తెగువకు, తెలివికే కాదు నడవాల్సిన తొవ్వను వెతుక్కోవడంలో కూడా తెలంగాణ యువతది ప్రగతిశీల దృక్పథమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. తన ప్రాంతాన్నే కాదు, ఈ దేశాన్ని నూతన దారుల్లో నడిపించే ప్రయత్నం చేసిన నాయకత్వాల వెంట వెల్లువలా కదిలిన చరిత్ర తెలంగాణ నవతరానిది. న్యాయానికి, అన్యాయానికి మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు, ఎలాంటి శషభిషలు లేకుండా న్యాయం వైపు నిలబడి వాస్తవాలను వేనవేల పిడికిళ్లుగా ఎత్తిపట్టినవారు తెలంగాణ యువతీ, యువకులు.
కశ్మీర్, కర్ణాటకల వలె తెలంగాణను వివాదాల సుడిగుండంలోకి నెట్టడం సాధ్యం కాదు. గండాలను దాటిన తెలంగాణ తన గతిని మార్చుకొని పురోగమిస్తున్నది.
తెలంగాణ నేడు అన్నిరంగాల్లో తలెత్తుకొని నిలిచిన రాష్ట్రం. స్వల్పకాలంలోనే స్వయంపాలన ఫలాలు అనుభవిస్తున్న రాష్ట్రం.
నిర్బంధాలు, త్యాగాలు, నెత్తుటి తర్పణాల మధ్య ప్రతి సందర్భంలో తూరుపు దిక్కై నిలబడ్డ తెలంగాణ యువతను ఏమార్చడం, మతమౌడ్యం, సంకుచిత నినాదాలవెంట నడిపించడం సులభం కాదనే వాస్తవాన్ని కాషాయ పార్టీకి కాలమే అర్థం చేయిస్తుంది. గుజరాత్, కర్ణాటక తరహా రాజకీయ వ్యూహాలు, యూపీలో పన్నిన పన్నాగాలు తెలంగాణ నేల మీద నిలబడలేవు. ‘దేశానికి సున్నం బెట్టిన వాళ్లు, తెలంగాణ తల్లికి అన్నం పెడతారం’టే నమ్మి మోసపోయే అమాయకులు కాదు ఇక్కడి యువకులు.
తెలివి, తెగువ, హృదయం లేని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనుసరించిన ‘అభివృద్ధి నమూనా’ ఈ దేశాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్న వాస్తవాలను కప్పిపుచ్చగలరా? గత ఎనిమిదేండ్లలో మోదీ మాయాజాలం వల్ల ఈ దేశ జీడీపీ 3.1 శాతానికి దిగజారింది. అదాని, అంబానీలతో పాటు దేశ కార్పొరేట్ శక్తులకు బీజేపీ సర్కార్ బంధువుగా మారిపోయింది. కేంద్రబడ్జెట్లో కార్పొరేట్ పన్ను రాయితీతో పాటు, ఆదాయపన్ను, డివిడెండ్ టాక్స్ రాయితీ కలుపుకొని దాదాపు రూ.80 వేల కోట్లు రాయితీగా ప్రకటించి కార్పొరేట్లపై తనకున్న ప్రేమను చాటుకున్నది. అదే అట్టడుగు, బడుగు ప్రజలకు పని కల్పించే ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాల్సింది పోయి కోత విధించారు. చివరికి మరింతగా దిగజారి ఆహార సబ్సిడీకి కేటాయించే నిధుల్లో సైతం గతేడాదితో పోల్చితే దాదాపు 80 వేల కోట్లు కోత పెట్టారు. ప్రభుత్వ వ్యయాన్ని పెంచి, పేదల కొనుగోలు శక్తిని పెంచి, దేశ ఆర్థికవ్యవస్థను ప్రగతి పథంలో నడిపించాల్సిన పాలకులు, నిరుపేదల అన్నం గిన్నెలో నిప్పులు పోశారు.
ప్రజా రాశులు సృష్టించిన సంపదకు కొలమానంగా నిలిచే ప్రభుత్వరంగ సంస్థలను బతికించి, బలోపేతం చేసి, యువతకు ఉపాధి కల్పించే కల్పతరువులుగా తీర్చిదిద్దాల్సిందిపోయి, ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు అప్పగించే వికృత అభివృద్ధి నమూనాలను ఎంచుకున్నారు. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి దాదాపు రూ.3 లక్షల 10 వేల కోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థల వాటాలను అమ్మేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా వేగంగా కదులుతున్నారు.
చివరికి లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీ, రైల్వే ఆస్తులపై కూడా కాషాయ పార్టీ కర్కశ పాలనా నమూనాను అమలు చేయాలని చూస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమంటే, ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ, మహిళలు తదితర బాధిత వర్గాలకు రాజ్యాంగం ప్రసాదించిన ‘ఉపాధి హక్కు’ను రాజ్యమే హత్య చేయడం. ప్రభుత్వ విభాగాల్లోనూ 14 లక్షలకు పైగా ఖాళీలను భర్తీచేయకుండా, ఈ దేశ యువతరాన్ని వంచిస్తున్న కేంద్రం, మిగతా రాష్ర్టాల్లో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ నినాదమిస్తే నమ్మేదెవరు?
చివరికి రక్షణ రంగంలో ఖాళీలను భర్తీ చేయడంలోనూ కేంద్ర సర్కార్ విఫలమైంది. దీన్ని నిరసిస్తూ ఇటీవల ఒక యువకుడు హర్యానా నుంచి ఢిల్లీకి దాదాపు 300 కి.మీ. ఆగకుండా Run for Employment నినాదంతో పరుగుపెట్టాడు. ఈ సత్యాలన్నింటికీ పాతరేసే ఫాసిజం నమూనాను బీజేపీ పాలకులు నమ్ముకున్నారు. అందుకే నిరుద్యోగం, అసమానతల నుంచి ఆజాదీ కావాలని నినదించిన కన్హయ్య, ఉమర్ ఖాలీద్ తదితర నవతరం ప్రతినిధుల మీద దేశద్రోహం నేరం మోపారు. జేఎన్యూ గొంతు నులిమి, సెంట్రల్ వర్సిటీల ఊపిరి తీయాలని మోదీ, షాలు ఎన్ని నిర్బంధాలను దేశ విద్యాసంస్థలపై అమలు చేస్తున్నారో యువతరం గమనిస్తున్నది. వ్యవస్థలను రుగ్మతలమయంగా మార్చిన బీజేపీ పాలకులు, దృష్టి మళ్లించడం కోసం హిందుత్వ నినాదాలను నూరి యువతరానికి అందించాలనే కుట్రలు చేస్తున్నారు.
శివాజీ విగ్రహం చుట్టూ, హనుమాన్ ర్యాలీల వైపు, భద్రాద్రి రాముడి కేంద్రంగా, భాగ్యలక్షి ్మ అమ్మవారి వేదికగా… యువతను భావోద్వేగాల ఊబిలో ముంచాలని ఎత్తుగడలు వేస్తున్నారు. అలాగే పక్క రాష్ట్రంలో హిజాబ్, హలాల్, ముస్లిం దుకాణాలపై నిషేధం వంటి సంకుచిత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
కశ్మీర్, కర్ణాటకల వలె తెలంగాణను వివాదాల సుడిగుండంలోకి నెట్టడం సాధ్యం కాదు. గండాలను దాటిన తెలంగాణ తన గతిని మార్చుకొని పురోగమిస్తున్నది. తెలంగాణ నేడు అన్నిరంగాల్లో తలెత్తుకొని నిలిచిన రాష్ట్రం. స్వల్పకాలంలోనే స్వయంపాలన ఫలాలు అనుభవిస్తున్న రాష్ట్రం. ‘ఊర్లో ఎన్ని విభేదాలున్నా, పరాయి ఊరోడు కొట్లాటకొస్తే, ఊరంతా ఏకమై తరిమే సహజ ఐక్యత స్వభావం తెలంగాణ ప్రజలది. అదే దారిలో సాధించుకొని, భవితకు బాటలు శోధించుకొని, రేపటి వెలుగుల వైపు నడుస్తున్న తెలంగాణను పరిరక్షించుకునే చైతన్య మార్గంలో నవతరం అడుగులు పడాలి.
ఆలోచన, ఆచారాలు, భావజాలాలు, బుద్ధిజీవుల మీద దాడులకు దిగుతూ అసత్యాల మీద ఆధిపత్యం చెలాయించాలనేది బీజేపీ, దాని సంస్థల మూల సిద్ధాంతం. అబద్ధాల రాజకీయ భూతాన్ని తెలంగాణ నేల నుంచి, దేశ రాజకీయాల నుంచి తరిమేద్దాం. కేసీఆర్ బాటలో బతుకులకు భరోసానిచ్చే భారత్ను పునర్నిర్మించుకుందాం.
-(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
డాక్టర్ ఆంజనేయ గౌడ్ 98853 52242