2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకాన్ని పలు దఫాలుగా అమలుచేసింది. 2018 వరకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ విషయంలో ప్రజలను పక్కదోవ పట్టిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం చిమ్మింది. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ ఏమో కానీ, కనీసం లక్ష రూపాయల రుణమాఫీని కూడా చేయలేకపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ఠ. ఇదిలా ఉంటే ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నది.
గత కేసీఆర్ ప్రభుత్వం వలె దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రైతులకు ఉచితంగా నాణ్యమైన విత్తనాలు,
ఎరువులను అందజేస్తే వాళ్లకు రుణాలు తీసుకోవలసిన అవసరం ఎందుకు ఉంటుంది? పండిన పంటకు
గిట్టుబాటు ధర కల్పిస్తే వాళ్లు అప్పులెందుకు చేస్తారు. పండించిన పంటకు బీమా సౌకర్యం కల్పిస్తే రైతులు బ్యాంకుల వద్ద ఎందుకు క్యూలో నిల్చుంటారు? మొత్తంగా దేశంలో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్
సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
Agriculture | నేడు దేశంలో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి నెలకొని ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కనీసం పన్నులను సైతం సక్రమంగా రాష్ర్టాలకు బదిలీ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితిలో రుణమాఫీ విషయమై ఎలాంటి విధివిధానాలు రూపొందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐని ఎలా ఒప్పిస్తుందో అంతుచిక్కడం లేదు. నాబార్డ్ నివేదిక ప్రకారం 2023 ఆగస్టు వరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు. ఆ రైతులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయాలంటే దాదాపు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి షరతులు విధించింది, ఆర్బీఐ రుణమాఫీలకు అనుమతిస్తుందా? అసలు రైతు రుణమాఫీలు ఎలా జరుగుతాయో ఒకసారి చూద్దాం.
1970లలో వ్యవసాయరంగంలో విప్లవాలు సృష్టించడానికి నాటి ప్రభుత్వాలు రైతులపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. తత్ఫలితంగా జొన్నలు, రాగులు పండించే స్థానంలో వరి వేయడం రైతులకు ఆనవాయితీగా మారింది. కానీ, వారికి పెట్టుబడి ఇబ్బందిగా మారింది. దానికోసం రుణాలను తీసుకునేందుకు రైతులు బ్యాంకులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. కానీ, రైతులకు బ్యాంకుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది. రుణాలు పొందిన రైతులు అసలు ఏం పండించాలి? పండించిన దానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందా? పంట నష్టపోతే బీమా సౌకర్యాన్ని కల్పిస్తారా? వంటి అనేక ప్రశ్నలు రైతులను ఆలోచింపజేశాయి. కానీ, అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగంలో సరైన విధానాలు రూపొందించకపోవడం వల్ల రైతులు అనేకరకాలుగా నష్టపోయారు.
గ్రామీణ వ్యవసాయరంగంపై దళారుల కన్నుపడింది. చిన్న, సన్నకారు రైతులను లోబర్చుకొని దళారులు నేరుగా రుణాలివ్వడం షురూజేశారు. తద్వారా అప్పు కోసం రైతులు బ్యాంకులను ఆశ్రయించడం మానేసి దళారుల వద్ద బారులు తీరారు. ఆ విధంగా గ్రామీణ వ్యవసాయరంగం, రైతులు పక్కదారి పట్టారు. దీన్ని అదనుగా చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రుణాలు మాఫీ చేస్తామంటూ ముందుకు వచ్చాయి. క్రమం గా రుణమాఫీ అనేది ఒక వ్యసనంగా మారింది. కొద్దిమంది రైతులకు ప్రభుత్వాలు రుణమాఫీ చేయడం, కొందరికి చేయకపోవడం వల్ల దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు తీవ్రమయ్యాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిపై భారం పడేవిధంగా వ్యవహరించింది. 2015-16 నాటికి అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రుణమాఫీలపై కీలక ప్రకటన చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే విధంగా చర్యలు ఉండాలని కొన్ని నిబంధనలను అమలుచేశారు. 14వ ఆర్థిక కమిషన్ కూడా ఆర్థిక పరిస్థితిపై ఆరా తీసింది. 2015-16లో ఆర్బీఐ ఇకనుంచి దేశంలోని అన్ని రాష్ర్టాల్లో రుణమాఫీలు చేయటం అసాధ్యమని, పలు రాజకీయ పార్టీలకు రుణమాఫీ ఒక ఎన్నికల స్టంట్గా మారిందని వివరించింది.
అందుకే దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రుణమాఫీని అమలుచేయలేకపోయాయి. పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేకపోయారు. ఇదే సమయంలో దేశంలో పెద్దనోట్లు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని కూడా అమలుచేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలోనే తెలంగాణ రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు దఫాలుగా లక్ష రూపాయల రుణమాఫీ చేసింది.
ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్నది. అందుకే రైతులకు దేశ జీడీపీలో 10 శాతం కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవసాయ ఒప్పందంలో భాగంగా 3 బాక్సులు (ఆకుపచ్చ, నీలం, కాషాయం) ఉంటాయి. ఎక్కువ ప్రభావం ఉండే విధానాలు కాషాయ బాక్సులోకి వస్తాయి. రైతు రుణమాఫీ కాషాయ కోవలోకి చెందినదే. రుణమాఫీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండటం వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ సైతం మన దేశంపై పలు షరతులు విధించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సంఘం కూడా రుణమాఫీని ప్రోత్సహించడం లేదు.
నీతి ఆయోగ్ కూడా రైతు రుణమాఫీ బదులు రైతులకు పెట్టుబడి పెట్టే విధానాలను తీసుకురావాలని ఆదేశించింది. కేసీఆర్ నేతృత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి పథకాలనే తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తునందించింది. నిరంతర నీటి సరఫరా చేసింది. రైతు వేదికలను నిర్మించింది. రైతుబంధు రూపంలో పెట్టుబడిని అందించే విధానాన్ని తీసుకురావడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది.
గత కేసీఆర్ ప్రభుత్వం వలె దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రైతులకు ఉచితంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందజేస్తే వాళ్లకు రుణాలు తీసుకోవలసిన అవసరం ఎందుకు ఉంటుంది? పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే వాళ్లు అప్పులెందుకు చేస్తారు. పండించిన పంటకు బీమా సౌకర్యం కల్పిస్తే రైతులు బ్యాంకుల వద్ద ఎందుకు క్యూలో నిల్చుంటారు? మొత్తంగా దేశంలో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలను అనుసరిస్తూనే వ్యవసాయరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలను జోడిస్తే అసలు ఈ రుణమాఫీలనేవే ఉండవు.
కన్నోజు శ్రీహర్ష