రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యరంగంలో గణనీయ పురోగతి సాధించాం. ఈ ఎనిమిదేండ్లలో హైదరాబాద్ నగరం ‘హెల్త్ హబ్’గా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ‘నీతి ఆయోగ్’ ఇటీవల విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ 3వ స్థానానికి ఎగబాకడం రాష్ర్టానికే గర్వ కారణం. ఇదొక గుణాత్మక ఆరోగ్య మార్పు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. దేశంలో తక్కువ మాతృ మరణాలు (ప్రసవాల్లో) నమోదయ్యే రాష్ర్టాల్లో కేరళ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. అలాగే తలసరి వైద్యంపై ఖర్చుచేస్తున్న వ్యయంలో కూడా మూడో స్థానంలో ఉన్నది. మొదట హిమాచల్ప్రదేశ్ రూ.3,320 వ్యయంతో ఉండగా, ఆ తర్వాత కేరళ రూ.2,272, తెలంగాణ రూ.1,698 మూడో స్థానంలో నిలిచింది. కేంద్రం నిర్వహించిన హెల్త్ ఫిట్నెస్ క్యాంపెయిన్ (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్)లో భాగంగా మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించింది. వాటిలో తెలంగాణ మూడు అవార్డులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల అమల్లో మొదటి స్థానం, నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్లో రెండవ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం వైద్య సదుపాయాల విస్తరణ, నిరంతర పర్యవేక్షణతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని అమలుచేస్తున్నది. బస్తీ, పల్లె దవాఖానలతో ప్రజల వద్దకే ప్రాథమిక వైద్యాన్ని అందుబాటులోకి తేవటం లాంటివి వైద్యరంగం అభివృద్ధి చెందటానికి దోహదపడే అంశాలు.
హైదరాబాద్లోని పేద ప్రజలకు వైద్య సేవలందించటానికి ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానలను ఏర్పాటుచేసింది. మిగిలిన 141 మున్సిపాలిటీలలో 288 బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేసింది. 4,745 ఉప ఆరోగ్య కేంద్రాలను పల్లె దవాఖానలుగా మారుస్తున్నది. వీటిద్వారా 2018-19 వరకు రాష్ట్రంలో దాదాపు 1.03 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. వైద్య విద్య విషయంలో చూస్తే, 2014 కంటే ముందు కేవలం 5 వైద్య కళాశాలలుంటే, స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి దశలో మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యపేటలో 4 వైద్య కళాశాలలను ఏర్పాటుచేసింది. ప్రతి వైద్య కళాశాలను రూ.450 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం అభినందనీయం. ఆ తర్వాత రెండో దశ లో మరో 8 వైద్య కళాశాలలను నెలకొల్పింది. ఇటీవలే మరో 8 కాలేజీలకు అనుమతులు ఇచ్చింది. 2014లో ఎంబీబీఎస్ సీట్లు 700, పీజీ సీట్లు 82 ఉంటే, 2022కు వచ్చేసరికి ఎంబీబీఎస్ సీట్లు 5,240, పీజీ సీట్లు 1000కి పెరగడం ముదావహం.
వైద్య, ఆరోగ్య సదుపాయాలు, మౌలిక వనరుల విషయంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. మారుమూల గ్రామాలకు, గిరిజన, ఆదివాసీ ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్యసేవలను విస్తరిస్తున్నది. నీతిఆయోగ్ ఆరోగ్యసూచీలో ర్యాంకే దీనికి నిదర్శనం.
-డాక్టర్ కందగట్ల శ్రవణ్కుమార్ , 99088 43592