ఒకరిది సంతృప్తి, మరొకరిది గుండె నిబ్బరం. వృద్ధులకు ‘ఆసరా’ తోడు నిలవగా, వారిలో ఉత్సాహం ఉరకలెత్తిస్తున్నది. నెలనెలా పింఛన్ టంఛన్గా పడితే ఆ గుండెలకు భరోసానే కదా? ఆ భరోసానే పేద, వృద్ధ, ఆసరా లబ్ధిదారుల్లో సంతోషాన్ని నింపుతున్నది. మా నాయకుడి ఫొటో లేదంటూ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కామారెడ్డి జిల్లా పరిపాలనాధికారిపై అక్కసును వెళ్లగక్కారు. కానీ ఆమె మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఏం చేశామన్నది అవలోకనం చేసుకోవాలి కదా..? తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వగలిగామా అనేది తనకు తాను ప్రశ్నించుకోవాల్సింది.
తెలంగాణ సమాజానికి భరోసా ఇవ్వగలిగింది ఒక్క కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ మాత్రమే. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఆయన రాష్ర్టాన్ని సాధించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్. అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో క్షేత్రస్థాయిలో ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు సామాన్యులకు అండగా నిలుస్తున్నాయి. అందులో మచ్చుకు ఒక్కటి ‘ఆసరా’ పింఛన్. ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కొల్పోయి తీవ్ర వివక్షకు గురైన తెలంగాణ నేడు ప్రగతి వైపు పరుగులు తీస్తున్నది. రైతన్నకు దన్నుగా నిలుస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తెచ్చి తల్లిదండ్రుల వ్యథలను దూరం చేస్తున్నాయి. ప్రతి ఇంటికి ఏదో రూపంలో పథకాన్ని అందించేలా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషిచేస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితులను బట్టి అడుగులు వేస్తున్నారు. అన్నివర్గాలకు సంక్షేమమే లక్ష్యంగా సందర్భోచితంగా ముందుకుసాగుతున్నారు. వయస్సు మీదపడ్డ వృద్ధులు ఏ కొడుకు దిక్కు చేయి చాపకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన పథకమే ‘ఆసరా’ పింఛన్. ఈ బృహత్తర నిర్ణయంతో కేసీఆర్ వృద్ధులందరికీ పెద్ద కొడుకయ్యారు. చేనేత, గీత, ఒంటరి మహిళలు, వితంతు ఇలా 40 లక్షల మందికి పింఛన్లు అందజేస్తుండగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మరో 10 లక్షల మందికి పింఛన్లను అందజేస్తున్నారు.
కేసీఆర్ ఇదంతా చేస్తున్నది కేవలం ఫొటోల కోసమో, పదవుల కోసమో కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థికస్థితి మార్చి వారి బతుకుల్లో వెలుగులు నింపాలని తపనతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటువంటి కేసీఆర్ ఏనాడు ఫొటో కోసం ఆరాటపడలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో ప్రజల గుండెల్లో చిరకాల స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అందుకే తెలంగాణ గడ్డ కేసీఆర్ను గుండెల నిండా నింపుకొన్నది.
ఓ వైపు సామాన్యుడి కష్టాలను దూరం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తుంటే.. మోదీ సర్కారు సంపన్నులకు అండగా నిలబడుతున్నది. వేల కోట్లు రాయితీలు పొందిన బడాబాబులను తమ ఫొటో పెట్టమని అడగకుండా, రేషన్ దుకాణం వద్ద ఫొటో పెట్టాలని సూచించడం విడ్డూరం. సామాన్యుడు బతకలేని సంసర్కణలు తీసుకొచ్చి, సమస్యలు సృష్టించి, పైగా ప్రధాని ఫొటో పెట్టమనటం ఏమిటి? మోదీ ఫొటో ఉండాల్సింది సంపన్నుల ఇండ్లల్లో. అయినా, ఫొటోలు పెడితే ప్రజల మనస్సులు గెలుస్తామనుకోవడం భ్రమే అవుతుంది తప్పా, తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం చోటు సంపాదించలేరు.
(వ్యాసకర్త: సంపత్ గడ్డం, 78933 03516, దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు)