‘ఏమె… నీ బంగారం ఇయ్యరాదు రాయచూర్ గంజిలకు వొయి ఇంత అప్పు దీసుకొస్తా’ అని నేననుడే ఆల్శం నా మీదికి కొట్లాటకు వస్తుండె నా పెళ్లాం గోవిందమ్మ. ‘నా పుట్టినింటోళ్లు వెట్టిన బంగారం అమ్మడానికైతే ఇయ్య. సేటు దగ్గర్నుంచి మళ్లా ఇడిపిచ్చుకొస్తనని మన చిన్నోని మీద ఒట్టెయ్యిమ’ని లొల్లి లొల్లి జేస్తుండె. ఎప్పటి పరిస్థితి ఎట్లుంటదో ఎవ్వనికెరుక, అందుకే నేను ఎవ్వరి మీనా ఒట్టెయ్యకపోతుంటిని. కొద్దిసేపటి తర్వాత ఏమనిపిస్తుండెనో ఏమో పాపం మా ఇంటామెనే ‘ఇగవట్టే గోవిందప్పా’ అని గుండ్ల టిక్మాని కాన్నుంచి తీసిస్తుండె. ఆమెకు మాత్రం ఉండదా ఇరువై నాలుగెకరాల భూమి పడావుంటే ఈ ఆరుగురు పిల్లల్ని ఎట్లా మేం సాకేదని?
మా అప్ప(తిమ్మప్ప)కు నేను, అక్క ఇద్దరమే కావట్టి, మాకు ఆరుగురు పిల్లల్నిచ్చిండేమో ఆ దేవుడు. మాకు నలుగురు కొడుకులు, ఇద్దరు ఆడబిడ్డలు. వాళ్లే మాకు సర్వం. వాళ్లను అపురూపంగా సాదుకుంటున్నం. మా అప్ప నాకిచ్చిన 24 ఎకరాల భూమిని సాగు చేసేటందుకు నాకు మా తాతలు యాదికొస్తుండె. నీళ్లక్కరువొచ్చి ఓ ఏడు భూమి పడావుంచినం. ఇట్లనే ఏండ్లకేండ్లు భూమి పడావుంచితే పోరగాండ్ల సదువేమో గని, తిండికి ఒర్రిసత్తరని మా పోరాటం. మంచో, శెడో ఏమున్నా ఇద్దరమే ఇంట్లమాట బైట వడకుండా సంసారం ఎల్లదీసుకునేది. ఇట్లా దుడ్లక్కరువొచ్చినప్పుడల్లా అప్పుకు వొయ్యేది గాదు నేను, గోవిందమ్మ బంగారం తీసుకవొయ్యి కర్ణాటక, రాయచూర్ గంజిలున్న సేటు దగ్గర కుదవెట్టి ఇత్తునాలు, మందు, మాకులు తీసుకొచ్చేది. అట్లా మా అక్కెర ఒడ్డెక్కిచ్చుకునేది. మళ్లా పంట చేతికి రాంగనే ఆ సేటుకు పంట అప్పజెప్పి బంగారం తీసుకొచ్చి మా ఇంటామెకిచ్చేది. ఆ బంగారాన్ని జూసి ఆమె తెగ మురిసేది. అట్లా సాగేది మా సంసారం.
పంట సాగుకు నీళ్ల కరువు అడ్డు రావొద్దని ఓయేడు ఇద్దరాలుమొగలం మా పొలంల బావి తవ్విద్దామనుకున్నం. ఒక్క బంగారం కుదవెడితే అయ్యే పనికాదు, నాడు భూమి గూడ బ్యాంకుల కుదవెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి అస్సలే ఒప్పుకోలె నా పెళ్లాం గోవిందమ్మ.
1980: జోగులాంబ గద్వాల జిల్లా, కేటిదొడ్డి మండలంలోని కొండాపురం ఊరు మాది. మాక్కావలసినోళ్లే. పెట్టువడికి తన దగ్గెర పైసల్లేక తన భూమి కాయితాలు కుదవెట్టి సొసైటీ బ్యాంకుల క్రాప్ లోన్ తీసుకున్నడు. అప్పటి కరువు వల్ల ఏడాది, రెండేండ్లో మిత్తీ గట్టిండు. ఇగ తతిమయి గట్టుడు తనతోని కాలే. అంతే, ఓ రోజు బ్యాంకోళ్లొచ్చి మాట, మర్యాద లేకుండా పెద్దర్వాజ తలుపులతో సహా ఇంటి తలుపులన్నీ పీక్కవోయిర్రు. పాపం ఆ ఇంటి సంసారం రోడ్డుమీద వడ్డది. మా ఊరున్నది సిన్నగనే గని ఇక్కడి రాజకీయాలు మాత్రం సిన్నగుండయి. తన పరిస్థితిని అర్థం చేసుకోలేని కొందరు ‘అయ్యో పలానాయ్న ఇట్లనటా.. అయ్యో పలానాయ్న అట్లనటా..’ అని గుసగుసలు మొదలువెట్టిర్రు. పాపం ఆ మనిషి ఇజ్జతికి సగం సచ్చిండనుకో…
‘భూమి కాయితాలు బ్యాంకుల కుదవెట్టుడు ఎందుకొద్దే’ అంటే.. పై కథ చెప్పుకొచ్చింది గోవిందమ్మ. ‘ఈయేడు కాకుంటే అచ్చే ఏడు తవ్వించుకుందాం బాయి, నా ఒంటిమీద బంగారం మొత్తం ఇస్తా, రాయచూర్ గంజిల కుదవెట్టి అప్పుదే… 24 ఎకరాల్ల 24 గంటలు కట్టవడుదాం. మళ్లా బంగారం తెచ్చుకుందాం గని, నా ఉమ్మన్నగారి గోవిందప్ప’ నలుగురిట్ల నవ్వులపాలు కావొద్దని చెప్పుకొచ్చింది.
2021: ‘ఓయ్.. ఎమే… లెవ్వు తెల్లారింది’ అని నేను మా ఇంటామెను లేపుతనే ఉన్నా, ఆమె మాత్రం ఉలుకు లేదు, పలుకు లేదు. ఓ ఐదు, పది నిమిషాలైతే గానీ నాకు తెల్వలేదు ఆమె కాలంజేసిందని, నా తోడు ఇడ్శిపోయిందని. డబ్బు ఏండ్ల మా బంధం తెగిపోయిందని. అప్పటిదాన్క హుషారుగున్న నా పానం మా ఇంటామె సావుతో సగం సచ్చిపోయింది. తొంభై ఏండ్లకుపైనున్న నాకిప్పుడు నా కొడుకులే దిక్కూ మొక్కు. నాకున్న భూమిని నలుగురికి సమానం పంచిచ్చిన. నేనిగ వాళ్లనే నమ్ముకొని కొరి జీవునంతోని బతుకునెళ్లదీస్తున్నా. నేననుకున్నట్టు నా కొడుకులు మంచోళ్లు. నన్ను ఏనాడూ ఒంటరిని జేయలె. నా చిన్నోడు వాని పాలుకు వొయ్యే భూమిని వాని పేరుమీద జేస్కోలే, ఇంకా నా పేరు మీదనే ఉన్నది. ఏటా వచ్చే యాభై వేల రైతుబంధు దుడ్లు నా అకౌంట్లనే వడ్తయి. నెల నెలా ఆసరా పింఛనొస్తది.
మా చిన్నోడు పట్నంల ఉంటె, నేను వానింట్లనే ఉంటున్న. మిగతా ముగ్గురు కొడుకులు నా మంచిచెడ్డలర్సుకుంటరు. మొన్ననే పానం సొలిగినట్టయి కిందవడ్తే మా చిన్నోడు ఫోన్జేసిండు. ‘అప్పా… మంచిగున్నవా..’, ‘ఆ… మంచిగనే ఉన్నరా’, ‘కింద వడ్డవని తెల్సింది, ఈ ఐతారం సెలవు. నేనొస్తా.. నువ్వేం రంది వెట్టుకోకు’ అన్జెప్పిండు. ‘సరే గనీ, ఆ క్రాప్లోన్ మాఫయిందా?’ అనడిగితే, నవ్వవట్టిండు ఫోన్లనే. అంటే మాఫీ అయినట్టే. అంతకుముందు డబ్బు వేలు, మొన్నో ఎనభై వేలు రెండుసార్లు బ్యాంకుల దీసుకున్న రుణం మాఫయింది. పోయినసారి రుణం మాఫీ అయినప్పుడు మా ఇంటామె ఉన్నది. ‘నాడు మనం ఎవుసం జేసినప్పుడు ఎవ్వలూ ఇట్లా రుణం మాఫీ చెయ్యలేదెమయ్యా?’ అని సంబురవడ్డది. ఇప్పుడు గూడ
మా ఇంటామె ఉంటే ఎంత సంబురవడేదో…
-గడ్డం సతీష్
99590 59041