మునుగోడు అభివృద్ధి కోసమే శాసన సభ్యత్వానికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కేంద్రం నిధులు తీసుకొచ్చేందుకే బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. కానీ గతంలో పార్టీలు మారి బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకు రాలేదన్న విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గుర్తుంచుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క, సీతక్క లాంటి ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో కంటే మునుగోడు నియోజకవర్గంలో అదనంగా అభివృద్ధి జరగలేదు. అలా అని తక్కువ అభివృద్ధీ జరగలేదు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేల సహేతుక విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఎన్నడూ తన నియోజక వర్గ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించనూ లేదు, విజ్ఞప్తీ చేయలేదు.
వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక అనేది తాము కోరుకుంటే వచ్చినది కాదనేది నియోజక వర్గ ప్రజలు చెబుతున్న మాట. అక్కడి ప్రజలు మా కోసం రాజీనామా చేయండి…. మీ రాజీనామాతో మునుగోడు అభివృద్ధి జరుగుతుందని ఎన్నడూ పోరాటాలు చేయలేదు. కేంద్రం నుంచి నిధులు తేవడానికే రాజీనామా అని రాజగోపాల్ అంటున్నారు. మరి హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ గాని, దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునందన్ రావు గాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఏమైనా అదనంగా నిధులు తీసుకొచ్చారా.. అని పరిశీలిస్తే ఏమీ లేవు. అంటే అదనపు అభివృద్ధి ఏమీ జరగలేదు. అంటే, రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి పేరు మీద ఉప ఎన్నికకు పోవడమనేది నాటకమేనని స్పష్టం అవుతున్నది.
ఈ విషయాన్ని పక్కన పెడితే మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు? రెండు, మూడు నెలలకోసారి తన ఉనికి కోసం వచ్చి, కొందరికి కొన్ని తాయిలాలు పంచడం తప్ప, నిజంగా ఏనాడైనా ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నారా? కానీ ఇప్పుడు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇదే పని ఆనాడు ఎందుకు చేయలేదు? అంటే తన స్వప్రయోజనాల కోసం ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలుస్తున్నది. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఆయన ద్వారా తెలంగాణలో మరింత విస్తరించాలని బీజేపీ భావిస్తున్నది. అందుకే ఈ ఉప ఎన్నిక వచ్చిందని తెలంగాణ సమాజం భావిస్తున్నది. బీజేపీ లాంటి పార్టీలు తమ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు బరి తెగిస్తున్నాయి. తద్వారా ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాయి. ఆ విధంగా వచ్చిందే మునుగోడు ఉప ఎన్నిక. మునుగోడు ఓటర్లు ఈ విషయాలన్నీ విశ్లేషించుకుని ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలి.
(వ్యాసకర్త : పందుల సైదులు , 94416 61192, రాష్ట్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ విద్యావంతుల వేదిక)