బీఆర్ఎస్ ఏం చేస్తుంది? టీఆర్ఎస్ను అభిమానించే వారు, వ్యతిరేకించే వారు అందరినోట వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఏదైతేనేం బీఆర్ఎస్ ఒక చర్చను, ఒక ప్రశ్నను లేవనెత్తింది. టీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేసిందో, బీఆర్ఎస్ దేశంలో అదే చేయబోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రజాప్రతినిధుల సంఖ్య స్వల్పం. ఐనా భావజాల వ్యాప్తి ద్వారా ఏ విధంగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించిందో అదే విధంగా బీఆర్ఎస్ విజయం సాధించనుంది.
బీఆర్ఎస్.. తన ఆవిర్భావానికి ముందే బీజేపీని చావు దెబ్బ తీసింది.ఎన్డీటీవీ ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొన్నారు. ‘ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తున్నది అని ఆరోపిస్తున్నారు. ఆధారం ఏమిటి?’ అని యాంకర్ ప్రశ్నిస్తే, నేను ఇంత కాలం ఈ విషయం చెబితే మీరు ఆధారాలు ఏవి అన్నారు. తెలంగాణలో స్టింగ్ ఆపరేషన్లో పట్టుకున్నారు కదా? అని కేజ్రీవాల్ చెప్పారు. జాతీయ స్థాయిలో ఈ అంశం బీజేపీకి పెద్ద మచ్చగా మారింది.
ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లే లెక్క అని అంతా అనేదే. కానీ టీఆర్ఎస్ ఒకే ఒక సీటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా విజ యం సాధించిందో, అలానే దేశంలో మెజారిటీ సీట్లు సాధించే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పటికే మెజారిటీ ఉన్న వారు ఏం తప్పు చేస్తున్నారు? దేశానికి మంచి జరగాలి అంటే ఏం చేయాలి? అని విస్తృతంగా దేశంలో చర్చ జరిగేట్టు చేయడంలో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఏ వ్యూహంతో ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ను నడిపించారో, అదే వ్యూహంతో బీఆర్ఎస్ను దేశంలో నడిపిస్తారు.
2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు ఇవే ప్రశ్నలు. కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేసీఆర్ రాజీనామా చేశాక, అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సిద్దిపేట స్థానిక నాయకులను ఎన్టీఆర్ భవన్కు పిలిపించి ‘ఇకపై మీ నియోజక వర్గం శాసనసభ్యుడిని నేనే, మీ సమస్యలు నేనే పరిష్కరిస్తా’ అని చెప్పి పంపారు. బాబు అప్పటి అంచనా కేసీఆర్ సిద్దిపేట నుంచి గెలువరు అని. కానీ, కేసీఆర్ సిద్దిపేట నుంచి ఘన విజయం సాధించిన తరువాత కూడా టీఆర్ఎస్ ఉనికిని గుర్తించడానికి బాబు ఇష్టపడలేదు. ఆరు నెలలకు మించి ఆ పార్టీ ఉండదు అని పలువురు జోస్యాలు చెప్పారు. పార్టీ పెట్టగానే ఘన విజయాలు ఏమీ లభించలేదు. కేసీఆర్కు కూడా ఆ అంచనా ఉంటుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత మూడు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో కలిపి టీఆర్ఎస్కు వంద స్థానాలు వచ్చాయి. మొత్తంలో ఇవి పది శాతం కూడా కాదు. ఐతే ఇంతింతై వటుడింతై అన్నట్టు టీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రం లో పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయాలను తన చుట్టూ తిప్పుకొంటున్నది. ఎజెండా ను తానే డిసైడ్ చేసింది. చేస్తున్నది.
టీఆర్ఎస్ ఆవిర్భవించిన కొత్తలో మీడియా చిన్నచూపే చూసేది. మీ పార్టీ ఓట్లు, సీట్లు ఎన్ని? ఏం చేస్తారు? అని ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ను మీడియా ప్రశ్నించినప్పుడు, ‘మేం ఇప్పటికిప్పుడే మెజారిటీ సీట్లు సాధిస్తామని, తెలంగాణ ఇప్పుడే వచ్చేస్తుందని చెప్పడం లేదు. పోరాటం ఎంత కాలమైనా సాగించేందుకు సిద్ధపడి వచ్చామన్నారు. అదే జరిగింది. తొలుత నవ్వుకున్న వాళ్ళు, చిన్న చూపు చూసిన వారు అంద రూ తెలంగాణ వాదం వినిపించక తప్పలేదు. సమైక్యవాదులైన బాబు, వైఎస్సార్, జగన్ అందరూ తెలంగాణకు అనుకూల ప్రకటనలు చేయక తప్పని పరిస్థితులు కల్పించారు కేసీఆర్.
ఇప్పుడు బీఆర్ఎస్లోనూ అదే వ్యూహం. లక్ష్యం, ప్రత్యర్థి వేరు కావచ్చు కానీ అప్పుడు తెలంగాణ సాధన అయితే ఇప్పుడు తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి దేశంలో ఎందుకు సాధ్యం కాదు అనే ప్రశ్నతో బీఆర్ఎస్ దేశంలో తన వాణిని వినిపించబోతున్నది. బీజేపీ బలం మతం. మతాన్ని ఉపయోగించుకొని బీజేపీ ప్రయోజనం పొందుతున్నది. మతం విషయం లో బీజేపీ ఎంత బలంగా ఉంటుందో ఆర్థికాంశాల్లో అది అంత బలహీనంగా ఉంటుంది. అందుకే మతంపై చర్చ జరిగినట్టుగా ఆర్థిక అంశాలపై చర్చకు బీజేపీ ఇష్టపడదు. చర్చను మతం నుంచి ఆర్థిక అంశాలపైకి, దేశంలో పేదరికం, సమస్యలు, పెరుగుతున్న నిరుద్యోగం పైకి మళ్లించడంలోనే బీఆర్ఎస్ విజయం దాగి ఉంటుంది. బీజేపీ బలం మతమైతే బీఆర్ఎస్ బలం తెలంగాణ రాష్ట్రంలో అందించిన పాలన, అమలు చేసిన పథకాలు.
ఆమ్ఆద్మీపార్టీ సినిమా గ్లామర్తో పుట్టలేదు. సుపరిపాలన ఉద్యమం నుంచి పుట్టింది. ఢిల్లీలో ఆ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్లనే పంజాబ్లోనూ ఆప్ విజయం సాధించింది. గుజరాత్లో ఉనికి చాటుకున్నది . ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో విజయం సాధించింది. లిక్కర్ స్కామ్ అంటూ కేంద్ర పాలకులు నాటకాలు ఆడినా ఆప్ విజయాన్ని ఆపలేక పోయారు. ఆప్ కులం, మతం, గ్లామర్తో కాకుండా.. తాము అమలు చేసిన పథకాల వల్లనే విజయం సాధించింది. ఢిల్లీలో ఉచితంగా విద్య, వైద్యం వంటివి ఆప్ విజయవంతంగా అందించగలిగినప్పుడు పంజాబ్లో అవే పథకాలు ఎందుకు అందించలేరు అనే ఆలోచనతో పంజాబ్ ప్రజలు ఆప్కు పట్టం కట్టారు. బీఆర్ ఎస్కు కూడా ఉచిత విద్యుత్, రైతు బంధు, సాగునీరు, దళితబంధు వంటి పథకాలు కలిసి రానున్నాయి.
నిజానికి బీఆర్ఎస్.. తన ఆవిర్భావానికి ముందే బీజేపీని చావు దెబ్బ తీసింది. ఎన్డీటీవీ ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొన్నారు. ‘అధికార ఆప్ పార్టీ శాసన సభ్యులను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తున్నది అని ఆరోపిస్తున్నారు, మీ ఆరోపణలకు ఆధారం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే , నేను ఇంత కాలం ఈ విషయం చెబితే మీరు ఆధారాలు ఏవి అన్నారు. తెలంగాణలో ఇలానే శాసన సభ్యులతో బేరం ఆడుతుంటే స్టింగ్ ఆపరేషన్లో పట్టుకున్నారు కదా? అని కేజ్రీవాల్ చెప్పగానే యాంకర్ ‘ఔను మేం మా ఛానల్లో కూడా అదంతా చూపించాం, కేసీఆర్ విలేకరుల సమావేశం కూడా లైవ్లో చూపించాం’ అని బదులిచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు కూడా ఓ కేసులో శాసన సభ్యుల కొనుగోలు ఆడియో, వీడియోల అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు మీడియాకు మింగుడు పడలేదు కానీ జాతీయ స్థాయిలో ఈ అంశం బీజేపీకి పెద్ద మచ్చగా మారింది. శాసన సభ్యుల కొనుగోళ్ల రాజకీయాలకు బ్రేకు పడింది.
అడిగేవారు ఎవరూ లేనప్పుడు మోదీకి ఎదురు లేదు. బీఆర్ఎస్ ద్వారా బీజేపీ దూకుడుకు బ్రేకులు ఖాయం. సీట్లు, ఓట్లు కాదు దేశంలో అభివృద్ధిపై చర్చకు బీఆర్ఎస్ దోహదం చేస్తున్నది. కేంద్రం అడ్డంకులు కల్పిస్తున్నా తెలంగాణ సాధించిన ప్రగతే బీఆర్ఎస్కు దేశ వ్యాప్త ప్రచారం కల్పిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు, పేదరికం, విద్యుత్ కోత లు, కరువు. కానీ నేడు దేశంలోనే అత్యధికంగా వరి పండించింది. 24 గంటలు విద్యుత్తో పాటు దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దేశ రాజకీయాలు చర్చించాల్సింది మతం గురించి కాదు పేదరికాన్ని పారద్రోలడం గురించి, ప్రపంచంతో పోటీ పడడం గురించి అని దేశంలో ఒక చర్చ జరిగేందుకు బీఆర్ఎస్ బయలు దేరింది. ఏం జరుగనున్నదో కాలమే చెబుతుంది.
-బుద్దా మురళి
98499 98087