‘రుకేంగే నహీ.. ఝుకేంగే నహీ.. ధాన్ లేనేతక్ ఛోడేంగే నహీ… అనాజ్ లేనేమే ఏక్ హీ విధాన్ యహీ హమారా మాంగ్ ప్రధాన్..’ అంటూ ఢిల్లీలో దద్దరిల్లిన నినాదమిది. ‘వి డిమాండ్ వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ’ అంటూ రైతు ధర్మాగ్రహం దేశ రాజధానిలో సింహనాదమైంది. కడుపు మండిన తెలంగాణ రైతు ఢిల్లీ పురవీధుల్లో ప్రకంపనలు సృష్టించాడు.
అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం ధాన్యం సేకరణను వివాదాస్పదం చేసి, తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ క్షుద్ర రాజకీయానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో చేసిన ధర్నా తెలంగాణ అన్నదాతల ఆకాంక్షలకు అద్దం పట్టింది.
అధికారంలో ఉండి ఉద్యమాలు చేయడమేంటని కొద్దిమంది సోకాల్డ్ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పాలనా నిర్వహణ చేయాల్సినవారు ఆందోళనలు చేయటమేమిటని అవాకులు చెవాకులు పేలుతున్నారు. అవును.., అధికారంలో ఉన్నవారు సైతం అనివార్యంగా ఉద్యమ క్షేత్రంలోకి దిగక తప్పని పరిస్థితులు సృష్టించింది ఎవరు? డిల్లీలో పంజాబ్, హర్యానా, యూపీ రాష్ర్టాల రైతుల చారిత్రాత్మక ఉద్యమ ప్రకంపనలు ఇంకా ప్రతిధ్వనిస్తుండగానే తెలంగాణ రైతులు సైతం రణనినాదం చేయాల్సి రావడానికి బాధ్యులు ఎవరు? కేంద్రంలో ఒక అరాచక ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాలు చేయక ఏం చేస్తాయి? ఒక ముఖ్యమంత్రి దేశ రాజధానిలో ధర్నాస్థలిలో కూర్చున్నాడంటే అది ఎవరి వైఫల్యం? ధాన్యం సేకరణ ఎవరి బాధ్యత? ‘రా రైస్’, ‘పారా బాయిల్డ్ రైస్’ అని మెలికలు పెడుతూ కేంద్ర సర్కారు తన బాధ్యత నుంచి నిస్సిగ్గుగా తప్పించుకోవాలని చూస్తే, క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా రైతుల పట్ల జవాబుదారీతనంతో నిలబడే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమించక ఏం చేస్తుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమాలు చేయగలదు. సముచిత నిర్ణయా లు, సమగ్రమైన కార్యాచరణతో రైతులకు ఊరట కూడా కలిగించగలదు.
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు నిజంగా రైతుల ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో భుజం కలిపి రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం రాజకీయాలకతీతంగా ధర్నాలో కూర్చునేవారు. అది మాని వ్యర్థ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నైజం తెలంగాణ రైతులు అర్థం చేసుకోలేరా? ‘రాజకీయం అంటే ప్రజల కోసం’ అనే స్పృహ లేనివాళ్లే ఇలాంటి విమర్శలు చేస్తారు. ప్రజలు కేంద్రంగా ఆలోచించేవాళ్లు ఎవ్వరూ ఇలాంటి విమర్శలను సమర్థించరు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అధికారం మీద యావే తప్ప ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారన్నది మరోసారి రుజువైంది.
ప్రపంచవ్యాప్తంగా సరళీకృత ఆర్థిక విధానాల అమలు తర్వాత అన్నిరంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరిగింది. అయితే ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రైవేటు కార్పొరేట్ శక్తులపై నియంత్రణ సాధించిన దేశాల్లో ఫలితాలు మెరుగ్గా ఉంటే, మన దేశంలో అందుకు భిన్నంగా ఉన్నది. ఈ పరిణామంలో ఎక్కువగా దెబ్బతిన్నది వ్యవసాయరంగమే. విత్తనాలు, ఎరువులు, కరెంటు మొదలుకొని గిట్టుబాటు ధర వరకు అన్నింటికీ రైతు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అనివార్యత ఏర్పడ్డది. రైతులు ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవడం ఓ పెద్ద సమస్యగా మారింది. పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రుణాలు, రాయితీలు ఉదారంగా ఇచ్చే ప్రభుత్వాలు, రైతులు పండించే పంట కొనుగోలు దగ్గర లాభనష్టాల వ్యాపార సూత్రాలు వల్లిస్తుండటం గమనార్హం.
మోదీ నేతృత్వంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నది. ధాన్యం సేకరించే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐని క్రమంగా బలహీనపరుస్తున్నది. రైతుల ఉద్యమానికి జడిసి వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కు తీసుకున్నది కానీ, ఆ చట్టాల్లోని విధానాల నుంచి వైదొలగలేదు.
తెలంగాణ ఏర్పడక ముందు 2014-15లో 1.31 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే, 2021 నాటికి అది 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదేవిధంగా వరి ధాన్యం ఉత్పత్తి 68.17 లక్షల టన్నుల నుంచి 218.58కి పెరిగింది. దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం పంజాబ్ను వెనక్కినెట్టి, తొలి స్థానంలో నిలిచింది తెలంగాణ.
రాజకీయ కుట్రలు
స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుంచి నేటిదాకా రాష్ర్టాలు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొంటున్నది. నిన్నటివరకు మన రాష్ట్రం నుంచి ధాన్యం కొన్న కేంద్రం ఇవ్వాళ మీ ధాన్యం కొనబోమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ‘రా రైస్ మాత్రమే కొంటాం.., బాయిల్డ్ రైస్ కొనేది లేద’నే కొర్రీలు ఎందుకు పెడుతున్నది? కేంద్రం తల్చుకుంటే మన రాష్ట్రం పండించే ధాన్యం కొనడం పెద్ద విషయం కాదు. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల అప్పులు మాఫీ చేసే కేంద్రానికి, రైతు నుంచి పంటలు కొనడానికి ఎందుకింత మీమాంస? లాభనష్టాల పేరిట ఎందుకీ ఊగిసలాట!
మరోవైపు దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతుండటంతో అసహనంతో ఊగిపోతున్నది. దక్షిణాది రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలదే ప్రాబల్యం. ప్రాంతీయశక్తుల నేతృత్వంలో దక్షిణ భారత రాష్ర్టాలు ఉత్తర భారత రాష్ర్టాల కన్నా ప్రగతి పథంలో ఎంతో ముందున్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా దూసుకుపోతుండటం బీజేపీకి మింగుడు పడటం లేదు. దేశంలో అనేక రాష్ర్టాల్లో కుట్రలు, కుయుక్తులతో పాగా వేస్తున్న బీజేపీ, తెలంగాణలో కొత్త కుట్రకు తెరలేపింది. ఎన్నికల్లో రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యావంతులు టీఆర్ఎస్కు దన్నుగా నిలుస్తున్నారు. చిరస్మరణీయ విజయాలందిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఆయా వర్గాలను దూరం చేసేందుకు బీజేపీ షడ్యంత్ర రచన చేసింది. అందులో రైతాంగాన్ని తొలి పావుగా ఎంచుకున్నది. ఈ మధ్యకాలంలో అనేక స్థానిక, ప్రత్యేక కారణాలతో ఒకటి- రెండు సీట్లు గెలవడంతో బీజేపీ అహంకారంతో విర్రవీగుతున్నది. లీడర్- క్యాడర్ లేని ఈ పార్టీ అబద్ధాలు, అరాచకాన్ని నమ్ముకున్నది. ఆ క్రమంలోనే బీజేపీ నేతల మాటలు, చేతలు వికృతంగా ఉంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తన పరిధిలో అన్ని సౌకర్యాలు కల్పించింది. వ్యవసాయరంగ సమస్యలు తీర్చి వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగేట్టు చేసింది. తెలంగాణ భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో యాసంగి వడ్లను బాయిల్డ్ చేసివ్వడం ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనబోమని కొత్త సమస్యకు తెరలేపింది. పంట మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలకూ బీజేపీ అడ్డుపడింది. వరిపంటే వెయ్యమని రైతులను రెచ్చగొట్టింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపే ప్రయత్నం చేసింది. అబద్ధాలతోనే ఉత్తరాది రాష్ర్టాల్లో అధికారం చేపట్టిన బీజేపీ అదే పంథాలో రైతుల్లో అయోమయం సృష్టించి, రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేట్లు చేయటానికి నానా తంటాలు పడుతున్నది.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసి, వరిధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ మన మంత్రులు, ఎంపీలు కోరితే.. మీకేమీ పనిలేదా? అంటూ హేళన చేయటం తీవ్ర గర్హనీయం. అలాగే.. ‘రా రైస్ కొంటామని చెప్పాం. రాష్ట్రం ఇవ్వడం లేద’ని చెప్తున్నారు. అయితే వడ్లు కొనండి అంటే కాదు బియ్యమే కావాలంటారు. ఇదేమి నీతి, విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. పీయూష్ గోయల్ అవహేళన చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని. 70 లక్షల మంది రైతులను అవహేళన చేసి మాట్లాడుతున్నారు. తెలంగాణపై వివక్షతో విషం కక్కుతున్నారు. ఇది కేవలం బీజేపీ రాజకీయ వికృత క్రీడ మాత్రమే.
ప్రజా ఉద్యమాలతోనే బుద్ధి చెప్తాం
ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది. తమిళనాడులో సంప్రదాయ ఆట ‘జల్లికట్టు’ను నిషేధిస్తే అది ప్రజా సాంస్కృతిక ఉద్యమంగా మారి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసే వరకు ఆగలేదు. రైతుల నడ్డి విరిచే నల్ల వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకువస్తే, 2020 నవంబర్ 26న 500 రైతు సంఘాలు ఏకమై రైతులను సంఘటిత పర్చాయి. ప్రభుత్వ ప్రాయోజిత హింసాకాండ, విచ్చలవిడి అరెస్టులు, రైతు నేతలపై, పాత్రికేయులపై దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులు జరిగాయి. 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా రైతు ఉద్యమకారులు బెదరలేదు. ఏడాది పాటు సాగిన రైతు ఉద్య మం నల్ల వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునేలా చేసింది.
తెలంగాణ రైతుల ప్రయోజనా లను పరిరక్షించడానికి కూడా ఉద్యమమే శరణ్యం. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్కు ఇలాం టి ఉద్యమాన్ని నిర్మించడం కొత్త కాదు, కష్టమూ కాదు. ఈ ఉద్య మం బీజేపీ అహంకారపు కొమ్ము లు విరిచే వరకూ సాగుతుంది.
(వ్యాసకర్త: తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి)