‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి ఇప్పటి రాజకీయాలకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. పైసల్లేకుంటే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదని సామాన్య నాయకులు అంటున్నారు. ఇటీవల దేశ, ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చేస్తున్న ధన రాజకీయాలను చూసి విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు.
గతంలో సామాజిక సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు వ్యాపార దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో, సామాజిక ఉద్యమాలతో చాలామంది రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలకు సేవచేసి గొప్ప నాయకులయ్యారు. ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, ఏపీలలో కూడా ప్రజలకు సేవ చేసేవారికే రాజకీయ పార్టీలు అవకాశం ఇచ్చాయి. ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వందల సంఖ్యలో కొత్త నాయకత్వం రాజకీయ ప్రవేశం చేసింది. కానీ బీజేపీ దేశంలో కొత్త రాజకీయాలకు తెర లేపుతుండటం విచారకరం. డబ్బు, అది కూడా కోట్ల రూపాయలుంటేనే రాజకీయం చేయాలనేది బీజేపీ సిద్ధాంతం. వందల కోట్ల రూపాయలు పార్టీలకు ఇచ్చి వేలాది కోట్లు కాంట్రాక్టుల ద్వారా పనులు తీసుకుని రాజకీయ వ్యాపారం చేసే పరిస్థితి దేశ రాజకీయాల్లో వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీగా వర్ధిల్లుతున్న మాట నిజం. అదానీ, అంబానీలతో బీజేపీ దోస్తాన్ గురించి ఏ చిన్నపిల్లాడినడిగినా ఈ విషయం చెప్తాడు. ఆ ఇద్దరు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు.
ప్రపంచంలో ఉన్న కాంట్రాక్టు పనులన్నీ అధికారిక వాణిజ్య దౌత్యంతో అదానికే అప్పజెప్తున్న ఘటనలు సాక్ష్యాలతో సహా ఈ దేశం గమనిస్తున్నది. అంటే అదానీ, అంబానీలే బీజేపీకి వెన్నుదన్ను అని ప్రజలు భావిస్తున్నారు. పది రాష్ర్టాల్లో మెజారిటీ లేకపోయినా బీజేపీ ఆయా రాష్ట్ర ఎమ్మెల్యేలను అంగట్లో కూరగాయల వలె కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల రాజకీయ వ్యాపార ప్రక్రియ వెనుక అదానీ హస్తం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు? మహారాష్ట్రలో ఒక్కో ఎమ్మెల్యే ఎంతకు అమ్ముడుపోయాడో స్వయాన బీజేపీ నేతలే చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం కూల్చివేతకు రూ.6 వేల కోట్లు ఆఫర్ ఇచ్చారని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యే వాటా, కాంట్రాక్టు పనుల వివరాలను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలోని ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇలా చెప్పుకొంటూ పోతే ‘ఒకే దేశం-ఒకే పార్టీ’ ఉండాలనే నియంతృత్వపు ధోరణితో బీజేపీ ప్రాంతీయ పార్టీలను చంపేయజూస్తున్నది. అంబానీ, అదానీ రూపంలో వేల కోట్ల డబ్బున్నదనే ధీమాతోనే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా దేశంలో ఇదే తంతు జరుగుతున్నది. తాము బలపడాలనుకున్న చోట డబ్బుతో బలప్రయోగం చేస్తున్నది.
తాజాగా దక్షిణాదిపై కన్నేసిన బీజేపీ తెలంగాణను లక్ష్యంగా పెట్టుకున్నది. శాంతియుత, శీఘ్రగతిన వృద్ధి చెందుతున్న రాష్ర్టాన్ని చేజిక్కించుకునేందుకు చేయని కుట్ర లేదు. అణా పైసా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. రాష్ర్టానికి వచ్చే ప్రాజెక్టులన్నీ గుజరాత్కు మళ్లిస్తున్నది. ఇక దేశ రాజకీయాల్లో కేసీఆర్ కొరకరాని కొయ్యగా మారుతున్నారనే విషయాన్ని గ్రహించిన బీజేపీ రాజకీయ క్రినీడకు శ్రీకారం చుట్టింది. ఇందుకు టీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులకూ వల చేసి విఫలమైం ది. టీఆర్ఎస్ను దెబ్బతీయాలంటే రాష్ట్రంలో వేల కోట్లు వెచ్చించాలనుకున్నది. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థకు చెందిన ‘సుశీల్ ఇన్ ఫ్రా’కు రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు పనులు కట్టబెట్టి ఉప ఎన్నికకు తెరలేపింది. ఒకవేళ మునుగోడులో బీజేపీ గెలిస్తే తెలంగాణ రాజకీయాలను శాసించాలనే ప్రయత్నంలో ఆ పార్టీ ఉన్నది.
బీజేపీకి కావాల్సింది ప్రజల బాగోగులు చూసే నాయకులు కాదు, పెట్టుబడిదారులు. బీజేపీ హవాలా నెట్వర్క్ గురించి ఇక్కడ కొంత షాకింగ్ సమాచారం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల బీజేపీలో చేరడానికి విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వివేక్ కంపెనీ రూ.10 కోట్లు బదలాయించింది. అలాగే రాజగోపాల్ కాషాయ తీర్థం పుచ్చుకోడానికి ఇదే వివేక్కు సంబంధించిన కంపెనీల నుంచి రూ.25 కోట్లు నగదు బదలాయింపు జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరలవుతున్నాయి. ఇకపోతే అపోలో దవాఖానకు డైరెక్టరుగా ఉన్న కొండా విశ్వేశ్వర్రెడ్డిని బీజేపీ నయాన్నో, భయాన్నో ఒప్పించి కండువా కప్పింది. అపోలో ఆస్తులకు భరోసా అంటేనే ఈ పెద్దమనిషి కాషాయ గూటికి చేరినట్టు సమాచారం. వేలాది కోట్ల ఆస్తులున్న కొండా బీజేపీకి ఫండింగ్ చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం!
రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సహజం. కానీ తెలంగాణ లాంటి వైవిధ్యభరితమైన రాష్ట్రంపై బీజేపీ హైకమాండ్ చేస్తున్న కుట్రలు వేరు. ఏకంగా తెలంగాణ అస్తిత్వాన్నే దెబ్బతీసే కుయుక్తుల పన్నుతున్నది. పెట్టుబడిదారులకు డబ్బు ఆశ చూపెట్టి రాజకీయాలను అంగట్లో పెడుతున్నది. బీజేపీ చేస్తున్న క్షుద్ర రాజకీయాల పట్ల జాగరుకతతో వ్యవహరించాల్సి ఉన్నది. పెట్టుబడిదారులు కాషాయం కండువా కప్పుకోవడం వెనుక భయంకరమైన కుట్రలను తెలంగాణ బుద్ధిజీవులు రాష్ట్ర ప్రజలకు వివరించాలి.
-గుంటిపల్లి వెంకట్ , 94949 41001