ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఏ రకమైన వివక్ష గురైందో, ఇప్పుడు దేశంలో కూడా తెలంగాణ అదే వివక్షకు గురవుతున్నది. భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదన ఉండేది. తెలంగాణపై వివక్ష నేపథ్యంలో అది ఏర్పాటు కాలేదన్నది జగమెరిగిన సత్యం. అప్పటి నుంచి బయ్యారం ఫ్యాక్టరీ ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు ప్రయత్నిస్తున్నా, కేంద్రం విభజన హామీలకు తూట్లు పొడవడం దారుణం.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’ నినాదం మార్మోగింది. అపారమైన ఇనుప ఖనిజం ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో దాగి ఉన్నది. వెలికితీసి, బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే.. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని, ఓ భారీ పరిశ్రమ తెలంగాణకు వస్తుందని కేసీఆర్ భావించారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష కొనసాగుతున్న తరుణంలోనే ఆయన బయ్యారంపై పోరు మొదలు పెట్టారు. తెలంగాణ ప్రజల డిమాండ్ను నాటి కేంద్రం గుర్తించింది. 2014 విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకు రూ.36 వేల కోట్లు అవసరమని విభజన హామీల్లో పొందుపర్చింది. ‘సెయిల్’ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) నేతృత్వంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామనేది నాటి పాలకుల హామీ. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ అంశాన్ని పక్కనబెడుతూ ఎనిమిదేండ్లుగా వివక్ష చూపుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కేంద్ర ప్రభు త్వం స్పందించకపోవడం గర్హనీయం.
విభజన హామీలన్నీ అటకెక్కాయి. కాజీపేటకు రావాల్సిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీని, హైదరాబాద్కు రావాల్సిన ఐటీఐఆర్ను రద్దుచేసి కేంద్రం తన అక్కసును ప్రదర్శించింది. గిరిజన వర్సిటినీ ఆ రకంగానే కాలయాపన చేసింది. ఇక తాజాగా బయ్యారం ఉక్కు మీ హక్కు కాదని, అక్కడ పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పడం శోచనీయం. ‘కత్తి పరాయోడిదే, కానీ పొడిచేటోడు మనోడు’ అని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో తరచూ చెప్పేవారు. ఇప్పుడు కేంద్రం అదే చేయించింది. మంత్రి కిషన్రెడ్డి అదే చేశారు.
బయ్యారం మండలంతోపాటు మహబూబాబాద్ జిల్లాలో 51 వేల హెక్టార్లలో అత్యంత విలువైన ఇనుప ఖనిజం నిక్షిప్తమై ఉన్నది. గుట్టలు గుట్టలుగా ఖనిజం కనిపిస్తున్నది. భూమి లోతుల్లోకి వెళ్లకుండానే అత్యంత తక్కువ ఖర్చుతో వెలికితీసే అవకాశం ఉన్నది. ఏటా 4 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని వెలికితీసినా 25 ఏండ్లకు సరిపడా నిక్షేపాలు బయ్యారంలో ఉన్నాయని పలు సర్వేలు చెప్తున్నాయి. దేశంలో లభ్యమ య్యే ముడి ఇనుములో 11 శాతం బయ్యారంలోనే ఉన్నట్టు మినరల్ డెవలప్మెంట్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. లభ్యత మాత్రమే కాదు, బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజం 60 శాతం నాణ్యత కలిగి ఉన్నట్టు అనేక పరిశోధనలు అంచనా వేశాయి. అంతేకాదు తెలంగాణ పొరుగునున్న ఛత్తీస్గఢ్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని రైలుమార్గం ద్వారా తరలించి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ చేయటానికి కూడా అవకాశం ఉంది.
బయ్యారంలో సరిపడా ఖనిజం ఉన్నది. కరెంటు, నీళ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇవన్నీ తెలిసినా ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టాక కేంద్రం ఉక్కు పరిశ్రమ అసాధ్యమని చెప్పడం హాస్యాస్పదం.
సింగరేణి పనికిరాదా?: బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ముందుకురాకుంటే సింగరేణికైనా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బొగ్గు నిక్షేపాలను విజయవంతంగా వెలికితీస్తున్న సింగరేణికి ఉక్కు కర్మాగారం వస్తే రాష్ర్టానికి మేలు జరుగుతుందని ఆయన భావించారు. కానీ కేంద్రం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. బయ్యారం ఐరన్ ఓర్ నాణ్యత పరీక్ష కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ముందుకువచ్చింది. ‘సెయిల్’ లేదా మరేదైనా సంస్థ ద్వారా ఖనిజం నాణ్యతపై, లభ్యతపై సర్వే చేయించాలని కోరింది. తెలంగాణ ఎంపీలు, పార్లమెంట్ లోపల, బయటా ఉద్యమించారు. అయినా ‘నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు’ అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నది. న్యాయంగా దక్కాల్సిన హక్కును తెలంగాణకు అందకుండా చేస్తున్నది. చట్టబద్ధమైన హక్కును కాలరాసే అధికారం కేంద్రానికి ఎక్కడిది?
-వెంకట్ గుంటిపల్లి , 94949 41001