కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు నిత్యకృత్యమయ్యాయి. చట్టసభల్లో నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా హక్కులను కాలరాస్తున్నది బీజేపీ. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చకు తావివ్వకపోగా, ప్రశ్నించిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ హక్కులను
హరిస్తున్నది. మోదీ హయాంలో ఎంపీల సస్పెన్షన్లు దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్ అధికారిక గణాంకాలే చెప్తున్నాయి.
2006-2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాం లో 51 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురైతే.. 2015 నుం చి ఇప్పటివరకు 139 మంది లోక్సభ, రాజ్యసభ సభ్యులపై సస్సెన్షన్ వేటు వేయటం గమనార్హం. మోదీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఉభయసభల్లో సస్పెన్షన్లు 170 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. 2006-14 మధ్య కాలంలో 2010-13లో మాత్రమే అత్యధికంగా సస్పెన్షన్లు నమోదయ్యా యి. ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినా, స్పీకర్ లేదా చైర్మన్కు వాటిని ఎత్తివేసే అధికారం ఉన్నది. గతంలో చాలాసార్లు ఎత్తివేసిన సందర్భాలున్నాయి. బీజేపీ హయాంలో ఇది కూడా జరగటం లేదు.
2012 నుంచి ఇప్పటిదాకా లోక్సభలో 135 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడగా, మోదీ వచ్చిన తర్వాతే ఏకంగా 91 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. 2015 ఆగస్టులో నాటి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒకేరోజు 25 మంది ఎంపీలపై ఐదురోజుల పాటు సస్పెన్షన్ వేటువేశారు. వ్యాపమ్ కుంభకోణం, లలిత్ మోదీలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేసినందుకు వేటువేశారు! 2017 జూలైలో ఆరుగురు లోక్సభ ఎంపీలను ఐదురోజులు సస్పెండ్ చేశారు. 2019లో ఒకేసారి 49 మంది ఎంపీలను రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. 2019 జనవరి 2న లోక్సభలో 24 మందిని 5 రోజులపాటు సస్పెండ్ చేశారు. ఒకరోజు తర్వాత మరో 21 మందిని 4 రోజులపాటు సస్పెండ్ చేశారు. 2020లో ఏడుగురు లోక్సభ ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇక తాజా పరిస్థితి ఉండనే ఉన్నది.
రెండోసారి అధికారంలోకి వచ్చేదాకా రాజ్యసభలో విపక్షాల పట్ల వినయ విధేయతలు పాటించిన బీజేపీ, 2019లో మళ్లీ అధికారంలోకి రాగానే రాజ్యసభలో కూడా సస్పెన్షన్లకు తెరలేపింది. యూపీఏ కాలంలో 2010లో ఏడుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 51 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ‘సస్పెన్షన్’ అనేది అధికారంపక్షం ఆయుధంగా మారింది. ప్రజా సమస్యలపై చర్చించాలని అడిగితే సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారని సస్పెండ్ చేస్తున్నారు. నిత్యావసర సరకుల ధరల పెంపు; పాలు, పెరుగు వంటి వాటిపై జీఎస్టీ విధింపు; పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు; ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాటిపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇస్తున్నాయి. పంటకు మద్దతు ధర కోసం కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాయి. వాయిదా తీర్మానాలను ఏకపక్షంగా తిరస్కరించడమే కాకుండా, వాటిని అడుగుతున్న విపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తున్నారు.
అట్ల రాజ్యసభలో 23 మంది, లోక్సభలో నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు దీక్ష కొనసాగిస్తున్నారు. అయినా ప్రజాసమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదు. గుజరాత్లో కల్తీ మద్యంతాగి 30 మందికిపైగా మరణిస్తే.. ఆ ఘటనపై ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంటు ఉభయసభలు గతంలో జరిగినట్లుగా జరగడం లేదని, సభ్యుల హక్కులకు విఘాతం కలిగేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మాజీ ఎంపీలు, లోక్సభ, రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీతత్వం వల్ల ప్రజలకు మేలు జరగాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. చర్చలు జరగాల్సిన చోట కక్షపూరిత చర్యలు కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే ప్రమాదం. ఈ ఎనిమిదేండ్లలో చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. అభిప్రాయాలు తీసుకోకుండానే బిల్లుల కూర్పు జరుగుతున్నది.
ప్రజల గొంతును వినిపించేందుకు ప్రజాప్రతినిధులను ప్రజలు పార్లమెంటుకు పంపుతారు. పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరిపి, వాటికి పరిష్కారం చూపి సుపరిపాలన అందించడం ప్రభుత్వ అంతిమ లక్ష్యం. పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం వాళ్లను ఎన్నుకున్న ప్రజలను అవమానించడమే. పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ కొనసాగడమంటే.. ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా మరణశయ్య వైపు నడిపించడమే. ఒక పక్క స్వాతంత్య్ర అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించాలంటున్న కేంద్ర ప్రభుత్వం.. చట్టసభల స్ఫూర్తినే నిర్వీర్యం చేస్తున్నది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ… ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజ్యాంగ హక్కులను సంరక్షించేలా పాలన చేస్తే మంచిది!
-బండారు జితేందర్ , 93935 41667