మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం. అత్యంత కీలకమైన రోజు. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ఏకతాటిపై తీసుకువచ్చి ప్రత్యర్థులకు ఉద్యమరుచి చూపిన దినం ‘2009 నవంబర్ 29’.
తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం ‘2009 నవంబర్ 29. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత తన 11 రోజుల దీక్షను కేసీఆర్ విరమించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో ఎలాంటి హింసకు తావులేకుం డా, శాంతియుతంగా గాంధేయ మార్గంలో పోరాడారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ధీరుడు కేసీఆర్. నాటి ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఇప్పటికీ జనాల హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. చరిత్రలో ఎక్కడా జరుగని విధంగా రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు చేపట్టిన సకల జనుల సమ్మెతో పాలన స్తంభించింది.
14 (ఎఫ్) రగడ తెలంగాణ ఉద్యమ దశ-దిశను మార్చి ఉద్యమానికి నాంది పలికింది. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పింది. హైదరాబాద్ నగరాన్ని 6వ జోన్ నుంచి వేరు చేస్తూ ఫ్రీ జోన్గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. ఇది తెలంగాణ ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చింది.
రంగధాంపల్లి దీక్షా శిబిరంలో అలజడి: ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో ‘ఫ్రీజోన్ కాదురా హైదరాబాద్ మాదిరా’ పేరిట 14 (ఎఫ్)కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యోగ గర్జన భారీ బహిరంగసభ కేసీఆర్ సంచలన నిర్ణయానికి వేదికైంది. ఈ సభలో కేసీఆర్ తెలంగాణ కోసం తాను 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమైనట్లు సంచలన వాఖ్యలు చేశారు. తర్వాత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయల్దేరి సిద్దిపేట దీక్షా స్థలానికి చేరుకుంటున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో సిద్దిపేట ఆమరణ నిరాహార దీక్ష స్థలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేసీఆర్ అరెస్టు వార్త విన్న వెంటనే సిద్దిపేటలోని రంగధాంపల్లి దీక్షాశిబిరంలో అలజడి మొదలైంది. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మం త్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి, ఇతర పార్టీ నేతలతో కలిసి దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా స్థలి వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు బారికేడ్లను బద్దలుకొట్టి దీక్షా ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఓ వైపు పోలీసులు తెలంగాణవాదులపై లాఠీలు జులుపిస్తే.. మరోవైపు కోపోద్రిక్తులైన తెలంగాణవాదులు ‘జై తెలంగాణ’ నినాదాలు మార్మోగించారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తెలంగాణవాదులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు. పోలీసు అధికారుల వైఖరితో ఒక దశలో తీవ్ర ఉద్వేగానికి లోనైన హరీశ్రావు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా శిబిర ప్రాంగణంలోకి దూసుకొచ్చి హరీశ్రావు సహా ముఖ్య నాయకులను అరెస్టు చేసి వేర్వేరు పోలీస్టేషన్లకు తరలించారు.
చారిత్రాత్మక దీక్షలు: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను సీమాంధ్ర ప్రభుత్వం కుట్రలు పన్ని పోలీసుల చేత భగ్నం చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ యావత్తు ప్రజలు గ్రామగ్రామాన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చరిత్రలో నిలిచిపోయేలా దీక్షలు జరిగాయంటే అతిశ యోక్తి కాదు. సిద్దిపేటలో నిత్యం జనసమర్థం ఉండే అంబేద్కర్ సర్కిల్లోని పాత బస్టాండ్ వెనుకభాగంలో దీక్షా శిబిరం వేదికను హరీశ్రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. 1,531వ రోజుల పాటు నిర్విరామంగా దీక్షలు కొనసాగాయి. దీక్షాస్థలికి ఎంతో మంది మేధావులు, నాయకులు, ప్రముఖులు వచ్చి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ పలు సార్లు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు.
దీక్షలో సిద్దిపేట పట్టణంతో పాటు సిద్దిపేట, చిన్నకోడూరు మండలాలకు చెందిన మహిళా సంఘాలు, జేఏసీ నాయకులు దీక్షలో కూర్చుని విజయవంతం చేశారు. పాలమాకుల దీక్షా శిబిరం వెయ్యి రోజుల పాటు కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మార్చి 13న సిద్దిపేట దీక్షలు మార్చి 9న పాలమాకుల దీక్షలను విరమింపజేశారు. సిద్దిపేటలో 1,531 రోజుల పాటు దీక్షా స్మృతులకు గుర్తుగా పైలాన్ నిర్మించారు.
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఆంధ్రోళ్లతో కొట్లాడితే కేసీఆర్ ఆమరణదీక్ష అనంతరం ఐదేండ్లకు తెలంగాణ రాష్ట్ర సంకల్పం సిద్ధించింది. యూపీఏ కేంద్ర ప్రభుత్వం పరిణామాలు, ఉత్కంఠల నడుమ వాయిదాలపై ఊరిస్తూ అఖిలపక్ష తీర్మానాలు చేయించి లోక్సభలో 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఫిబ్రవరి 20న హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు మార్చి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజముద్ర వేశారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో అదేరోజు తెలంగాణ ఉద్యమ రథసారథి, తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రమాణ స్వీకారం చేశారు.
-కత్తుల శ్రీనివాస్రెడ్డి
91827 77027