వంకర్లు పోయిన నడుములు, వడి తిరిగిన కాళ్లూచేతులు.. వయస్సుకు తగ్గట్లుగా ఎదగని శరీరం.. అడుగు ముందుకు వేయాలంటే అరిగోస. నొప్పుల గోళీలు మింగి.. మింగి కిడ్నీలు పాడైన విషాదం. ఆ ఊళ్లలో వయసు పోరగాళ్లకు పిల్లనియ్యాలంటే వణుకు. ఆ పల్లెల్లో నీళ్లు తాగాలంటే భయం. ఈ భయాలతోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల జనం వేలాదిగా హైదరాబాద్, ముంబైకి వలసబాట పట్టిన్రు.
ఉద్యమ సమయంలో వీళ్ల గోస చూసే ఉద్యమ సారథి కేసీఆర్ ’చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ.’ అంటూ స్వయంగా పాట రాశారు. ఈ పాట రాష్ర్టాన్నే కదిలించింది. తెలంగాణ స్వరాష్ట్రం సాకారమైన ఏడాదిలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని 2015లో ప్రారంభించారు. మినరల్ వాటర్ ప్లాంట్ల ద్వారా మంచినీళ్లు అందించి ఫ్లోరైడ్ బారి నుంచి ప్రజానీకాన్ని కాపాడిన కార్యదక్షత మన కేసీఆర్ది. 2020లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటు సాక్షిగా ఫ్లోరైడ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించింది. ఉమ్మడి ప్రభుత్వాలు ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించకపోవటంతో 1996 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 480 మంది ఫ్లోరైడ్ బాధితులు పోటీ చేసి సమస్యను దేశానికంతటికి తెలిసేలా చేశారు. దుశ్చర్ల సత్యనారాయణ సమస్యను నాటి ప్రధాని వాజపేయి దృష్టికితీసుకు పోయిన ఫలితం లేదు. కానీ కేవలం ఐదేండ్లలోనే సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్ది.బీజేపీ కపట రాజకీయాల మూలంగా నేడు మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. రాష్ట్రంలో మిగ తా నియోజకవర్గాలకు మునుగోడుకు ఒక తేడా ఉన్నది. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో దాదాపు 19 లక్షలమంది ఫ్లోరైడ్ బాధితులుంటే మెజారిటీ ప్రజలు మునుగోడు వారే.
ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగులకు కేవలం రూ. 500 పింఛన్ ఉంటే నేడు రూ. 3016కు పెంచిన గొప్ప మనసు కేసీఆర్ది. రాష్ట్రంలో మొత్తం 5,51, 686 దివ్యాంగులకు నెలకు రూ.167 కోట్ల రూపాయల పింఛన్ ఇస్తే, మునుగోడులో 7,500 మంది దివ్యాంగులకు 2.27 కోట్ల రూపాయల పింఛన్ నెలనెలా అందుతున్నది. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనూ దివ్యాంగులకు ఇంత భారీగా పింఛన్లు ఇవ్వ డం లేదు. రాష్ట్ర వికలాంగ సహకార సంస్థ ద్వారా 100% రాయితీతో దివ్యాంగులకు గత ఏడాది ఏప్రిల్లో రూ.24 కోట్ల విలువగల త్రీ వీలర్ స్కూటీలు, బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, ల్యాప్టాప్స్, ఫోన్లు 17వందలమందికి అందాయి. కేసీ ఆర్ దూరదృష్టి, ఆలోచనా సరళి, అభివృద్ధి ప్రణాళికలు నేడు దివ్యాంగులను సమాజంలో తలెత్తుకుని నిలబడే మనోధైర్యాన్నిచ్చాయి. అలాంటి కేసీఆర్కు అండగా నిలవాల్సిన గొప్ప అవకాశం మునుగోడు ఉప ఎన్నిక రూపంలో వచ్చింది. ఈ ఎన్నికల్లో మన ఐక్యతను చాటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం.
(వ్యాసకర్త : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, 95530 86666, చైర్మన్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ)