యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో. పదవుల కన్నా ఉద్యమవీరుడిగా, కార్యసాధకుడిగా ఆయన ఖ్యాతి జగద్విదితం. 60 ఏండ్ల ఉమ్మడి పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేసిన వీరాగ్రేసరుడుగా కేసీఆర్ అఖండయశస్సును ఆర్జించారు.
సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ఆయ న రేయింబవళ్లు కృషిచేశారు. కేసీఆర్కు ఉన్న ముందుచూపు మహాత్మ్యం ఏమిటో చాలామంది గ్రహించలేకపోయారు. కానీ, ఇప్పుడు మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్న బంగారు తెలంగాణ అంతా కేసీఆర్ పుణ్యమే. కోతల్లేని కరెంటు, నీటి కరువు లేని తెలంగాణను ఎనిమిదేండ్ల కిందట ఎవరైనా ఊహించారా? తెలంగాణాలో బియ్యం దొరకవని, వ్యవసాయం తెలియదని ఎద్దేవా చేసినవాళ్లు ఇవాళ తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేక కేంద్రమే చేతులెత్తేసిన వైనం చూసి అవాక్కవుతున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి వరదలతో ఇవా ళ తెలంగాణ పులకించి పోతున్నదంటే దాని కంతా కేసీఆర్ దూరదృష్టే కారణం. మాతృగడ్డ మీద ఎనలేని మమకారమే కారణం. నాడు కేసీఆర్ను నిలువెల్లా ద్వేషించినవారు నేడు సిగ్గుతో చితికిపోతూ కేసీఆర్కు జయజయ ధ్వానాలు చేస్తున్నారు. మాకూ కేసీఆర్ లాంటి సీఎం కావాలని మొక్కుతున్నారు.
మరి అలాంటి ప్రజారంజక పాలకుడి సేవలు దేశానికి వద్దా? తెలంగాణలో వలె దేశమంతా రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, గిరిజన బంధు, కల్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తామంటే మంగళహారతులు పడుతూ స్వాగతం పలకరా? కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రమ్మని ఎన్నాళ్ల నుంచో వివిధ వర్గాల వారి నుంచి ఆహ్వానాలందుతున్నాయి. ఇటీవలే 26 రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల వారు ప్రగతిభవన్కు వెళ్లి జాతీయ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారు. కేసీఆర్కు ఉన్న ఒక విశిష్టత ఏమంటే 4 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నేర్పు. ఏ భాషలో మాట్లాడినా గుక్క తిప్పుకోకుండా, మాటల కోసం తడుముకోకుండా, ప్రజల మనసుల్లోకి నేరుగా దూసుకుపోయేలా వివరించగల చాకచక్యం కేసీఆర్ సొంతం. తన భాషాజ్ఞానంతో దేశంలో ఏ ప్రాంతమైనా తిరిగి నాయకులను ఒప్పించగల అనుభవం, నేర్పు ఆయనలో ఉన్నాయని ఎన్నోసార్లు రుజువైన సత్యం.
ప్రపంచ చరిత్రలో తమ దేశాన్ని గజగజలాడించిన అనేకమంది నియంతలు ప్రజా తిరుగుబాట్లతో పతనమైపోయారు. మోదీ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో దేశం ఆర్థికంగా చిన్నాభిన్నమైంది. ఈ దుర్మార్గ పాలన నుంచి భరతమాతకు విముక్తి కల్పించాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు రావాలని దేశం ఎదురుచూస్తున్నది. అందుకు సమయమూ సమీపించింది. బలమైన ప్రత్యామ్నాయం దొరికితే బీజేపీని మడిచిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వారి దృష్టిలో ఆశావహంగా కనిపిస్తున్న వేగుచుక్క కేసీఆర్.
ఏనాడైతే ఆయన జాతీయ లక్ష్యాలను ప్రకటించారో, ఆ క్షణం నుంచే ఆయన మీద దాడి మొదలైంది. అవినీతి ఆరోపణలు, కుటుంబం మీద అసందర్భ ప్రేలాపనలు, బెదిరింపులు, దర్యాప్తు సంస్థలతో హెచ్చరికలు.. అవికాకుండా ఆయన్ను నిరుత్సాహపరిచేలా కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తనకు ప్రధాని పదవి కావాలని కేసీఆర్ ఎన్నడూ ఎక్కడా పేర్కొనలేదు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడమే తన లక్ష్యంగా సింహగర్జన చేస్తున్న కేసీఆర్ను చూసి కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తుతున్నాయి.
ఎంతమంది ఎంపీల బలం ఉన్నదని చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ దేశ ప్రధానులయ్యారు? అయినా కేసీఆర్కు ఏం తక్కువ? ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర సాధకుడిగా, ముఖ్యమంత్రిగా విశేషానుభవం ఉన్నది. ప్రధాని మోదీ గతంలో ఒక్కసారి కూడా ఎంపీగా పనిచేయలేదు. ఇది ప్రజాస్వామ్యం. సత్తా, సమర్థత ఉన్న ఎవరైనా ప్రధాని కావచ్చు. బీజేపీకి గత ఎన్నికల్లో దక్కింది 36 శాతం ఓటింగ్ మాత్రమే. అంటే 64 శాతం ఓట్లు విపక్షాలకు లభించాయి. ఆ విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీని గద్దె దించడం సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. తన జాతీయ పార్టీ ద్వారా దేశ ప్రజల మనసులను చూరగొనే సత్తా కేసీఆర్లో పుష్కలంగా ఉన్న ది. అంతకన్నా ఇంకేం కావాలి? కేసీఆర్ లాం టి వీరుడికి మన శుభాకాంక్షలు చాలు.
(వ్యాసకర్త: ఇలపావులూరి మురళీ మోహనరావు , 81433 18849 సీనియర్ రాజకీయ విశ్లేషకులు)