దేశంలో గత కొద్ది నెలలుగా ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థల రూపంలో దాడులు జరుగుతున్నాయి. గత తొమ్మిదేండ్లలో సీబీఐ, ఈడీ, ఐటీలు నమోదు చేసిన కేసులు, అరెస్టుల లెక్కలే బలవంతుల దౌర్జన్యకాండకు అద్దం పడుతున్నాయి.
గత తొమ్మిదేండ్లలో ఈడీ ఏకంగా 5,310 కేసులు నమోదు చేసింది. అందులో ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు, వారిని సమర్థించే సంస్థలు, వ్యక్తులే ఎక్కువగా ఉండటం శోచనీయం. నిష్పాక్షికంగా పనిచేస్తూ జాతి ప్రయోజనాలను కాపాడటం కోసం ఉద్భవించిన సీబీఐ 25 వేలకు పైగా కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఎక్కువ శాతం ఏండ్ల తరబడి విచారణ సాగిన తర్వాత కోర్టుల్లో వీగిపోయాయి. 90 శాతానికి పైగా ఇలాంటి కేసులే ఉండటం విషాదం. ఇక ఐటీ దాడులకు లెక్కే లేదు.
తమ ఆధిపత్యాన్ని, ఆగడాలను ప్రశ్నించే ప్రజా ప్రభుత్వాలను అస్థిరపరచటం, పార్టీలను చీల్చటంతో పాటు భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న ప్రజల్లో చీలిక తేవటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థగా పేర్కొంటున్న భారతదేశంలో బలమైన కేంద్రంతో పాటు బలమైన రాష్ట్ర ప్రభుత్వాలు మనగలిగితేనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రపంచ చిత్రపటంలో మన దేశానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకుంటే మంచిది. అరవై ఏండ్ల పోరాటం తర్వా త ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ కేంద్రం అవలంబిస్తున్న వైఖరి భిన్నంగా ఉన్నది.
‘తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ’… అన్న రీతిలో సాగుతున్న ఆకుపచ్చటి తెలంగాణలో మంటల్ని రగిల్చేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఆ కుటిల యత్నాలు ఎన్నటికీ ఫలించవనే విషయం వారికి అర్థం కావడం లేదు. ఇబ్బందులు పడ్డ అన్ని సమయాల్లోనూ మేధావులు, విద్యావంతులు తెలంగాణ ప్రజలకు అండగా నిలిచారు. తమకు తెలంగాణయే ముఖ్యమని, తెలంగాణను అన్ని విధాలుగా ప్రగతివైపు పరుగు పెట్టించగల శక్తి, సామర్థ్యాలు కలిగిన నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం 10వ ఏట అడుగుపెడుతున్న సందర్భంలో.. ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు, నెరవేర్చుకోవాల్సిన స్వప్నాల విషయంలో మేధావులు మరోమారు కేసీఆర్కు మద్దతుగా నిలవాలి. అనేక త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్ నాయకత్వాన్ని ఇప్పుడు దేశం కోరుకుంటున్నది. తెలంగాణ మోడల్ తెరమీదికి వచ్చిన నేపథ్యంలో దేశంలోని మేధావి లోకమంతా కేసీఆర్ సేవలు దేశ ప్రజలందరికీ చేరువయ్యే దిశగా బలపరచాలి. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మేధావి వర్గాలతో సమాలోచనలు జరిపారు. వారి సలహాలు, సూచనలతో ముందుకెళ్లారు, ఇప్పుడు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి చెందినట్టు దేశం అభివృద్ధి చెందాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. హిందుత్వం ముసుగులో ప్రజాస్వామ్య లౌకిక విధానాలను దెబ్బతీస్తున్న ఈ తరుణంలో వాటి పునాదులను మరింత బలీయంగా తయారు చేసుకునేందుకు కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం అని దేశ ప్రజలు భావిస్తున్నారు. ఈ తరుణంలో మేధావులంతా కేసీఆర్కు బాసటగా నిలవాలి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అప్రజాస్వామిక విధానాలను కూకటివేళ్లతో పెకిలించాలి. హిందూత్వ పేరుతో దేశ ప్రజలను విచ్ఛిన్నం చేస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న మోదీ పాలనకు చరమగీతం పాడాలి.
నిజమే.. బలవంతుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనమే సమాజానికి ఎక్కువ నష్టం చేకూరుస్తుంది. కండ్లెదుటే అనేక అకృత్యాలు జరిగిపోతున్నాయి. అయినా మేధావులు మౌనంగా ఉంటే దేశ ప్రజలు ఎంతో నష్టపోతారు. మేధావులు మౌనం వీడితే ప్రజాస్వామ్యానికి, సమాజానికి భవిష్యత్తులో జరిగే నష్టాన్ని నిలువరించగలుగుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలికి వెన్నుదన్నుగా నిలిస్తే తెలంగాణ వలె దేశం కూడా అనతికాలంలోనే అభివృద్ధి పథాన ముందుకుసాగుతుంది.
(వ్యాసకర్త: ఉమ్మడి ఏపీ మాజీ ప్రధాన సమాచార కమిషనర్)
-డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
92465 26899