భారతదేశం ఎన్నో జీవనదుల సంగమం. పల్లె పల్లెకు పాలవలె పొంగే చెరువులున్న నేల. చేతిలోకి పిడికెడు మట్టితీసుకుంటే కమ్మని వాసనొచ్చేటి గడ్డ. ఎక్కడ అడుగు పెట్టినా లవణాలతో కూడిన మాగాణాల భూమి. పుట్లకు పదిపుట్ల ధనరాశులు పండే పంటభూమి. అంతకుమించి కష్టించి పనిచేసే రైతన్నలున్న దేశం మనది. ఇన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో ఆకలి కేకలున్నాయంటే ప్రభుత్వాల అలసత్వమే ప్రధాన కారణం.
తల్లిభారతంలో పేదల పేగు అరుపులను తట్టుకోలేక అన్నపురాశులొకచోట..ఆకలి మంటలొకచోట అంటూ కాళోజీ ఏనాడో కడుపుమండి కవిత్వం రాశాడు. ఇప్పుడది కండ్లముందు కనిపిస్తున్నది. ప్రపంచ ఆకలి సూచీలో భారతస్థానం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది.
జీవరాసులు బతికి ఉండాలంటే గాలి నీటితో పాటు ఆహారం కూడా ప్రధానమే. తాజాగా ప్రకటించిన ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)లో భారత్ మరింత దిగజారి 107 స్థానానికి చేరింది. మన దేశానికి పొరుగునున్న పాకిస్థాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), శ్రీలంక (64) కన్నా మనదేశం పరిస్థితి దారుణంగా ఉంది. మన పొరుగున ఉన్న ఈ దేశాలన్నీ ఆపద కాలంలో మన దేశ సహాయం కోసం ఎదురు చూసినవే. ఇప్పుడు ఆకలిని అధిగమించి సూచీలో మన కన్నా ముందుండటం మనకు తలవంపులు. ఈ సర్వేను ఐర్లాండ్కు చెందిన కన్నర్స్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్డ్ హంగర్ సంస్థలు కలిసి సంయుక్తంగా జీహెచ్ఐ-2022 రూపొందించాయి. 2021లో 116 దేశాల సర్వేలో భారత్ స్థానం 101, 2022లో 121 దేశాల సర్వేలో 107. ప్రపంచంలో ఈ ఆకలి సమస్య దక్షిణాసియాలోనే అత్యధికంగా ఉన్నది. 29.1 స్కోరుతో భారత్ తర్వాత స్థానంలో (109) ఆఫ్ఘనిస్థాన్ ఉన్నది. ఇప్పటికీ నాగరిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఆఫ్రికా ఖండంలోని రువాండా, నైజీరియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సూడాన్ భారత్తో పోలిస్తే ముందడుగులో ఉండటం జీర్ణించుకోలేని నిజం. ఈ సర్వేను ప్రపంచ దేశాలన్ని సవాలుగా తీసుకొని తదుపరి సంవత్సరానికి సూచీలో మెరుగైన స్కోరు కోసం ఆలోచిస్తుంటే మోదీ ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం ఇది తప్పుల తడకల నివేదిక అంటూ ఎదురు దాడి చేసే పనిలో పడ్డారు.
మోదీ ప్రధాని అయినప్పుడు దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రజలు విశ్వసించారు. కానీ రెండేండ్లకే అదొక పీడకలని తేలిపోయింది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం మతం ముసుగులో ఫాసిస్ట్ పాలనవైపే అడుగులేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానం విలసిల్లుసిల్లుతుంటే ఇక్కడ మాత్రం మూఢత్వం రాజ్యమేలుతున్నది. వివిధ దేశాల ప్రభుత్వాలు తమ కన్నా ముందున్న దేశాల పనితీరును పరిశీలించి గతేడాదికి, ఇప్పటికీ, రేపటిని సమన్వయం చేసుకొని ముందడుగు వేస్తున్నాయి. మన దేశం కూడా అలా చేస్తేనే ఆకలి సూచీలో మన స్థానం మెరుగుపడుతుంది.ప్రభుత్వాలు తమ స్వంత లాభం మీదనే శ్రద్ధ పెట్టి ఇలాంటి ముఖ్యమైన అంశాలను గాలికొదిలేస్తే రేపటి ఆకలి భారతం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లక తప్పదేమో..!
-అవనిశ్రీ , 99854 19424