జనాల నుంచి, జన జీవితం నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు నేడు సంప్రదాయక వామపక్షాలతో జత కడుతున్నాయి. వాటి అనుభవాలను, నిర్మాణ సామర్థ్యాలను కలగలుపుకుని తమ తమ దేశాలలో సరికొత్త ఆర్థిక నమూనాల అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పుడిక్కడ మన కళ్ల ముందర జరగనున్నదీ… జరుగుతున్నదీ ఇదే. జన జీవితం నుంచి, దాని తాలూకు కష్టనష్టాల మదింపు, మథనం నుంచి పుట్టుకొస్తోన్న సరికొత్త వ్యక్తులు… శక్తులు… మన దేశంలోని రాజకీయ యవనికపై సంఘటితపడుతోన్న… మించి పడితీరాల్సిన పరిస్థితి నేటిది..!!
ఒక రాజకీయ పక్షంగా బీజేపీ నేడు తిరుగులేని శక్తిగా పైకి కనబడుతోంది. దానిని ఎదుర్కొని, అధిగమించడం అసాధ్యమైనదిగా అనిపించే పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ర్టాలలో లేదా స్థానిక ఎన్నికలలో నిజానికి బీజేపీ పనితీరు అంత గొప్పగా ఏమీ లేకపోయినా ఇది నిజం. అన్ని సంప్రదాయక, రాజ్యాంగ పరిమితులనూ, నిబంధనలనూ ఉల్లంఘిస్తూ అయినా సరే బీజేపీ తన రాజకీయ ఆధిపత్య స్థానాన్ని పదిలపరచుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన ప్రతిఘటనను నిర్లిప్తంగానూ, అర్ధ మనస్కంగానే నిర్వహిస్తోన్నా అది అనేక రాష్ర్టాల ఎన్నికలలో గణనీయంగానే ప్రజల ఆదరణను పొందుతోంది. దీనికి కారణం గతంలో అది యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలలో అనుసరించిన అనేక సంక్షేమ విధానాలు. ఈ విధానాల ముద్ర దేశంపై ఇప్పటికీ బలంగానే ఉంది.
కాబట్టి నేడు బీజేపీ హయాంలో ‘ఉచితాల’ వ్యతిరేకత పేరిట నీరుకార్చివేయబడుతోన్న సంక్షేమ పథకాల నేపథ్యంలో, ప్రజానీకానికి మరలా కాంగ్రెస్ సంక్షేమ యుగం మెరుగైనదిగానూ… ఉత్తమమైనదిగానూ కనపడడం ఆశ్చర్యమేమీ కాదు. అందుచేతనే నేడు కాంగ్రెస్కు లభిస్తోన్న మద్ధతులో సింహభాగం దేశంలోని కుటుంబీకులలో, ఆర్ధిక నిర్వహణా బాధ్యత, భారం తమ భుజాలపై ఉన్న వారి నుండి అత్యధికంగా వస్తోంది. కాగా, ఇంకా సమాజంలోని ఆర్థిక పార్శ్వంలోకి పెద్దగా అడుగుపెట్టని, ఒక రకంగా పైలాపచ్చీసు, ఏ బాధ్యతలూ లేని తరంలో కాంగ్రెస్కు పెద్దగా మద్దతు లేదు. నిజానికి, ఈ వర్గం వారిలో (ముఖ్యంగా యువజనులు) బీజేపీకి బలమైన మద్దతు, పునాది ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం స్థూలంగానూ, లేదా ప్రస్తుతం రాహుల్ పాల్గొంటోన్న భారత్ జోడో యాత్ర క్రమంలోనూ నిర్వచించేందుకు కష్టసాధ్యమైన అస్పష్ట, అధివాస్తవిక భావాలు, ఆలోచనలు అయిన ప్రేమ, లౌకిక వాదం, ప్రజాస్వామ్యం (51:49 తీరులో) వంటి వాటిపైనే తన కేంద్రీకరణనూ, దృష్టినీ పెడుతున్నది.
మనం ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటి ఉంది. అది, గత 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత చరిత్ర యావత్తూ పాలక, ప్రతిపక్షాల పోరుకు కేంద్ర బిందువుగా ఈ ‘ప్రజాస్వామ్యం’ భావన ఉంది. అందుచేతనే నేటికీ భారత రాజకీయాలలో 1970లలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చాలా పెద్ద, కీలక విభజన రేఖ, ప్రచారాంశంగా ఉంది.
అయితే, ఈ ప్రజాస్వామ్య భావన మీద, తమ జీవితాలను మెరుగుపరచగలగడంలో దాని వైఫల్యం మీద, దేశంలోని అత్యధిక మంది ప్రజానీకానికి అపనమ్మకం ఇప్పటికే ఏర్పడింది. ఈ క్రమంలోనే, ఈ ‘ప్రజాస్వామ్యం’, ‘లౌకికవాదం’ భావనల స్ధానంలో బీజేపీ, మోదీలు ప్రవచించే 80:20 (హిందూ, ముస్లిం) తాలూకు నూతన అధిక సంఖ్యాక భావన చొరబడగలిగింది. పైగా, ఈ రకమైన 80:20 విభజన ప్రజాస్వామిక భావన తాలూకు 51:49 విభజన రేఖకంటే మరింత స్పష్టంగానూ, జనాలు తమ కళ్లముందు ‘వాస్తవ’ రూపంలో దర్శించగలిగినదిగానూ కనపడగలగడం దాని తాలూకు బలం. 51:49 కంటే 80:20 అనేది వాస్తవంగా అది ఎంత నిర్హేతుకమైనది అయినప్పటికీ, అది మరింత మెరుగైన (అధిక సంఖ్యాకుల మద్దతు గల) ప్రజాస్వామ్య రూపంగా కనపడడం ఆశ్చర్యం కాదేమో..!!
కాబట్టి రాహుల్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు లేదా మన దేశంలోని మరే ఇతర రాజకీయ పక్షం లేదా నేత అయినా కావచ్చు, ప్రస్తుతం 51:49, లౌకికవాద, ప్రజాస్వామిక అమూర్త ఆయుధంతో మోదీ, బీజేపీల 80:20 నిర్దిష్టతను ఎదుర్కోలేకపోతున్నారు. దానితోపాటుగా, స్వయంగా తామే దేశంలో 1991లో తెచ్చిన ఆర్థిక సంస్కరణలకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతగా రాహుల్ గాంధీ 180 డిగ్రీల వ్యతిరేక దిశలో ప్రత్యామ్నాయాలను బలంగా ముందుకు తేలేకపోతున్నారు. గతంలోని సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల పరిధిలోనే కాస్తంత సంక్షేమ విధానాల వక్కాణింపు మినహాయించి, మరే సంపూర్ణంగా భిన్నమైన ఆర్ధిక నమూనాను ప్రతిపాదించలేని అశక్తత ఆయనది! బహుశా ఈ లోపం వల్లనే నేడు విఫల 51:49 లేదా లౌకిక ప్రజాస్వామిక విభజనలూ లేదా ఆలోచన స్థానంలో వచ్చి చేరిన 80:20 రేఖను అధిగమించగల మెరుగైన, మరింత నిర్దిష్టమైన విభజన రేఖ లేదా మెజారిటీ జనం తాలూకు అసలు సిసలు ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించగల ప్రత్యామ్నాయ ఆలోచన ఏదీ కాంగ్రెస్ వద్ద లేదు.
కాగా, అటువంటి ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవడం నేడు కాంగ్రెస్కు సాధ్యం కాకున్నా నేడు మన దేశం ముందర మరింత నిర్దిష్టమైన, నికరమైన, నిజమైన అధిక సంఖ్యాకుల అనుకూల విభజన రేఖ అయిన 99:1 అవసరం ఉంది. ఇది ఒక్క శాతం లేదా అంతకంటే తక్కువ అయిన దేశంలోని ధనిక వర్గానికి అనుకూలించే ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయంగా, 99 శాతం లేదా ఆపైన జనాల అనుకూల ఆర్థిక విధానాల నమూనాను ప్రతిపాదించే విభజన రేఖ. కాబట్టి, దేశంలో ఇప్పటికే పెరిగిపోయిన (‘K’ తరహా) ఆర్థిక అసమానతలు, సంపద పంపిణీలో తీవ్ర వ్యత్యాసాల స్థానంలో, జనాలకు మరింత న్యాయమైన, మరింత సమానత్వం గల ఆర్థిక వ్యవస్థను హామీ చేయగల విధాన నమూనా ఇది. కాగా ప్రస్తుతం దేశంలోనూ, ప్రపంచంలోనూ కూడా పెరిగిపోయిన… రోజు రోజుకూ మరింత తీవ్రతరమవుతోన్న ప్రజల ఆర్థిక కడగండ్లు, నిరుద్యోగం, ధరల పెరుగుదలల క్రమంలో రానున్న అనతికాలంలోనే ఈ 99:1 విభజన రేఖ అనివార్యంగా నేటి బలీయమైన విభజన రేఖ అయిన 80:20 కంటే కూడా వేగంగానూ… బలంగానూ జనాలలో పరివ్యాప్తం కాగలదు. దీనికి మరొక ప్రధాన కారణం 80:20 లాగానే… నిజానికి దానికంటే మరింత నికరంగా, నిర్దిష్టంగా, ప్రస్ఫుటంగా జనాల కళ్ల ముందర కనపడగల సామాజిక, ఆర్థిక అడ్డు గీత ఈ 99:1. సంపదను ప్రదర్శించుకోవడం, ధనికుల విలాసవంతమైన జీవిత సరళి, ఖరీదైన పెళ్లిళ్లు, ఆడంబరమైన అలంకారాలు, లగ్జరీ కార్లు, విల్లాలు తదితరం అన్నీ ఒక ప్రక్కన, వేగంగా దిగజారిపోతోన్న ఆర్థిక స్థితిగతుల అత్యధికుల జీవితాలు మరో పక్కన, ఈ విభజన రేఖను రాను రానూ మరింత బలంగా గీస్తాయి.
కానీ, గతం తాలూకు అలవాటు బలం వల్ల ప్రతిపక్ష పాత్రను కేవలం రాజకీయ పక్షాల ఏకీకరణ లేదా పునరేకీకరణలు గానూ… లేకుంటే పదేపదే వాడడం వల్ల పలచబడి నీరసించిన ‘ప్రజాస్వామ్యం లేదా లౌకికవాదం’ వంటి పదజాలాన్ని మరింత బలంగా అంటిపెట్టుకుంటూ పలవరిస్తూ పోతే ఏదో ఒక శుభోదయాన పాలక బీజేపీని పక్కకు తోసేసి తిరిగి మరలా పాలనాపగ్గాలను చేపట్టగలం అనే భ్రమల వల్ల నేటి వరకు దేశంలో కొత్త ఆలోచనల, పరిష్కారాల ప్రత్యామ్నాయ గాలులు పైచేయి సాధించలేదు.
సంప్రదాయకంగా వామపక్షాలు ఈ 99:1 భావనకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినా… చారిత్రకంగానూ, రాజకీయంగానూ రకరకాల కారణాల వల్లనూ… వాటి తాలూకు బ్యాగేజి వల్లనూ కూడా నేడు వామపక్షాలు గణనీయంగా నీరసించాయి. ఇదంతా అచ్చంగా లాటిన్ అమెరికా దేశాల రాజకీయ, చారిత్రక క్రమాన్ని పోలిన సందర్భం. లాటిన్ అమెరికా దేశాలలో కూడా సంప్రదాయక వామపక్ష రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ నేడు లాటిన్ అమెరికాలో వీస్తోన్న ప్రజానుకూల రాజకీయ పవనాలలో ప్రధాన పాత్ర వీటిది కాదు. ఆ దేశాలలో క్యూబా విప్లవం నాటి నుంచి నేటి వరకు సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయ మొలకలు వేళ్లూనుకుంటూ వస్తున్నాయి. జనాల నుంచి, జన జీవితం నుంచి పుట్టుకొచ్చిన ఈ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు నేడు సంప్రదాయక వామపక్షాలతో జత కడుతున్నాయి. ఈ వామపక్షాల అనుభవాలను, నిర్మాణ సామర్థ్యాలను కూడా కలగలుపుకుని తమ తమ దేశాలలో సరికొత్త ఆర్థిక నమూనాల అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పుడిక్కడ మన కళ్ల ముందర జరగనున్నదీ… జరుగుతున్నదీ ఇదే. జన జీవితం నుంచి, దాని తాలూకు కష్టనష్టాల మదింపు, మథనం నుంచి పుట్టుకొస్తోన్న సరికొత్త వ్యక్తులు… శక్తులు… మన దేశంలోని రాజకీయ యవనికపై సంఘటితపడుతోన్న… మించి పడితీరాల్సిన పరిస్థితి నేటిది..!!
ఈ క్రమంలోనే కొంత అస్పష్టత, మరికొంత అసంఘటిత స్థితిలో ఒక కేంద్ర బిందువు లేకుండా పరిభ్రమిస్తోన్న నూతన రాజకీయ ఆలోచనలు, శక్తులను నేడు ఏకీకృతం చేసి, సంఘటితపరచగల ఒక బలమైన ఇరుసు లేదా కేంద్రం అవసరం. అటువంటి పాత్రను, చారిత్రక అవసరాన్ని బీఆర్ఎస్ పోషించగలదని, తీర్చగలదని ఆశించడం తప్పు కాదేమో. బహుశా అది తప్పనిసరేమో!!!
-డి.పాపారావు , 98661 79615