పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ నేత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ రథ సారథి అయ్యారు. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ తెలంగాణ మాడల్తో దేశానికి ఆదర్శంగా నిలిచారు. చిన్న రాష్ర్టాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమని నిరూపించారు.
వనరులున్నా ఉపయోగానికి నోచుకోలేదు. నిధులున్నా మనకు కేటాయించలేదు. పాలకులున్నా మనవారు కాకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. వెరసి నిరుద్యోగంతో యువత… ఆత్మహత్యలే శరణ్యంగా రైతులు… పనులు లేక పస్తులతో నిరు పేదలు… అను నిత్యం కష్టాలతో సావాసం చేసేవారు. ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థితి. కానీ తెలంగాణ ప్రజలు చేయి చేయి కలిపి సకల జనుల సమ్మెతో నినదించారు. 1200 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేశారు. చావో, రేవో తేల్చుకుందామని ఉద్యమ నాయకుడే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలంగాణ మొత్తం ఆయన దీక్షకు అండగా నిలిచింది. కేంద్రం దిగి వచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించింది. ఉద్యమ నాయకుడు కె.చంద్రశేఖర రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టి ముఖ్యమంత్రిని చేశారు.
అభివృద్ధి ఎలా సాధించాలో తెలిసిన ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి…కేసీఆర్. ఏ వర్గానికి ఏ మేలు చేయాలి, ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేపట్టాలి అన్న ఎరుక ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ప్రగతి పథంలో వేగంగా పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఇప్పుడు అత్యంత వేగంగా సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్న ఏకైక రాష్ట్రం. సానుకూల ఆర్థిక వ్యవస్థ, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, సార్వత్రిక సేవల్లో మెరుగైన తీరు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సీఏం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించడం వల్ల నేడు తెలంగాణా అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిచింది. దేశమంతా కొవిడ్ విపత్కర పరిస్థితులున్నప్పటికీ 2020-21లో తెలంగాణ సానుకూల వృద్ధి రేటు 2.2 శాతం(నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం) సాధించింది. ఇదే సమయంలో దేశ స్థూల జాతీయ ఉత్పత్తి 1.4 శాతానికి తగ్గిపోవటం గమనార్హం. 2021-22లో తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ స్థాయి కంటే (రూ.1.50 లక్షలు) 1.86 రెట్లు అధికంగా రూ.2.79 లక్షలుగా నమోదైంది.కొవిడ్ తీవ్రత ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వచ్చిన ఉత్పత్తుల వల్లే తెలంగాణ మెరుగైన ఫలితాలు సాధించగలిగింది.
మెరుగైన ఆర్థిక నిర్వహణ తెలంగాణ ప్రభుత్వ పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నది. 2017-20 మధ్య రాష్ట్ర సొంత రాబడి 73.8 శాతం పెరిగింది. ఇది ఇతర రాష్ర్టాల సగటు కంటే 57.7 శాతం ఎక్కువ. పెరిగిన ఆదాయాన్ని సంపద సృష్టి కోసం వినియోగించటం వల్లే ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్నది. వ్యవసాయం దండగ కాదు పండుగ అన్న విధానంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. ఈ సంవత్సరం మూడు కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మాంసం, పాల ఉత్పత్తిలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. ఆరోగ్యం, భద్రత, పోషకాహారం, ఇంటింటికీ శుద్ధ జలాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక అవసరాలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నది. సార్వత్రిక సేవలను మెరుగు పరచడంలో అనేక రికార్డులు తెలంగాణ సొంతమయ్యాయి. కేసీఆర్ ప్రజల వద్దకు పాలనను చేర్చుతూ కొత్త జిల్లాలు, మండలాలకు పరిపాలన భవనాలు నిర్మించారు. రాష్ట్రంలో మరిన్ని రహదారులు నిర్మించారు.
కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచడానికి, శిశు మరణాలను తగ్గించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందిస్తున్నది. పేద విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1600 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రంలో పారిశుద్ధ్యం మెరుగుపడింది. హరిత హారం వల్ల పచ్చదనం పెరిగింది. మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వం చెరువులను బాగు చేసింది. నిరుపేద యువతుల పెళ్లి ఖర్చుల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. ప్రజా భద్రతకు పెద్ద పీట వేస్తూ దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ విధానాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు. భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా 8,51,644 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నది. వాటన్నింటినీ రాజధానిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయడం గొప్ప విషయం.
రైతులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక పథకాలు సామాజిక అంతరాలను తొలగిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగి కేంద్రాన్ని కదిలించి పదమూడేండ్లు అయింది. ఆయనే ఇప్పుడు నాలుగు కోట్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుండటం శుభ పరిణామం. చిన్న రాష్ర్టాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమనడానికి తెలంగాణే నిదర్శనం. కేసీఆర్ కారణ జన్ముడు.
(వ్యాసకర్త: ఉమ్మడి ఏపీ, తెలంగాణ మాజీ సమాచార ప్రధాన కమిషనర్)
-డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
92465 26899