తాను పుట్టి పెరిగింది తెలంగాణలోనేనని, తెలంగాణ వ్యక్తినే పెండ్లి చేసుకున్నానని వై.ఎస్.షర్మిల గతంలో ప్రకటించారు.ఉద్యమ ఆశయాల సాధన కోసం, తెలంగాణ బాగు కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించానని ఆమె చెప్పారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ నేలపై పుట్టి పెరిగిన ఎవరైనా సరే రాజకీయ పార్టీని స్థాపించేందుకు అర్హులే. వారి పార్టీ విధి విధానాలతో, ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలో తలపడి పోరాడవచ్చు. అందులో తప్పేం లేదు. కానీ, నేను ఒక నికార్సైన తెలంగాణవాదిగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విమర్శించక తప్పడం లేదు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వాటిపై ఆధారపడినవారిని ఆర్థిక స్వావలంబన వైపు పరుగులు పెట్టిస్తున్నది. ‘కల్యాణలక్ష్మీ’ పథకం పేరిట ఆడబిడ్డల కుటుంబాలకు లక్షా నూటా పదహారు రూపాయల ఆర్థికసహాయాన్ని అందిస్తున్నది. దవాఖానలో ఆడబిడ్డ పుడితే రూ.12 వేలు తల్లి చేతికిచ్చి సగౌరవంగా ఇంటికాడ తోలుతున్నది.
2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పుణ్యమాని ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ 2009 సెప్టెంబర్ వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆ ఐదేండ్లలో వైఎస్సార్ తెలంగాణ ప్రాంతాన్ని వల్లకాడుగా చేశారు. ఈ విషయం బహుశా షర్మిలకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు తప్పితే, అప్పుడు ఆమెకు రాజకీయ ఓనమాలు కూడా తెలియవనేది నా అభిప్రాయం.
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సందర్భంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్లో చేర్పించుకున్న చరిత్ర వైఎస్ది. తెలంగాణ మాట వింటేనే ఉలిక్కిపడ్డ రాజశేఖర్రెడ్డి టీఆర్ఎస్ పార్టీని అణిచివేయడానికి ఎన్ని కుట్రలు చేశారో తెలంగాణ యావత్ ప్రజానీకానికి తెలిసిన విషయమే. అంతేకాదు ప్రభుత్వంతో శాంతిచర్చల పేరిట మావోయిస్టులను అడవి నుంచి జనారణ్యానికి రప్పించారు. ఆ చర్చల అనంతరం సుమారుగా మూడు వేలకుపైగా మావోయిస్టు పార్టీ నేతలను, కార్యకర్తలను హతమార్చారు. ఈ ఘనత వైఎస్ ప్రభుత్వానిదే అన్న విషయాన్ని షర్మిల గుర్తుంచుకోవాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల ప్రజల సొమ్మును వైఎస్ సొంతం చేసుకున్నారు. నాడు వైఎస్కు వంత పాడినందుకే అనేకమంది ప్రభుత్వ అధికారులు జైలుకు వెళ్లారు. ఇలా చెప్పుకొంటూ పోతే అనేక అక్రమాలకు వైఎస్సార్ బాధ్యులు.
వైఎస్ మరణంతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరైంది. ఆయన కుటుంబసభ్యులు మాత్రం అధికారం కోసం ఎలాంటి పన్నాగాలు పన్నారో ప్రజలకు తెలిసిందే. ఆ సమయంలోనే వైఎస్సార్సీపీని ఏర్పాటు చేశారు జగన్. అవినీతి కేసులో సీబీఐ అధికారులు జగన్ను కస్టడీలోకి తీసుకున్నారు. సుమారు 19 నెలల పాటు జగన్ జైలు శిక్ష అనుభవించారు. ఈ విషయాన్ని షర్మిల మర్చిపోలేరు. ఎందుకంటే తన అన్న జగన్ జైలు పాలైతే షర్మిల ముందుండి పాదయాత్రను కొనసాగించారు. ఏదేమైనా, 2014లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అన్నకు తోడుగా ఉన్న షర్మిల ఏపీ రాజకీయాల నుంచి ఎందుకు దూరమైనారో వారి కుటుంబ అంతర్గత విషయంగానే భావించాలి.
ఇక షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేసి ‘తెలంగాణ నా అడ్డా, ఇది నా రియాలిటీ, ప్రజల కోసం నిలబడి పోరాడే పార్టీ’ అని ‘నేను రాజన్న బిడ్డను, మాట ఇస్తే తప్పను’ అని తన పార్టీ క్యాప్షన్లో ఒకటిగా ఉంది. మంచిదే.. కానీ వైఎస్సార్టీపీ సిద్ధాంతాలేమిటి? పార్టీ నిర్మాణం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు జవాబు వెతకాల్సిన సందర్భం. అయితే పార్టీ నిర్మాణం లేకుండానే షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టి టీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసే ముందు గతానికి, ఇప్పటికి తెలంగాణలో ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదా అనే విషయాన్ని షర్మిల అవలోకనం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పరిస్థితి ఎలా ఉందని బహుశా షర్మిల అధ్యయనం చేయనట్టున్నారు. అందుకే తన కళ్ళకు ఎక్కడా అభివృద్ధి కానరావడం లేదు. కాంగ్రెస్ హయాంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉన్న స్థితిగతులు పరిశీలిస్తే నాడు నెర్రలుబారిన తెలంగాణ, ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతున్న తెలంగాణ కనిపించేది. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు ఉచితవిద్యుత్తునందిస్తూ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర రైతులను ఆదుకుంటున్నది. ఇది చూసి ఓర్వలేని షర్మిల విమర్శలకే పరిమితమవుతున్నారు. ఈమె పార్టీ ఆవిర్భావం వెనుక బీజేపీ పార్టీ హస్తం ఉన్నదనే అభిప్రాయం బలంగా కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, షర్మిల విధానాలు ఒకేలా కనబడుతున్నాయని చెప్పడానికి వారు పాదయాత్రలో చేస్తున్న విమర్శలే అందుకు నిదర్శనం.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాక పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రం లో రైతులకు మేలుచేసే విధానాలను అమలుచేస్తున్నందుకు ప్రభుత్వానికి ఏకంగా ఐరాసనే కితాబిచ్చింది. ప్రజా వైద్యం మారుమూల పల్లె ప్రజలకూ అందుతున్నది. సబ్బండవర్గాల విద్యార్థులకు 979 సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్ఠికాహారం అందిస్తున్నది. మిషన్ భగీరథ నల్లా ద్వారా ఇంటింటికీ శుద్ధిచేసిన మంచినీటిని అందిస్తున్నది. పారిశ్రామిక వృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉన్నది. నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నది. అందుకు ఇప్పటికే 91,142 పోస్టులను గుర్తించి భర్తీ ప్రక్రియను మొదలుపెట్టడం ముదావహం.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని దేశంలోనే
అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు కేసీఆర్. ఆయనను విమర్శించే స్థాయి అసలు షర్మిలకు ఉందా అనే విషయాన్ని తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేవలం ప్రజల మెప్పు కోసం, వారి చప్పట్ల కోసం అజ్ఞానంతో మాట్లాడటం సరికాదు.
తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే ముందుగా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయాలి. తర్వాతే లోటుపాట్లు ఎక్కడున్నాయో ఆధారాలతో ప్రజలు, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. అప్పుడే వారి నిజాయితీ గల రాజకీయాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. అంతేకానీ, ఎలాంటి ఆధారాల్లేకుండా మిర్శిస్తామంటే ప్రజల నుంచి ప్రతిఘటనే ఎదురవుతుంది. అందుకు నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన తిరుగుబాటు సంఘటనే తాజా ఉదాహరణ. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి తెలంగాణ ప్రజలది. ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్ని తెలంగాణ ప్రజానీకానికి నిజాలే చెప్పాలి కానీ అబద్ధాలు కాదు. మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ప్రజల నుంచి మరొక గుణపాఠం ఎదుర్కోక తప్పదు.
(వ్యాసకర్త: మాజీ చైర్మన్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ)
-మర్రి యాదవరెడ్డి
73372 22461