ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సోనియాగాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని పేర్కొన్నారు. కానీ తానుచేసిన విమర్శలు తన సొంత పార్టీ సభ్యులను కూడా కలవర పెడతాయని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలోని నేటితరం నాయకులంతా వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినవారే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా పదవీ కాలాన్ని పొడిగించేందుకు బీసీసీఐ రాజ్యాంగానికే సవరణలు చేయడానికి ప్రయత్నించినప్పుడు స్వతంత్రంగా వ్యవహరించే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ గమనిస్తే భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కుటుంబ వారసత్వం తీవ్రమైన సమస్యగా మారినప్పుడు, ఆ సమస్య నుంచి బీజేపీ తప్పించుకోలేదని చెప్పవచ్చు.
ప్రతిభ ఆధారంగానే నాయకులకు ఉన్నత స్థానాలు కట్టబెడతామని చెప్పుకొనే బీజేపీలో ఈ నేతలంతా బాగా ఎదుగుతున్నారు. రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, సమాచార శాఖ మంత్రి అనురాగ్ఠాకూర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్లంతా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే. వాళ్లంతా హోంమంత్రి అమిత్ షాతో సన్నిహితంగా మెలిగేవారు, పైగా ప్రధాని ఆశీస్సులు కూడా వారికి ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మధ్య ప్రదేశ్ రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా లాంటివాళ్లు కూడా కుటుంబ రాజకీయాల నుంచి ఎదిగినవారే. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింథియా తల్లి విజయరాజే సింథియా బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆమె వాజ్పేయి, అద్వానీతో సన్నిహితంగా ఉండేవారు. వసుంధర రాజే కొడుకు దుష్యంత్సింగ్ సైతం సీనియర్ ఎంపీగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక సీఎంగా ఉన్న బసవరాజ్ బొమ్మై కూడా మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడే.
నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యల గురించి తరచూ వాస్తవాలు మాట్లాడుతూ సొంత పార్టీని ఇరుకునపెట్టే బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ కూడా వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినవారే. 300 మంది బీజేపీ ఎంపీల్లో 30 మంది కుటుంబ రాజకీయాల ద్వారా పైకెదిగినవారేనని రాజకీయ వర్గాల అంచనా. మహారాష్ట్రనే ఉదాహరణగా తీసుకోండి. లోక్సభ ఎంపీ పూనమ్ మహాజన్ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కూతురు. ప్రీతం ముండే గోపినాథ్ ముండే వారసురాలు. సుజయ్ విఖే పాటిల్, హీనా గవిట్ తండ్రులిద్దరూ మహారాష్ట్ర సీనియర్ మంత్రులు. ధరియాషిల మానే కూడా రాజకీయ కుటుంబానికి చెందినవారే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారే. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది బీజేపీ నాయకులు వారసత్వ రాజకీయాల సాయంతో మనుగడ సాగిస్తున్నవారే. ఇతర పార్టీల్లో ఉన్న వారసత్వ రాజకీయ నాయకులను కూడా బీజేపీ వదలడం లేదు. వారిని పార్టీలోకి ఆహ్వానించి పదవులను కట్టబెడుతున్నది. మోదీ-షా ద్వయం విలువల కన్నా ఫలితాలు ముఖ్యం అనుకుంటున్నారు. అందుకే బీజేపీలోనూ వారసత్వ రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు.
బెంగాల్లో బీజేపీ తురుపు ముక్క సువేంద్రు అధికారి కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారే. బీజేపీతో జట్టు కట్టిన హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా మాజీ సీఎం దేవీలాల్ తనయుడు. ఇటీవల బీజేపీలో చేరిన కుల్దీప్ బిష్ణో య్ మాజీ సీఎం భజన్లాల్ కుమారుడు. బీజేపీ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ మాజీ కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ వారసుడు. యూపీ మాజీ ముఖ్యమం త్రి కళ్యాణ్ సింగ్ కుమారుడు రాజ్వీర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కుమారుడు పంకజ్ నోయిడా ఎమ్మెల్యేగా ఉన్నారు. చూశారా మోదీ-షా ద్వయం నీడలో బీజేపీ ఎంతగా మారిపోయిందో!
పన్నెండేండ్ల కిందట సుష్మా స్వరాజ్ కుటుంబ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు మనం ఇప్పుడు గుర్తుకుచేసుకోవాలి. తమ పార్టీ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటుందని, జనం నుంచి నాయకులను తయారుచేస్తుందని నాడు ఆమె ప్రకటించారు.
బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, సమిష్టి నిర్ణయాలు అమలవుతాయని ఆమె సెలవిచ్చారు. కార్యకర్తలే పార్టీలో కీలకమైనవారని చెప్పిన ఆమె రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారికి పదవులు వారసత్వంగా రావని తెలిపారు. కానీ నేడు ఆమె చెప్పినదానికి
భిన్నమైన వాతావరణం కమలం పార్టీలో నెలకొన్నది.
ఈ నేపథ్యంలో బంధు ప్రీతి, వారసత్వ రాజకీయాలను మోదీ తీవ్రంగా వ్యతిరేకించేటట్లయితే, మొదట తన పార్టీలోని వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
– సునీల్ గటడే , వెంకటేశ కేసరి
(డెక్కన్ హెరాల్డ్ సౌజన్యంతో..)