భారత దేశానికి ప్రగతిశీల ఎజెండా కావాలి. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ఇంకా మన దేశాన్ని పేదరికం ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టం చేసే ప్రజలు ఉండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? ఐదేండ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు. దేశ ప్రజల సంక్షేమం ముఖ్యం. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల కనీస అవసరాలు గుర్తించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పు రావాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. చరిత్ర సృష్టించాలంటే చారిత్రక దృక్పథం ఉండాలి. కాలానికి ఎదురీదాలంటే కాలజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ లక్షణాలున్న కేసీఆర్ నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరం.
దేశంలోనే భాగమైన రాష్ర్టాల రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో భాగం కాకుండా ప్రాంతీయ రాజకీయాలుగా కుదించబడటంలోనే నేటి వర్తమాన రాజకీయ విషాదం దాగివుంది. ఈ విలోమ రాజకీయ విధానం నుంచి దేశాన్ని బయటపడేసి ప్రాంతీయ రాజకీయాలను దేశీయంగా మార్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషి భవిష్యత్తులో విప్లవాత్మకంగా మారనున్నది. జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని కేసీఆర్ సంకల్పించారు.
కాంగ్రెస్, బీజేపీలు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి సమృద్ధిగా ఉన్న నీళ్లను కూడా పొలాలకు అందివ్వలేకపోయాయన్నది కేసీఆర్ ఆ రెండు జాతీయ పార్టీలపై మోపుతున్న అభియోగం. రైతులందరికీ సాగునీటి సౌకర్యం కల్పించడమే తన అజెండా అని, దానికి సంబంధించిన లెక్కలనూ చెబుతున్నారు. తాను తెలంగాణ రైతులకేం చేస్తున్నానో దేశవ్యాప్తంగా అదే చేస్తానని రైతుల్లోకి సందేశం పంపుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల రైతు సమస్యలపై కేసీఆర్కు పూర్తి అవగాహన ఉంది.
విప్లవానికి పరిస్థితులు పరిపక్వం కాకుండా విప్లవం రాదని చరిత్ర చెబుతోంది. పరిస్థితులు పరిపక్వంగా ఉన్నా మార్పునకు దోహదపడే శక్తులు బలహీనంగా ఉన్నప్పుడు అది సాధ్యపడదు. దేశ చరిత్రలో మార్పు కోసం ప్రయత్నాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. గమ్యాన్ని ముద్దాడాలంటే గట్టి పట్టుదల ఉండాలి. పట్టువిడుపుల ఒడుపు తెలిసి ఉండాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే ఆసాంతం అనితర సాధకుడిగా నిలబడాలి. అసాధ్యుడిగా అవతరించాలి.
పట్టణీకరణ పెరుగుతున్నపప్పటికీ భారత్ ఇప్పటికీ వ్యవసాయాధారిత దేశమే. రైతులే మెజారిటీ ఉంటారు. రైతు బిడ్డలే ఇతర వృత్తుల్లో ఉంటారు. అందుకే రైతుల్ని ఏకతాటిపై తీసుకొస్తే రాజకీయంగా సంచలనం నమోదవుతుంది. అయితే అదంత తేలిక కాదు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరూ నమ్మకపోయినా అనుకున్నది సాధించడానికి రంగంలోకి దిగారు. రాష్ర్టాన్ని సాధించేవరకూ వెనక్కి తగ్గలేదు. అందుకే కేసీఆర్ అంచనా వేస్తున్న రైతు రాజకీయం క్లిష్టంగా ఉందని, అసాధ్యమని ఎక్కువ మంది భావిస్తున్నప్పటికీ ఆయనకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది.
తెలంగాణలో మాదిరిగానే దేశమంతటా రైతులకు నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతోపాటు వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నింటినీ ఇవ్వవచ్చని కేసీఆర్ వివరించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రపాలకులు వహించిన నిర్లక్ష్యాన్ని కేసీఆర్ బట్టబయలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ, దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దమననీతిని తీవ్రంగా ఖండిస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అపార అనుభవం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి ఆయన సేవలు ఎంతో అవసరం.
దేశంలోనే భాగమైన రాష్ర్టాల రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో భాగం కాకుండా ప్రాంతీయ రాజకీయాలుగా కుదించబడటంలోనే నేటి వర్తమాన రాజకీయ విషాదం దాగివుంది. ఈ విలోమ రాజకీయ విధానం నుంచి దేశాన్ని బయటపడేసి ప్రాంతీయ రాజకీయాలను దేశీయంగా మార్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషి భవిష్యత్తులో విప్లవాత్మకంగా మారనున్నది. జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని కేసీఆర్ సంకల్పించారు. ఇదేమీ జాతీయ రహదారి కాదు.
అడుగడుగునా ముళ్లబాట. దారి పొడవునా సవాళ్లు. అపనమ్మకం. సరిగ్గా తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళే కేసీఆర్ను చుట్టుముట్టనున్నాయి. ఆ చిక్కుముళ్ళన్నీ ఒక్కొక్కటిగా తొలగించుకొని ముందుకు సాగి విజయం సాధించిన కేసీఆర్ తన ఉద్యమ అనుభవాలను రంగరించి జాతీయ రాజకీయాలలోనూ విజయం సాధిస్తారు. మోదీకి వ్యతిరేకంగా ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా ‘బీజేపీ ముక్త్ భారత్’ అనే నినాదాన్ని సంధించిన మొదటి నాయకుడు కేసీఆర్. భాషా పటిమ, వ్యూహరచన శక్తి, ప్రజల్లో రాజకీయ కార్యకర్తల్లో సూటిగా నాటుకుపోగలిగేలా చెప్పగలగటం కేసీఆర్ కవచ కుండలాలు.
విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతుంది. మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తుల వలన అశాంతి ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వందల ఏండ్ల వెనక్కు తీసుకుపోతుంది. దేశ ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడటం మనందరి బాధ్యత. రాజీ పడి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బలమైన కేంద్రం-బలహీనమైన రాష్ర్టాలు అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను కేంద్రం హరిస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా రాష్ర్టాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాష్ర్టాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది. రాష్ర్టాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది.
విపరీతమైన అధికారం వల్ల సంక్రమించిన అతిశయంతో నరేంద్రమోదీ, అమిత్ షా దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. మతం పేరిట ప్రజల్ని విభజించి, విద్వేషాలు రగిలించి పబ్బం గడుపుకొంటున్నారు. దీనిని దేశ ప్రజానీకానికి కేసీఆర్ వివరించనున్నారు. బీజేపీ విద్వేషపూరిత కార్యకలాపాలను ఆయన ఎండగట్టనున్నారు. దేశంలో 75 ఏండ్లుగా కొనసాగుతున్న మూసధోరణి రాజకీయాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారు. వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉంది.
తీగల అశోక్ కుమార్
79891 14086