Meenakshi Natarajan : రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి భారీ ఝలక్ తగిలింది. ఆ పార్టీ తరఫున సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు. మీనాక్షి నటరాజన్పై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆమె తన ఆస్తుల వివరాల్ని సరిగ్గా వెల్లడించలేదని, అలాగే, తనపై తెలంగాణలో దాఖలైన క్రిమినల్ కేసు వివరాల్ని కూడా నామినేషన్లో పేర్కోలేదని బీజేపీ ఫిర్యాదు చేసింది.
నామినేషన్ పరిశీలన సందర్భంగా మీనాక్షి నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. మీనాక్షి నామినేషన్ కోల్పోవడంతో ఈ రాజ్యసభ సీటు బీజేపీ వశం కానుంది. ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసిన మహేశ్ కేవత్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. దీంతో బీజేపీకి విజయం దక్కితే, కాంగ్రెస్ ఒక సీటు కోల్పోనుంది. తన నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై మీనాక్షి స్పందించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల మీద బీజేపీ దాడిచేస్తోందన్నారు. సరైన బలం లేని చోట బీజేపీ అభ్యర్థిని నిలపడంలోనే ఆ పార్టీ వైఖరి, విధానం అర్థమవుతోందని ఆమె విమర్శించారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఇతర ఎన్నికల్లాగే, రాజ్యసభ ఎన్నికల్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందన్నారు. ఇది ఒక రాజ్యసభ సీటుకు సంబంధించిన అంశం కాదని, భారత ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని ఆమె వ్యాఖ్యానించారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. ఇది కేంద్రం కుట్ర అని అభివర్ణించారు. మొన్న ఓటు చోరీ, ఇప్పుడు సీటు చోరీ అంటూ రేవంత్ అన్నారు. తెలంగాణలో మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఆయన తెలిపారు. ఈసీ నిర్ణయంపై చట్టపరంగా పోరాడుతామని, కోర్టులో కేసు వేస్తామన్నారు.