భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల నిర్వహణ సవాలుతో కూడుకున్నది. దానికోసం రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర ప్రతిపత్తి గల కమిషన్ (ఎన్నికల సంఘం)ను ఏర్పాటు చేశారు. 324 ఆర్టికల్ ద్వారా 1950లో ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు 17 పర్యాయాలు లోక్సభ ఎన్నికలను నిర్వహించింది. రాష్ర్టాల శాసనసభ ఎన్నికలతో పాటు అనేక ఇతర ఎన్నికలను కూడా నిర్వహించింది. 1952 నుంచి ఇప్పటి వరకు భారత ఎన్నికల కమిషన్కు 25 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా వ్యవహరించారు.
1989 వరకు ఎన్నికల కమిషన్కు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒకరు మాత్రమే ఉండగా, తర్వాత మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. 72 ఏండ్ల భారత ఎన్నికల సంఘం చరిత్రలో కమిషన్ పైనా, కమిషనర్ల పైన అనేక ఆరోపణలు వస్తూ నే ఉన్నాయి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కమిషన్ విఫలమవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఎన్నికల తేదీలను నిర్ణయిస్తుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నది. కేంద్రం తమ కు అనుకూలంగా వ్యవహరించేవారినే ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నదనే అపవాదు ఉన్న ది.
ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘానికి కమిషనర్లను నియమించడానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులు గల సుప్రీం ధర్మాసనం ఎదుట వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ను కేంద్రం నియమించింది. ఆయన నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థలు పారదర్శకంగా ప్రభుత్వాల ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఉండాలి. అవి స్వయంప్రతిపత్తితో పని చేసినప్పుడే ఆయా సంస్థల గౌరవం పెరుగుతుంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆర్థిక సంఘం, ఎన్నికల కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), అంతరాష్ట్ర మండలి, మహిళా కమిషన్, సుప్రీంకోర్టు మొదలైనవి స్వయంప్రతిపత్తి గల సంస్థలు. అయితే ఇవి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల ప్రయోజనాలు కాపాడటానికి పని చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన ఈ సంస్థలు నిష్పక్షపాతంగా రాజ్యాంగం కల్పించిన అధికారంతో పని చేసినప్పుడు సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది. అలాగే ఆయా సంస్థల ఔన్నత్యం మరింత ఇనుమడిస్తుంది. ప్రజాస్వామిక దేశాలలో ఎన్నికల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాబట్టి ఎన్నికల కమిషన్.. ఆరోపణలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా తన విధులను నిర్వర్తించాలి. ఆ విధంగా పనిచేసినప్పుడే బహుళ పార్టీ వ్యవస్థ ఉన్న మనలాంటి దేశంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించబడతాయి.
భారత ఎన్నికల సంఘానికి 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా టీఎన్ శేషన్ వ్యవహరించారు. ఆయన ఎన్నికల సంస్కరణలను తీసుకురావడంలో , ఎన్నికల కమిషన్కు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావటంలో తనదైన ముద్ర వేశారు. ఓటరు ఐడీకార్డ్ ఉంటేనే ఓటేయటం, గోడలపై రాతలు, యథేచ్ఛగా మైకుల వాడకంపై నిషేధం, ఎన్నికల వ్యయంపై పరిమితి, మతపరమైన ప్రదేశాలు, విద్యాసంస్థల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం, సంస్థాగత ఎన్నికలు నిర్వహించని పార్టీల గుర్తింపు రద్దు లాంటి ఎన్నో సంస్కరణలు శేషన్ తీసుకొచ్చారు. వాటిని తర్వాత కాలంలో కమిషనర్లుగా వ్యవహరించిన ఎంఎస్ గిల్, జేఎం లింగ్డో, టీ ఎస్ కృష్ణమూర్తి కూడా అమలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా శేషన్ లాంటి ఒక కమిషనర్ కావాలని వ్యాఖ్యానించిందంటే ఆయన ఎంత సమర్థవంతంగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు.
దాదాపు 80 కోట్లకు పైగా ఓటర్లున్న భారత్లో ఎన్నికల నిర్వహ ణ అంత తేలికైన విషయం కాదు. ఈ సందర్భంలో కమిషన్ మరిన్ని కఠినమైన సంస్కరణలు తీసుకు రావలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఓటర్ల నమోదులో అవకతవకలు, అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించి పెడుతున్న ఖర్చు, పంపిణీ చేస్తున్న మద్యం, డబ్బులను నియంత్రించాలి. అసాధ్యమైన హామీల విషయంలోనూ ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాలి. దేశంలో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నది. ఈ విషయంలోనూ సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.
రాయ్బరేలి లోక్సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ.. ఓటర్లను ప్రలోభపెట్టి ఇందిరాగాంధీ గెలిచారని, ఆమె ఎన్నికను రద్దు చేయాలని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలో ప్రధానిగా ఉన్న ఇందిర ఎన్నికను న్యాయస్థానం రద్దుచేసింది. అంతేకాదు ఆరేండ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయరాదని తీర్పునిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అదే ప్రశ్నను లేవనెత్తుతుంది. ప్రధానితో ఎన్నికల సంఘం తలపడే సందర్భం వస్తే ఆయనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోగలదా అని.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ ఉన్నట్టే ఎన్నికల కమిషనర్లను నియమించడానికి స్వతంత్ర వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అప్పుడే పారదర్శకంగా పని చేసే అవకాశం ఉంటుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ల నియామకం, వారి పనితీరు విషయంలో సంస్కరణలు చోటు చేసుకుంటే అది మన దేశానికి ఎంతో మంచిది అవుతుందనటంలో సందేహం లేదు.
-డాక్టర్ తిరునహరి శేషు
98854 65877