కాంగ్రెస్ అసమర్థత, అవినీతి, అభివృద్ధి రాహిత్యంతో విసుగెత్తిన దేశ ప్రజలు నరేంద్ర మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకొని రెండుసార్లు అధికారం అప్పగించారు. ఆయన నాయకత్వాన దేశం అభివృద్ధి చెందటమే గాక, ధనిక వర్గాలకు బదులు ‘చాయ్వాలా’ తరగతికి మేలు జరిగే పరివర్తన రాగలదని, కాంగ్రెస్ ధ్వంసం చేసిన ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ జరుగుతుందని నమ్మారు.
ఈ ఎనిమిదేండ్ల కాలాన్ని సమీక్షించుకుంటే… ‘పరివర్తన’ కాదు గదా, ఏ ఒక్క ఆశ కూడా నెరవేరే సూచనలు కన్పించటం లేదు. ఈ మాట అనేందుకు ఎన్ని ఉదాహరణలనైనా, ఎన్నెన్ని గణాంకాలనైనా చెప్పవచ్చు. అందులో ఎక్కువగా చర్చకు రాని ఒక విషయం ముందుగా చెప్పుకొందాం. మోదీ తాను ‘చాయ్వాలా’ కుటుంబం నుంచి వచ్చాననీ, తనది బీసీ తరగతి (నూనె గానుగను ఆడించే తేలీలు) అని పదేపదే చెప్పుకోవటంలో మొదటినుంచే కొన్ని లోతైన అర్థాలను సూచించారు. ఆ మాటలు కేవలం ఆ వర్గాల ఓట్లను ఆకర్షించటం కోసం అన్నవి కావు. దానితో పాటు, భారత ప్రభుత్వ ఆర్థిక విధానాలలోనే పరివర్తన తీసుకువచ్చి, కాంగ్రెస్ కాలపు టాటా-బిర్లాల ఆధిపత్యం స్థానంలో అనేక సాధారణ పెట్టుబడిదారుల తరగతిని సృష్టించగలమన్నది ఆయన మాటల అంతరార్థం.
అదే ప్రకారం తొలుత కొన్ని విధాన నిర్ణయాలు చేశారు కూడా. అటువంటి వికేంద్రీకరణ ఫలితాలు మరొక స్థాయిలో ‘చాయ్వాలా’ తరహా కింది తరగతులకు చేకూరగలవని చెప్పటం తన ఉద్దేశం. ఈ మాటలు చెప్తూ.. మోదీ సామాన్య తరగతుల ఓట్లను బాగానే సంపాదించారు. మతం మత్తును అందుకు తెలివిగా జోడించారు. కాని వాస్తవంగా జరిగిందేమిటి? పెట్టుబడిదారులు, కొత్త తరం వారైనా మొత్తమ్మీద మోదీ స్వభావం ధనిక వర్గాలకు లాభం చేకూర్చటం. ‘చాయ్ వాలా’ తరగతికి ప్రయోజనం అన్నది వారిని భ్రమపెట్టే ముసుగు మాత్రమే. అందుకు అనుగుణంగా ఏం జరిగాయో ఒక చిన్న జాబితాను మాత్రం చూద్దాం.
మోదీ బ్రాండ్ ‘పరివర్తన’ ఏదో ఉంటుందని ఈ తరగతి కొంతకాలం పాటు బాగానే ఆశపడింది. కానీ చివరికి ఆయన పాలన ఒక ‘అపరివర్తన’గా లేదా ‘విపరివర్తన’గాతేలిపోతున్నది. ఇతర పార్టీ ప్రభుత్వాల కూల్చివేతలో కాంగ్రెస్ దుష్ట సంప్రదాయాన్ని తలదన్నటం, రాష్ర్టాల అధికారాలను కాంగ్రెస్కు మించి హరించి వేధించటం, ఎన్నికల్లో కండ్లు చెదిరే స్థాయిలో డబ్బు ఖర్చు వంటివి మోదీ పాటిస్తున్న రాజకీయ విలువల ‘పరివర్తన’కు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లోని నల్లధనాన్ని సత్వరం రప్పించి ప్రతి సామాన్యుని ఖాతాలో రూ.15 లక్షలు వేయటం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం, పేదలందరికీ ఇండ్లు మొదలైనవన్నీ గాలికిపోయాయి. మరోవైపు దేశంలోని సహజ వనరులు, విదేశాలతో వ్యాపారాల కాంట్రాక్టులు, ప్రైవేటీకరణల ద్వారా ప్రభుత్వరంగ ఆస్తులను మునుపెన్నడూ లేని స్థాయిలో తమ ఆశ్రితవర్గానికి అప్పజెప్పటం, సామాన్యులు బ్యాంకుల్లో దాచుకున్న మొత్తాల నుంచి వేలకు వేల కోట్ల రూపాయలు వ్యాపారుల పాలు చేసి వారిని విదేశాలకు తరలించటం, విమర్శకులను గతంలో ఎన్నడూ లేనంతగా వేధించటం వంటివి అనేకం జరిగాయి. ఆయన అసలు స్వరూపం మొదటి నుంచి అదే. గుజరాత్ సీఎంగానూ అదే చేశారు.
వీటన్నిటి మధ్య, కాంగ్రెస్ కాలానికి భిన్నమైన, ‘చాయ్వాలా’ తరగతికి అనుకూలమైన ‘పరివర్తన’ ఏమిటి? పరిస్థితి గతం కన్నా క్షీణించింది. ‘చాయ్వాలా’ తరగతిని మోదీ పచ్చిగా మోసగించారు. తనవారైన కొత్త పెట్టుబడిదారీ తరగతి, ధనిక తరగతి పెరుగుతున్నది. ఆర్థిక వ్యత్యాసాలు, ధనిక-పేద అంతరాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, నికర ఆదాయాల పతనం భయంకరంగా విజృంభిస్తున్నాయి. ఇందుకు పెద్దనోట్ల రద్దు, సబ్సిడీల్లో విపరీతమైన కోత వంటి చర్యలు అగ్నికి ఆజ్యమవుతున్నాయి. అధికారపక్షం అవినీతి కేసులు ఇంతకాలం దాగి ఉండగా ఇటీవల ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ‘చాయ్వాలా’ తరగతిని ఆదుకునే బృహత్తర పథకం ఏదీ ఒక్కటైనా కన్పించదు. అనగా, మొదట ఓట్ల కోసం ‘చాయ్వాలా’ తరగతిని ‘పరివర్తన’ పేరుతో కపటపు మాటలతో మభ్యపెట్టి, తర్వాత తన నిజస్వరూపం చూపారన్నమాట.
మోదీ బ్రాండ్ ‘పరివర్తన’ ఎక్కడ? ‘చాయ్వాలా’ తరగతిని ఉద్ధరిస్తున్నట్లు చూపే ఆర్థికాభివృద్ధి సూచీలు గాని, సామాజికాభివృద్ధి సూచీలు గాని ఏవీ కన్పించవు. ఎనిమిదేండ్ల పాలనలో అవన్నీ ఏయేటికాయేడు పతనమవుతూనే వస్తున్నాయి. దీనంతటిని బట్టి తేలుతున్నదేమిటి? సామాన్యుడి జీవితం దృష్టి నుంచి మోదీ పాలనను సమీక్షించి చూస్తే, కాంగ్రెస్ బ్రాండ్ నుంచి ఆయన బ్రాండ్ తెచ్చిన ‘పరివర్తన’ కేవలం శూన్యం. అది ఇంకా క్షీణించింది కూడానని ఎవరైనా వాదిస్తే కొట్టివేయటం కష్టం.
కాంగ్రెస్ అసమర్థత, అవినీతి, అభివృద్ధి రాహిత్యాలకు, ఆ కాలంలో సామాన్యుడి దుర్భర జీవితానికి, మోదీ పాలనలో ‘చాయ్వాలా’ తరగతి నమ్మి మోసపోయిన తీరుకు తేడా ఏమీ లేదని ఇటీవల అందరికీ వేగంగానే అర్థమవుతున్నది. మోదీ బ్రాండ్ ‘పరివర్తన’ ఏదో ఉంటుందని ఈ తరగతి కొంతకాలం పాటు బాగానే ఆశపడింది. కానీ చివరికి ఆయన పాలన ఒక ‘అపరివర్తన’గా లేదా ‘విపరివర్తన’గా తేలిపోతున్నది. ఇతర పార్టీ ప్రభుత్వాల కూల్చివేతలో కాంగ్రెస్ దుష్ట సంప్రదాయాన్ని తలదన్నటం, రాష్ర్టాల అధికారాలను కాంగ్రెస్కు మించి హరించి వేధించటం, ఎన్నికల్లో కండ్లు చెదిరే స్థాయిలో డబ్బు ఖర్చు వంటివి మోదీ పాటిస్తున్న రాజకీయ విలువల ‘పరివర్తన’కు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని ఈ రోజున కాపాడుతున్నది పరమ బాహాటమైన, దుర్మార్గమైన మతతత్వంతో పాటు, ప్రతిపక్షాల బలహీనత మాత్రమే. కాంగ్రెస్కు భిన్నంగా మోదీ బ్రాండ్ ‘పరివర్తన’ అన్నది ఏ విధంగా చూసినా ఒక పెద్ద అబద్ధం.
టంకశాల అశోక్