‘నీళ్లు, నిధులు, నియామకాలు..’ అనే నినాదాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మొదలు నిధులు, తర్వాత నీళ్లు, ఆ తర్వాత నియామకాలు ఇలా.. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కలలను సాకారం చేసుకుంటూ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం90 వేలకు పైగా ఉద్యోగాలను ప్రకటించింది. కానీ ఉద్యోగ నోటిఫికేషన్లపై పనిగట్టుకొని ప్రతిపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తూ నిరుద్యోగుల దృష్టిని మళ్లించటానికి విఫలయత్నాలు చేస్తున్నాయి. యువత జీవితాశయమైన ప్రభుత్వ ఉద్యోగ కలను నిర్వీర్యం చేసేవిధంగా మాట్లాడి వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి.
‘ఆర్థిక విముక్తి చెందకుండా, సామాజిక న్యాయం దక్కకుండా ఉండే రాజకీయ స్వేచ్ఛను నేను ఎంతమాత్రం విశ్వసించను’ అని రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతకర్త ఎంఎన్ రాయ్ చెప్పారు. వ్యవస్థను మార్చాలనుకోవటం మంచిదే. కానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తిగా మనం మారాలంటే మన ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు మారాలి. దీనికోసం మంచి హోదా, భద్రత కలిగిన ప్రభుత్వ ఉద్యోగం ఒక మంచి అవకాశం వంటిది. ఇంట్లో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం వచ్చి మంచి హోదాలో ఉంటే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటే గౌరవం దక్కుతుంది. కాబట్టి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఉద్యోగమే లక్ష్యంగా దూసుకుపోవాలి. అంతేగానీ, స్వార్థపూరిత ప్రతిపక్షాల మాయల్లో పడి బంగారు భవిష్యత్తును బలి చేసుకోవద్దు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన ఎన్నికలు, ఓట్లను దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా బాధ్యతాయుతమైన ప్రకటన చేశారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణను 33 జిల్లాలుగా విభజించుకున్నాం. దీనికి అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగాలంటే ప్రభుత్వ యం త్రాంగం అవసరం అనే విషయం తెలిసిందే. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముఖ్యంగా మహిళలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగం సాధించి తమ కుటుంబాలను ఉన్నతస్థాయిలో నిలబెట్టుకోవాలి.
తెలంగాణ ఏర్పడిన అనతికాలంలోనే కాళేశ్వరం వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టుకొని ‘ఔరా!’ అనిపించుకున్నాం. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహ వినియోగాలకు సమృద్ధిగా కరెంటును అందించుకుంటున్నాం. ఇక నిధుల విషయానికొస్తే సంక్షేమం- అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకొని దేశం కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేస్తున్నామని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. దేశ జీడీపీలో బీజేపీ పాలిత రాష్ర్టాలది 35 శాతం వాటా కాగా.. బీజేపీయేతర, కేవలం 10 రాష్ర్టాలు 65 శాతం వాటా కలిగి ఉన్నాయి. అందులో తెలంగాణది అధిక శాతం.
ఈ విధంగా నీళ్లు, నిధుల తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల మీద దృష్టిపెట్టింది. న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు రాకుండా పకడ్బందీగా ప్రణాళికలను రచించింది. ముల్కీ నిబంధనల తరహాలో 95 శాతం స్థానికులకే దక్కేలా, 5 శాతమే నాన్లోకల్ కింద, అవి కూడా ఓపెన్ కేటగిరీగా చేశారు. అందులో కూడా తెలంగాణ యువతకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్టికల్ ‘371-డి’ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం వేచిచూడటం, తద్వారా జోన్లను ఏర్పాటుచేయడంలో జాప్యం జరిగింది. ఫలితంగా నోటిఫికేషన్ల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ.. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి, అడగకుండానే గరిష్ఠ వయోపరిమితి పదేండ్లు పెంచ డం హర్షణీయం. ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు, సెర్ప్, మెప్మాలో పనిచేసే ఉద్యోగులకు హామీ ఇవ్వడం, కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్న 11,103 మందిని పర్మినెంట్ చేస్తూ, 80,039 పోస్టులకు నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. నిరుద్యోగ యువతకు తోడ్పాటునందించేలా స్థానిక ఎమ్మెల్యేలు ఉచితంగా శిక్షణ ఇప్పించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పోలీస్ అధికారులు, బీసీ స్టడీ సర్కిల్ ఇచ్చే ఉచిత కోచింగ్లను సద్వినియోగం చేసుకొని యువత లక్ష్యాన్ని చేరుకోవాలి.
కొంతమంది కేటుగాళ్లు డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభపెట్టి ఆర్థిక నష్టం చేకూర్చే ప్రమాదం కూడా పొంచి ఉన్నది. వారి నుండి అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పోస్టుల భర్తీని చేపట్టే సత్సంకల్పంతో ఉన్నదన్న విషయాన్ని యువత మరిచిపోకూడదు.
పాదయాత్రల పేరుతో రాజకీయ స్వప్రయోజనాల కోసం తిరుగుతున్న రాజకీయ నిరుద్యోగులకు విమర్శించడమే పని. వారిని పట్టించుకుంటే మనం ఒక్క అడుగూ ముం దుకువేయలేం. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అన్న లెనిన్ మాటలను గమనంలో ఉంచుకొని తెలంగాణ యువతరం ముందుకుసాగాలి.