‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా అదేస్థాయిలో హేళన చేశాడు. తెలంగాణ ప్రజలపై అక్కసు వెళ్లగక్కిన ఎవ్వరికీ పుట్టగతులు లేకుండా పోయాయనేది చరిత్ర చెప్తున్న సత్యం. నాడు తెలంగాణపై అహంకారంతో మాట్లాడిన కిరణ్ కుమార్రెడ్డి రాజకీయంగా అడ్రస్ లేకుండాపోయాడు. గోయల్కు, బీజేపీకి కూడా అదే గతి పడుతుందనడంలో ఆశ్చర్యం లేదు.
కేసీఆర్ నాయకత్వంలో గెలిచి నిలిచిన తెలంగాణ నేడు దేశంలోనే సంపన్న రాష్ట్రంగా ఎదిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు సాయం చేయకుండా అన్నిట్లో మొండిచేయి చూపించినా… తన కాళ్ల మీద తాను నిలబడ్డది. తెలంగాణ ప్రజలు పోరాట పటిమ, ఆత్మాభిమానం కలిగినవారు. అట్లాంటివారిని నూకలు తినమని ఎగతాళిగా మాట్లాడిన కేంద్రమంత్రి గోయల్ మాటల వెనుక బీజేపీ కుటిల రాజకీయ ప్రయోజనం ఉన్నది.
ధాన్యం సేకరణ అంశాన్ని బీజేపీ కావాలనే రాజకీయం చేసి తెలంగాణ రైతులను అరిగోస పెడుతున్నది. దేశవ్యాప్తంగా లేని సమస్యను కక్షపూరితంగా తెలంగాణలోనే సృష్టిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ కుతంత్రపు వైఖరిని ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ముందే హెచ్చరించారు. ధాన్యం సేకరణలో కేంద్రం ఇబ్బందులకు గురిచేసే ఆస్కారం ఉన్నదని ఊహించారు. అనుమానించినట్లుగానే నేడు బీజేపీ వ్యవహరిస్తున్నది. వడ్లు కొనటానికి పెట్టరాని కొర్రీలు పెడుతున్నది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతారహితంగా వరి వేయండని, కేంద్రంతో మేం కొనిపించే బాధ్యత తీసుకుంటామని రైతులను ఉసిగొల్పాడు. నేడేమో పతా లేకుండాపోయాడు.
రాజకీయంగా చాలామంది గోకాసురులనే చూసిండు కేసీఆర్. ఆయన ముందు వీరి గుప్పిగంతులు ఓ లెక్కా! అంతిమంగా రైతులు బాగుండాలనే ఆశతో తెలంగాణలో పండిన ధాన్యాన్ని, కేంద్రాన్ని ఒప్పించి కొనిపిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలందిస్తుందని కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి టీఆర్ఎస్ తెలిపింది. చెల్లింపు జాప్యంలో అయ్యే వడ్డీ సుమారు 1200 కోట్లు భరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపింది. కానీ కిషన్రెడ్డి తను అన్న మాటలు మర్చిపోయి ఎనిమిదేండ్లలో లేని సమస్య ఇప్పుడెందుకని అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. హఠాత్తుగా తెలంగాణ యాసంగి వడ్లను కొనబోమని చెప్పి సమస్య సృష్టించింది కేంద్ర ప్రభుత్వమే కదా! తెలంగాణ రైతుల ఉసురు బీజేపీకి కచ్చితంగా తగులుతుంది.
రైతు శ్రేయస్సే ప్రథమ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం లాంటి గొప్ప మల్టిలెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించారు. రైతుల సాగునీటి గోస తీర్చారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేయడం, ఎక్కడికక్కడ నీటిని ఒడిసిపట్టే చెక్డ్యామ్ల నిర్మాణం లాంటి అద్భు త కార్యక్రమాలతో భూగర్భజలాలు పెరిగాయి. ఈ పరిణామాలతోనే తెలంగాణలో భూగర్భజలాలు పెరిగి విశేషంగా పంట దిగుబడి పెరిగింది. ఎనిమిదేండ్ల కిందట అంటే 2014కు ముందు తెలంగాణలో 34 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది.
ఇప్పడు 104 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. అంటే 69 లక్షల ఎకరాల్లో అదనంగా వరిసాగు పెరిగింది. గతానికి, ఇప్పటికి తేడా 198 శాతం పెరుగుదల. 2014 లో పంటల ఉత్పత్తి 154 లక్షల టన్నులు. నేడు కేసీఆర్ విధానాల వల్ల 340 లక్షల టన్నులకు పెరిగింది. అంటే 120 శాతం పెరుగుదల. ఇదంతా కనీసం తెలంగాణ బిడ్డగానైనా కిషన్రెడ్డి గుర్తించాలి.
సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణపై కేంద్రాన్ని కలిసేందుకు మంత్రుల బృందాన్ని ఢిల్లీ పంపిస్తే కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. రెండు రోజుల పడిగాపుల తర్వాత ఎగతాళిగా ‘తెలంగాణ యాసంగి బియ్యం మార్కెట్లో అమ్ముడుపోవు, మేము కొనలేం’ అని మాట్లాడుతూ కేంద్రమంత్రి గోయల్ అవమానించాడు. ప్రభుత్వాలున్నదే ప్రజల సంక్షేమం కోసం దానికి అనుగుణంగా మా ప్రాంత రైతుల వడ్లు కొనేలా చట్టంలో మార్పులు చేయండని, పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో కొన్నట్టే మా రాష్ట్రంలో రెండు పంటలు కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ‘మీరు (టీఆర్ఎస్)దేశంలో అధికారంలోకి వస్తారు కదా, అప్పుడు మీకు అనుగుణంగా చట్టాలు చేసుకోండ’ని కేంద్రమంత్రి స్థాయి మరిచి చాలా హేళనగా మాట్లాడటం గర్హనీయం.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రక్తం నాది. కేంద్రమంత్రితో నా సహచర మంత్రులు, మా టీఆర్ఎస్ ఎంపీల ముందే కేంద్రమంత్రితో విభేదించాను. ‘గతంలో బీజేపీ కూడా ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ఉండి నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగింది. మరిచిపోయారా అని అడిగా? పరిస్థితులు ఇలాగే ఉంటే, అన్నీ అనుకూలిస్తే మేం కూడా అధికారంలోకి వచ్చే రోజులు దూరంలో లేవు, సాధ్యమే..’ అన్నాను.
ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు ఆలస్యం చేస్తున్నారని తన కేంద్రమంత్రి పదవిని గడ్డిపోచలా భావించి రాజీనామా చేసిన ఘనత ఆయనది. కానీ తెలంగాణను గోయల్ అవమానించినా టీబీజేపీ నాయకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. అందుకే నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోనే తేల్చుకుందామని సమరశంఖం పూరించారు.
బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు జుగుప్సాకరమైన అపవిత్ర కలయికతో తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరీ బాధ్యతారహితంగా.. కేంద్ర ప్రభుత్వాన్ని అనకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాడు. ఆయనకు 10 వేల కోట్లు ఇస్తే వడ్లు కొనిపిస్తాడట! తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులపై ఆలోచన చేయండి. ‘నవ్వేటోడి ముందు జారి పడ్డట్టు’ మన బతుకులు మళ్లా అట్ల కాకూడదు. ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేరదాక తరిమికొట్టు- నీ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే బొంద పెట్టు’ అన్న కవి కాళోజీ మాటలను తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రైతాంగంతో పాటు మేధావులు, యువత దీనిపై ఆలోచన చేయాలి. బీజేపీని రాజకీయంగా ఓడించాలి. అధికారానికి దూరం చేసి దాని అహంకారాన్ని అణచివేయాలి.
‘నవ్వేటోడి ముందు జారి పడ్డట్టు’ మన బతుకులు మళ్లా అట్ల కాకూడదు. ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేరదాక తరిమికొట్టు- నీ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే బొంద పెట్టు’ అన్న కవి కాళోజీ మాటలను తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ,
శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి );వేముల ప్రశాంత్ రెడ్డి