస్తున్న భారత రాజకీయాల్లో ఈ దేశ చరిత్రలోంచి నాయకులు నేర్చుకోవలసిన పాఠాలేమిటో చూద్దాం! గత వెయ్యేండ్లలో అత్యంత అధికారం కలిగి, ఎక్కువకాలం పాలించిన మొఘలు సామ్రాజ్య చరిత్రను గమనిస్తే ఒక విస్మయం కలిగే విషయం తెలుస్తుంది.
ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్గాంధీని జైల్లో పెట్టినా, బెయిల్ మీద విడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగుతుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రెస్ మీద ప్రేమ ఉండక్కరలేదు. నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు.
మొదటి పాలకుడు బాబర్, తర్వాత హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్లకంటే ఎక్కువ భూ భాగాన్ని 55 ఏండ్లు ఔరంగజేబు పాలించాడు. మరి ఆయన మరణం తర్వాత కొన్నేండ్లలోనే మొఘల్ సామ్రాజ్యం చిన్నాభిన్నమైంది. ఏ పాలకుడూ నిలదొక్కుకోలేకపోయాడు. దీనికి చాలా బలమైన కారణాలున్నాయి. అవేమిటో చూద్దాం!
1.ప్రజాభిమానం పాలకుడికి అతి ముఖ్యమైన బలం అని ఔరంగజేబు గుర్తించకపోవటం. 2.ఆయన మత మౌఢ్యం, ఇతర మతాల పట్ల ద్వేషం, ఆలోచనాపరులైన ప్రజలను ఆ వంశానికే శత్రువులుగా చేయటం. 3.దేశ చరిత్ర బట్టి ఐక్యత కోసం అందరినీ సమదృష్టితో చూడాలన్న అంశం ఔరంగజేబు గుర్తించకపోవడం. 4.దాదాపు ఆరు దశాబ్దాలు తన పరిపాలనే ఉన్నా, అత్యాశతో యుద్ధాలు చేసి, కోశాగారంలోని ధనాన్ని ప్రజల సౌకర్యాల కోసం, దేశ ప్రగతి కోసం కాకుండా, తాను శత్రువులనుకున్న వారిని అణచివేయటానికి ఖర్చు చేయటం. ఈ నాలుగు బలమైన కారణాలతో, శతాబ్దాలు పాలించినా, మొఘలు సామ్రాజ్య పతనం కేవలం ఐదు దశాబ్దాలలో జరిగిపోయింది. అంటే దేశాన్ని, ప్రజలను ప్రేమతో కాకుండా ద్వేషంతో, మౌఢ్యంతో ఎంతకాలం పాలించినా ఆ నియంతలకు ఓటమి తప్పదన్నది చారిత్రక సత్యం.
ఇప్పుడు మన దేశాన్ని కేంద్రం నుంచి పాలిస్తున్న బీజేపీ విధానాలతో పైన చెప్పిన అంశాలు పోలిక కలిగి ఉండటం సుస్పష్టంగా కనిపిస్తుంది. రెండుసార్లు కేంద్రంలో మెజారిటీ సాధించి పరిపాలిస్తున్నా, అధినాయకులిద్దరూ కడుపు నిండా అన్నం తిని కంటినిండా నిద్రపోతున్నారా అన్నది అనుమానాస్పదమే! ఇన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏవో ఒక ఎన్నికలు ప్రతి ఏడాదీ, రెండేండ్లకు జరుగుతూనే ఉంటాయి. మరి ఒక రాష్ట్రంలో గెలవగానే, ఇక తర్వాత వేరే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల సన్నాహాలతో, ప్రత్యర్థులను ఓడించాలనే పట్టుదలతో 24 గంటలూ అదే ఆలోచనాధోరణితో, ఆచరణతో ఉండే వీరికి మరి దేశ పరిపాలనకు సమయం చిక్కటం లేదు.
మనది ప్రజాస్వామ్యం కాబట్టి, ఓట్ల ద్వారా గెలుపోటములు నిర్ణయింపబడుతాయి కాబట్టి, రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు, తొమ్మిదేండ్ల సమయం ఒక్క రంగాన్నైనా ఉద్ధరించటానికి సరిపోదా అని. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో దేశ ప్రజలకు ఎంత చేయాలో అంత చేయలేదన్నది కఠిన సత్యం.
కానీ వారు ఈ విధంగా ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేయలేదన్నది కూడా నిజం. అక్బర్, షాజహాన్, జహంగీర్ కూడా పరిపాలించినా, వారు జన జీవనానికి అడ్డుపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతే. మరి వారి కంటే ఎక్కువ కాలం పరిపాలించిన ఔరంగజేబు ఎందుకు ప్రజాగ్రహాన్ని మూట కట్టుకున్నాడు? సరిగ్గా ప్రస్తుత ప్రధానమంత్రి ఇలాగే శృతి మించి ప్రవర్తిస్తున్నాడు. ఒక తప్పు కప్పుకోవటానికి ఇంకొకటి, ఒక సంచలనాన్ని మరుగు పరచటానికి ఇంకొకటి! ప్రజాగ్రహాన్ని మరల్చతతటానికి పుల్వామా దాడులు, ఆత్మీయ మిత్రుడి కష్టాన్ని కుంభకోణాన్ని దాచటానికి విపక్ష నాయకుడి బహిష్కరణ! నిజానికి నరేంద్ర మోదీ గారి ప్రసంగాలు ఒకసారి టీవీలల్లో ప్రసారం చేస్తే, ఆయన మంత్రులు, అనుయాయులు కాంగ్రెస్ నేతలని, ముఖ్యంగా నెహ్రూ కుటుంబసభ్యులని, దేశంలోని మహిళలను ఎంత అవమానించారో ప్రజలకు తెలుస్తుంది. మరి వారి మాటలను కూడా విచారించి శిక్షలు వేయాలి కదా! మాటలే కాదు, వారి అత్యాచారాలు, హత్యలకు కూడా రాజ్యాంగంలో శిక్షలే లేవు. మరి విపక్ష నాయకుడు అన్న దాంట్లో తప్పేముంది? నీరవ్ మోదీ, లలిత్ మోదీ నిన్న బయటపడ్డారు. మన ప్రధాని అదానీని రక్షిస్తూ, ఇవాళ బయటపడ్డారు. చేసే పనుల మీద సీబీఐ విచారణ వేస్తే తేలిపోతుంది కదా!
అయితే, విపక్ష నాయకుడి రాజకీయ ఎన్నికల బహిష్కరణను ఇంకో కోణం నుంచి కూడా పరిశీలించవచ్చు. ఆధునిక చరిత్రలో గుర్తుకొచ్చే ఇద్దరు నియంతల ప్రవర్తన, అనుసరించిన విధానాలు గమనిస్తే వాటిలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ఇటలీని పరిపాలించిన నియంత బెనిటో ముస్సోలినీ, జర్మనీని ఏలిన అధినేత అడాల్ఫ్ హిట్లర్ సమకాలీకులు, 29 జూలై 1883లో పుట్టిన ముస్సోలినీ తన అరాచక పాలనను 1925 నుంచి 1945 దాకా సాగించాడు. తన 10వ ఏటనే స్కూలులో ఒక బాలుడిని కత్తితో పొడవటంతో మొదలైన అతడి క్రూరత్వం, ఫాసిస్టు పార్టీ పెట్టి చివరిదాకా దాష్టీకాలు సాగించాడు. అలాగే, 1883 ఏప్రిల్ 20న పుట్టిన అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీ అధినేతగా 1933 నుంచీ 1945 దాకా నియంతృత్వ పాలన సాగించాడు. లక్షల మందిని క్రూరంగా చంపించాడు.
అయితే వీరిద్దరి ఉదాహరణల నుంచి నేర్చుకునే పాఠం ఒక్కటే. పాలితుల పట్ల ప్రేమ ఉండి వారిలో ఒకడిగా చరించి దేశానికి ప్రగతి సాధించేవాడికి ఉన్న ప్రశాంత జీవనం నియంతగా మారి, క్రూరమైన రీతుల్లో ప్రవర్తించి, ముఖ్యం గా తనను విమర్శించేవాళ్లు బతికి ఉండొద్దనే పద్ధతులు పాటించినవారికి ఉండదు. వారు పులి మీద స్వారీ చేస్తున్నట్టే! కొద్దిగా పరిస్థితి మారితే వారు సృష్టించుకున్న విధానాలే వారిని అధఃపాతాళానికి తొక్కేస్తాయి. మహా ఘోరమైన జీవితం చూడవలసి వస్తుంది. అసహనం, అధికార దాహం, విపక్షాల పట్ల కక్ష, విపరీతమైన వివక్ష, పక్షపాత ధోరణి ఉన్న నియంతలు చాలాకాలం మనలేరు. పదవిలో కొనసాగలేరు. అంతేకాదు, తమ అధికార బలం, ప్రజాభిమానం తగ్గుతున్నదన్న అనుమానం కలిగిన కొద్దీ ఒకదాని మీద ఒకటి తప్పులు చేస్తారు. అవే వారిని పదవీచ్యుతులను చేసే ఆయుధాలు.
ఇప్పుడు రాహుల్గాంధీ బహిష్కరణ, శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు. ప్రధానిలో ఒకరకమైన భయం మొదలైందన్న నిజానికి నిదర్శనం. ఎందుకంటే ఎంత బీజేపీ రెండు సార్వత్రిక ఎన్నికలు గెలిచినా, కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఒకటి నికరంగా దేశంలో ఉన్నది. ఇప్పుడు మోదీ భయం ప్రతిపక్షాలు తప్పిదారి కాంగ్రెస్తో కలిశాయంటే, బీజేపీ పని ఖతమైపోతుంది. ప్రజలు ఈ విషయం ఆలోచించాలి.
ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్గాంధీని జైల్లో పెట్టినా, బెయిల్ మీద విడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగుతుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రె స్ మీద ప్రేమ ఉండక్కరలేదు. నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. ఇదే జరిగిన రోజు బీజేపీ చరిత్ర ముగిసినట్టే! ఆధునిక నియంతలు ముస్సోలినీ, హిట్లర్ రెండురోజుల తేడాతో జీవితం చాలించడం చారిత్రక సత్యం. మోదీ-షా ద్వయం తప్పు మీద తప్పు చేసి అధికారం కోల్పోవటం దానిని చరిత్రలో లిఖించటం మన కండ్ల ముందే జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షితః..
కనకదుర్గ దంటు
89772 43484