పాపం! వారి ఆశలు అడియాసలయ్యాయి.. అంచనాలు తలకిందులయ్యాయి.. తెలంగాణలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుందామనుకున్నారు. కానీ, పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. శాపనార్థాలు పెట్టిన ఆ విద్వేషశక్తులకు ఏ గతి పట్టిందన్నది పక్కనపెడితే.. విద్యుత్రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు నమ్మశక్యం కానివి. చీకట్ల తెలంగాణ వెలుగు జిలుగుల తెలంగాణగా మారటమే కాదు.. దేశానికే ఓ గొప్ప నమూనాగా అవతరించింది. తెలంగాణ ట్రాన్స్కోకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ-ప్లస్ క్యాటగిరీ ఇవ్వటం దీనికి తాజా నిదర్శనం. దేశవ్యాప్తంగా ట్రాన్స్కోల పనితీరు, ఆర్థిక క్రమశిక్షణ తదితర అంశాలను బేరీజు వేసి ఈ క్యాటగిరీని ఇస్తుంటారు.
2014లో రాష్ట్ర ఆవిర్భావం నాటికి తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లు. ప్రస్తుతం అది 17,300 మెగావాట్లను దాటిపోయింది. తలసరి వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబడింది మన రాష్ట్రం. సౌరవిద్యుత్ ఉత్పత్తిలో నెంబర్ వన్గా నిలిచింది. కేంద్రం ఆశ్రిత పక్షపాత, లోపభూయిష్ట విధానాలతో దేశమంతటా కరెంటు సంక్షోభం నెలకొంటే తెలంగాణ మాత్రమే 24 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అన్ని రంగాలకూ సరఫరా చేస్తున్నది. బీజేపీ చెప్పుకొనే డబుల్ ఇంజిన్ రాష్ర్టాలకు తలమానికమైన గుజరాత్లో రైతులకు ఎనిమిది గంటలు కూడా కరెంటు ఇవ్వటం లేదు. అది కూడా బిల్లులు వసూలు చేసి మరీ ఇస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్తును ఉచితంగా అందిస్తూ.. రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి దారులు పరిచింది. చేనేత పరిశ్రమ, క్షౌరశాలలు, ధోబీఘాట్లు, లాండ్రీలతోపాటు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత, సబ్సిడీ కరెంటును అందిస్తూ చేదోడువాదోడుగా నిలుస్తున్నది.
తెలంగాణలో వ్యవసాయం, కులవృత్తులు సంపద సృష్టికి నిలయంగా మారాయంటే కరెంటు రంగంలో సంభవించిన సంపూర్ణమైన మార్పులు కూడా ప్రధాన కారణం. లక్షలాదిమందికి ఉపాధి కల్పించే అనేకానేక పరిశ్రమలకు వేదికగా ఉన్న హైదరాబాద్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకున్నది. రాబోయే 30-40 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని చుట్టూ 400 కేవీ సామర్థ్యం ఉన్న 9 సబ్స్టేషన్లతో విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా ప్రజలకు, పరిశ్రమలకు కరెంటును గ్యారెంటీ చేసింది.
కరెంటు రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు చారిత్రాత్మకమైనవి. దీనిని యావత్దేశం గుర్తించింది. నీతిఆయోగ్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, కేంద్ర విద్యుత్శాఖ మొదలైన వాటి నుంచి లభించిన ర్యాంకులు, పురస్కారాలే దీనికి తార్కాణం. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, పట్టుదల, దిశానిర్దేశం, పకడ్బందీ కార్యాచరణతోపాటు రాష్ట్ర విద్యుత్ సంస్థల అధికారులు, సిబ్బంది నిరంతర కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. అదానీ వంటి వ్యక్తులకు ప్రయోజనం కల్పించటం కోసం ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న కేంద్ర పాలకులకు తెలంగాణ విజయం కనువిప్పు కావాలి.