‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్నాడు గురజాడ. మనుష్యులంటే అందరూ వస్తారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగి, అత్యంత వైవిధ్యంతో మెలిగే భారతదేశం లాంటి దేశంలో ఇది మరీ ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. ఇటువంటి దేశాన్ని పాలించాలంటే ఉక్కు సంకల్పం, ఆచరణాత్మక నైపుణ్యంతో పాటు మరెన్నో సుగుణాలుంటేనే మనుష్యులందరికీ మేలు జరిగి, దేశ ప్రగతికి దారితీస్తుంది.లేని పక్షంలో ప్రగతి కుంటుపడుతుంది.
దాదాపు ఏడు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని గ్రహించిన ప్రజలు, అదే విషయం పదేపదే చెప్పిన నరేంద్ర మోదీ మాటలకు ప్రభావితులై బీజేపీకి పట్టం కట్టారు. సామాన్యుడికి న్యాయం జరగాలని అఖండ మెజారిటీతో రెండోసారి కూడా గెలిపించారు. గత ఎనిమిదేండ్లుగా జరిగిందేమిటి? 2014కు ముందు ఒక కుటుంబాన్ని ఆశ్రయించుకొ ని అవినీతిలో మునిగి దోచుకుంటే ఆ తర్వాత ఒక వర్గం (ప్రధా నంగా గుజరాతీ కుబేరులు) దేశాన్ని దోచుకునే విధానాలు వచ్చా యి. ఆ విధానంలో జరిగే నష్టం దేశాన్ని కోలుకోకుండా చేస్తున్న ది. కాంగ్రెస్ పాలనలో అధికారులకు, రాజకీయ నాయకులకు లంచాలివ్వగలిగిన వారందరూ బాగుపడ్డారు. ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా దానికి తగ్గ లంచం ఇచ్చి అనుమతులు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు? ఒక శాతం కుబేరులని, 19 శాతం ధనిక వర్గాలనీ వదిలేసి.. 80 శాతం సామాన్యుల జీవితం ఎలా ఉందని చూస్తే..
లక్షల మంది వలస కార్మికులు వందల మైళ్లు నడిచి స్వస్థలాలకు వెడుతూంటే వారికి ఉచితంగా రైళ్ళు వేయాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరారు. ఆ విజ్ఞాపనను కేంద్రం పట్టించుకోలేదు. అటువంటి ప్రభుత్వం విధానాలు, పనితీరు వల్ల దేశంలోని అత్యధిక ధనవంతుడు ఆసియా ఖండంలోనే నెంబర్ వన్గా ఎదిగాడు ఇదెలా సాధ్యం? కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే కదా! రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా? ‘అయినవాళ్లకు ఆకులలో, కానివాళ్లకు కంచాలలో’ అన్న చందంలో కోట్ల కరోనా మందుల పాకెట్లు ప్రపంచానికి పంచిన పాలకుడి వల్ల దేశంలోని వేల మంది సామాన్యులు మందుల్లేక ప్రాణాలు విడిచారు. అయితే భారతీయ శాస్త్రజ్ఞులు ఆదుకుని ఆ లోటు తర్వాత పూరించారు.
ప్రపంచానికంతా అన్నం పెడతానని ప్రగల్భాలు పలికిన పాలకుడికి తన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు 10 నుంచి 60 శాతం పెరిగాయని తెలియదా? దేశ సంపదలో 42.5 శాతం కేవలం ఒక్క శాతం ధనవంతుల దగ్గరే మూలుగుతూ సామాన్యులు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారన్న సోయి కేంద్ర పాలకులకు ఉందా? అంటే కోటి 40 లక్షల భారతీయ వ్యాపారవేత్తల దగ్గర దేశ బడ్జెట్ను మించిన ధనం ఉంది. మిగతా 138 కోట్ల మంది పిల్లలకు చదువులు చెప్పించలేక, పెళ్లిళ్లు చేయలేక అవస్థపడుతుంటే దేశంలో అత్యంత ధనవంతుడి దగ్గర 168 కార్లుంటాయి. ఆయన ముద్దుల కూతురి పెళ్ళి డ్రెస్సు ఖరీదు 90 కోట్లు! ఇది ఒక దేశమా? వన్ నేషన్? వీరు పాలకులా? సంపద భక్షకులా?
ఇక దేశంలో అన్నదాతల పరిస్థితి చూద్దాం. దేశానికి అన్నం పెట్టే రైతులు ఏడాదిన్నరపాటు రోడ్ల మీద ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఆ మహానుభావుడికి చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. ఎలా పెడతాడు ప్రపంచానికి అన్నం? బియ్యం కొనుగోలు చేస్తామని దొంగమాటలు చెప్పి, తీరా రైతులు పండించాక కేంద్రం కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, కక్షతో, ఆ బియ్యం కొనమంటే ఆ అన్నదాతలు ఏమవ్వాలి? అన్నం పెట్టేవారికి సున్నం పెట్టినట్టు కాదా? మరి ఈ ధనవంతులు తిన్నది వారికి అరుగుతుందా? కష్టజీవుల ఉసురు తగలదా?
మాటలకు, ప్రచారాలకు పడిపోదామా? సామాన్యుల కష్టాలు తీర్చి, ధరలు నియంత్రించలేని ఈ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కడదామా? అని ఇప్పుడు భారతీయులు ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ అవినీతిని బూచిగా చూపించి అధికారం చేజిక్కించుకున్న మోదీ ఆశ్రిత పక్షపాతం వలన దేశం నష్టపోవటం లేదా? స్విస్ బ్యాంకుల బదులు, దేశంలోని కుబేరుల చేతుల్లోకి ధనం వెళ్లడం మనకు శ్రేయస్కరమా? ఆశ్రిత పక్షపాతం, అవినీతి కంటే మేలా, రెండూ దేశ ప్రగతిని అడ్డుకోవా? రెండూ ప్రమాదకరమే కదా! బాగా ఆలోచించి దేశంలోని సామాన్య పౌరులు ఈసారి ఎలక్షన్లలో కేంద్రంలో బీజేపీ పార్టీని నిలబెట్టాలా, పడగొట్టాలా నిర్ణయించుకోవాలి.
-కనకదుర్గ దంటు
89772 43484