ఆయన కనిపిస్తే చేతులూపుతూ.. ఆయన కనిపించేంత దూరం పరుగులు, చేయెత్తితే దారిపొడవునా దండాలు, మా నాయకుడొచ్చాడన్న ఉద్వేగం, ‘జై కేసిఆర్’, ‘జై తెలంగాణ’ నినాదాలు.. తాము కష్టాల్లో ఉన్నా.. ఆ కష్టాలు తీర్చే మా నేత వచ్చాడనే ధైర్యం హైదరాబాద్ నుంచి భద్రాద్రి దాక ఇదే మానియా. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో భద్రాద్రి వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో కేసీఆర్పై కనిపించిన ఆ ప్రజాభిమానం ఇప్పటికీ నా మదిలో తడిగానే ఉన్నది.
ఈ సృష్టిలో అన్నింటిని కొలవడానికి ఉపకరణాలుండవచ్చు.. కానీ ప్రేమను, అభిమానాన్ని కొలవలేమంటారు పెద్దలు. కానీ, భద్రాద్రి పర్యటనలో రానుపోను, మొత్తం 800 కిలోమీటర్ల ప్రయాణంలో కేసీఆర్పై ప్రజలు చూపించిన అచంచలమైన ఆ విశ్వాసం, ఆప్యాయతలే ప్రేమకు, అభిమానానికి కొలమానాలని నా మదికి అనిపిస్తున్నది.
అంతేకాదు, గుండెల్లో పెట్టుకున్న జనం కోసం ఒక నాయకుడు పడే తపనను కండ్లారా చూసే భాగ్యం దక్కింది. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే హన్మకొండ చేరేవరకు ఆయనకు తెలియని విషయం లేదు. జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి తాలూకు ప్రస్తుత స్థితిగతులు పూసగుచ్చినట్టు అధికారులకు వివరించడం.. ఎక్కడైనా పనుల్లో జాప్యం జరిగితే ఏ విధంగా అధిగమించాలో అధికారులకు దిశానిర్దేశం చేయడం చూసినప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. ఒక నాయకుడు ప్రజల కోసం ఇంత తీవ్రంగా కష్టపడతాడా అనిపించింది.
ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి దాకా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల గురించి, కొత్తగా హైవేలపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల గురించి, యాదాద్రి ముఖద్వారం మరింత అందంగా కనిపించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి, వరంగల్ జిల్లాకు ముఖద్వార నిర్మాణం గురించి, కరుణాపురం దగ్గర కొత్త ఐలాండ్ ఆలోచన గాని, దారి పొడవునా పెట్టాల్సిన చెట్లు, హైవేలపై ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన సూచికల గురించి, వేగ నియంత్రికల గురించి, ఏదైనా ప్రమాదం జరిగితే.. క్షతగాత్రులను అత్యవసరంగా దవాఖానకు తరలించేందుకు ఉండాల్సిన ఏర్పాట్ల గురించి.. ఒక్కటేమిటి ప్రతీ అంశంపై సమగ్రమైన అవగాహనతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర అధికారులకు ఆదేశాలివ్వడం, మాతో పంచుకున్న అంశాలు వింటున్నప్పుడు.. ఇదే కదా అసలైన నాయకుడి అద్భుతమైన విజన్ అనిపించింది. పద్నాలుగేండ్లు పోరాడి తెలంగాణను సాధించి, మరో ఎనిమిదేండ్లు ముఖ్యమంత్రిగా అహోరాత్రులు కష్టపడి దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టినప్పటికీ ఇంకా ఆయనలో ఆ తపన తీరలేదు. అనుక్షణం ఇంకా తెలంగాణను ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాలనే ఉత్సాహం, ఈ రాష్ట్ర ప్రజలకు సకల సౌకర్యాలు అందాలనే కేసీఆర్ ఆలోచన నిజంగా మమ్మల్ని అమితానందానికి గురిచేసింది.
ఇవేకాదు.. ఒకవైపు విరామం లేకుండా ఊళ్ళకు ఊళ్లను ముంచేస్తున్న వర్షం, మరోవైపు ‘ప్రతికూల వాతావరణం ఉన్నది.. ప్రమాదాన్ని ఊహిస్తూ వెళ్లొద్ద’ని భద్రతా సిబ్బంది హెచ్చరికలు, అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఏ వజ్ర సంకల్పంతో ఒకనాడు ఆమరణ దీక్షకు పూనుకొన్నాడో.. అదే సంకల్పంతో తన ప్రజల కోసం ముందుకు కదిలిన సందర్భం మమ్మల్ని తీవ్ర ఉద్విగ్నతకు గురిచేసింది. ప్రాణాలకు తెగించి ఒక ముఖ్యమంత్రి ప్రజల కోసం ఇంతలా కష్టపడ్డ సందర్భం దేశచరిత్రలో బహుశా ఇదే మొదటిదని చెప్పకతప్పదు. హెలికాప్టర్లో భద్రాద్రికి చేరాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణంతో హెలీప్యాడ్కు అనుమతి రాలేదు. అయినా రోడ్డు మార్గంలో, ఏజెన్సీ ప్రాంతం గుండా.. సుమారు 12 గంటలకు పైగా ప్రయాణించి భద్రాచలం, ఏటూరునాగారం ప్రాంతాలను చుట్టివచ్చారు. కరకట్టల వద్ద గోదారమ్మను శాంతించమంటూ పూజలుచేశారు. తర్వాత, ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. విపత్తుల సమయంలో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రులు ఉండవచ్చు కానీ, అసాధారణంగా వరదలో, ఎక్కడ కారు బురదలో చిక్కుకుంటుందో తెలియని విపత్కర పరిస్థితుల్లో ప్రయాణించి, వానలో తాను తడుస్తూ తన ప్రజలకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నది కాదనలేని సత్యం. అది కష్టాల్లో చిక్కుకున్న తన ప్రజలను రక్షించాలనే ఒక నిజమైన నాయకుడి అభినివేశానికి ప్రతీక.
హైదరాబాద్ నుంచి మొదలుకుంటే హన్మకొండ చేరేవరకు ఆయనకు తెలియని
విషయం లేదు. జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి తాలూకు ప్రస్తుత స్థితిగతులు
పూసగుచ్చినట్టు అధికారులకు వివరించడం.. ఎక్కడైనా పనుల్లో జాప్యం జరిగితే ఏ
విధంగా అధిగమించాలో అధికారులకు దిశానిర్దేశం చేయడం చూసినప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. ఒక నాయకుడు ప్రజల కోసం ఇంత తీవ్రంగా కష్టపడతాడా అనిపించింది.
ఇక కేసీఆర్ కనిపించగానే ప్రజలు స్పందించిన విధానం మమ్మల్ని విస్తుపోయేలా చేసింది. సాధారణంగా వరదలొచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు ఆవేశంతో నిలదీయడమో, డిమాండ్లు వ్యక్తం చేయడమో జరుగుతుంది. కానీ, కేసీఆర్ వెళ్లిన ప్రతి చోటా ఆయనను చూసి ఆప్యాయతానురాగాలను కురిపించారు. తమ సమస్యలకు పరిష్కారం వచ్చిందనే ధైర్యం ప్రదర్శించారు. బహుశా చరిత్రలో ఇది ఏ నాయకుడికి సాధ్యపడకపోవచ్చు. ఇక పునరావాస కేంద్రాల్లో ఉన్న సౌకర్యాల గురించి కేసీఆర్ బాధితులతో తెలుసుకొని వివరిస్తున్న, ఇంకా కావల్సిన సౌకర్యాల గురించి ప్రజలను ఆరా తీసిన సందర్భం కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ‘బాపు’ అని ఎందుకు ఆప్యాయంగా పిలుస్తారో విడమరిచి చెప్పింది. ఆయన చెప్పిన ప్రతీ మాటను చక్కగా వింటూ, ఆయన ఆదేశాల కోసమే ఎదురుచూస్తు న్నాం అనేలా ప్రజలు స్పందించిన తీరు అత్యద్భుతమని చెప్పకతప్పదు. అంతేకాదు, తక్కువ సమయంలోనే అధికారులు చేసిన సహాయక చర్యల ఏర్పాట్లు ముఖ్యమంత్రి నాయకత్వ పటిమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
ఏ ఊరికి పోయినా.. సారూ అంటూ వచ్చిన జనం.. ఆయన పలకరింపులతో కొండంత ధైర్యాన్ని పొందారు. రామన్నగూడెంలో కేసీఆర్ గుంపుగా ఉన్న గ్రామస్థులతో మాట్లాడుతున్నప్పుడు.. వెనుక వరుసలో ఉన్న ఒక పెద్దాయన ‘కేసీఆర్ వచ్చిండు మాకేం భయంలేద’న్న అరుపు ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటింది. అంతేకాదు.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమపార్టీ వారు కాకపోవడం వల్ల ముఖ్యమంత్రి తమవద్దకు రారేమో అనుకున్న జనానికి ఓట్లు, సీట్లు కాదు నాకు జనం మాత్రమే కావాలనేలా విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటించి.. అక్కడి ప్రజలకు మరింత సాంత్వన కలిగించడం కేసీఆర్లోని విలక్షణ వ్యక్తిత్వానికి, మానవీయ ఆలోచనలకు నిలువెత్తు తార్కాణం. సమకాలీన రాజకీయాల్లో తనపర బేధం చూడని నాయకునిగా కేసీఆర్కు ఉన్న క్రేజ్, నమ్మకం జనంలో స్పష్టంగా కనిపించింది. అందుకే కేసీఆర్ను చూడగానే జనం తమ బాధలను మరచిపోయి కేసీఆర్తో కలిసిపోయి ఆనందంగా ముచ్చటించారు. తమకు అందుతున్న సౌకర్యాలను పూసగుచ్చినట్టు ముఖ్యమంత్రికి వివరించారు. అంతేకాదు, నాటి ఉద్యమ సంఘటనలను వివరిస్తూ ఆ తెగువ ప్రదర్శించాలని వారిలో ముఖ్యమంత్రి ధైర్యం నింపిన ఘట్టం అద్వితీయమైనది.
వెళ్లిన ప్రతీచోట ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన కేసీఆర్ను ఆనందానికి గురిచేసింది. ‘ప్రజలు సంతోషంగా ఉంటే మనం విజయవంతమైనట్టే’ అనేది ఆయన ప్రతి సందర్భంలో చెప్పే మాట. అది నూటికి నూరు శాతం నిజమైంది. ఇక ప్రజలకు అందుతున్న సౌకర్యాల విషయంలో కేసీఆర్ చాలా నిక్కచ్చిగా ఉంటారు. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా సహించరు. అందుకు అనుగుణంగా అధికారులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేశారు.
అది భద్రాచలం, ఏటూరు నాగారంలలో పలు పునరావాస కేంద్రాలను ఆయన సందర్శించినప్పుడు స్పష్టంగా కనిపించింది. విపత్తు నిర్వహణ దళం, పోలీస్ అధికారులతో పాటు ఇతర శాఖలన్ని చాలా అప్రమత్తంగా కనిపించాయి. వివిధ ప్రాంతాల నుంచి అధికారులను, పారిశుధ్య సిబ్బందిని, వైద్య సిబ్బందిని వరద ప్రభావిత ప్రాంతానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఉన్న హెలికాప్టర్కు తోడు మరొక హెలికాప్టర్ను కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, అందరూ జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. పూర్తిగా సాధారణస్థితికి వచ్చేవరకు పునరావాస కేంద్రాల నుంచి తరలివెళ్లవద్దని ప్రజలను కోరారు. మరో రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదన్న వాతావరణ శాఖ హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు వలన భద్రాచలంలో ఇదేస్థాయి నీరు ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారికోసం ఎత్తయిన ప్రాంతంలో కాలనీలు నిర్మిస్తామని ప్రకటించారు. అందుకోసం రూ.1000 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక ముంపునకు గురై పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించారు. మనిషికి 20 కేజీల బియ్యం, పప్పు దినుసులు ఉచితంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఒక నాయకుడు ప్రజలకు ఇంతకంటే ఏం భరోసా ఇవ్వగలడు? ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు వరదలు వచ్చాయి, ఎందరో నాయకులు వచ్చారు కానీ, ఎవరు కేసీఆర్లా ఆలోచించలేదు, ఆచరించలేదు. ప్రజల మనిషి కాబట్టే, ప్రజల కోసం చావు నోట్లో తలపెట్టిన త్యాగశీలి కాబట్టే కేసీఆర్ ఇంతటి ఆలోచన చేయగలిగారు. ఒక సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలిగినవాడే నాయకుడని ఉద్యమకాలం నుంచి నేటిదాకా మనసా వాచా కర్మణా ఆచరిస్తున్న నేత కాబట్టే ఇంతటి నిర్ణయాలు తీసుకోగలిగారు. ముఖ్యమంత్రితో ఈ పర్యటన మాకు అనేక విషయాలను నేర్పింది. పాలకులకు దూరదృష్టి ఉండాలన్న వాస్తవాన్ని కళ్లకు కట్టింది. ప్రజల కష్టాలను, కన్నీళ్లను తుడవటమే నాయకుడి ప్రథమ కర్తవ్యమని తేల్చింది. అలా పనిచేసినవారు జనం గుండెల్లో నిలిచిపోతారని ఎలుగెత్తి చాటింది. కేసీఆర్ మాత్రమే తెలంగాణ ఆ త్మను ఆవిష్కరించగల నేత అని చాటిచెప్పింది. పార్టీలు, నాయకులు ఎందరున్నా తెలంగాణ బిడ్డలకు సాంత్వన చేకూర్చగలిగిన నాయకుడు కేసీఆర్ ఒక్కరేనన్న సత్యాన్ని కండ్లముందు ఆవిష్కరించింది.
(వ్యాసకర్త: డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ, అధ్యక్షులు తెలంగాణ రైతు బంధు సమితి)