తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంతోమంది యువనేతలకు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు వ్యక్తులు చేసే తప్పిదాలు వ్యవస్థ లక్ష్యాలను ఆటంకపరుస్తాయి. ప్రస్తుతం జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారం కూడా ఇటువంటిదే. దీనివల్ల యువతలో ఉత్పన్నమైన సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలకు ఆదేశించింది.
చైతన్యవంతులైన తెలంగాణ యువత విపక్షాల స్వార్థ రాజకీయాలకు ప్రభావితం కావద్దు.రాజకీయ ఊబిలో చిక్కుకొని విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆందోళనకు గురికాకుండా విజ్ఞతతో ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, మనోస్థయిర్యాన్ని కోల్పోకుండా లక్ష్య సాధన దిశగా ముందుకుసాగాలి.
ఆరోపణలు వచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పిదాలు జరగకుండా, మరింత పారదర్శక వ్యవస్థను రూపొందించటానికి కసరత్తు ప్రారంభించింది. రైద్దెన నోటిఫికేషన్లను సాధ్యమైనంత త్వరగా తిరిగి నిర్వహించి ఉద్యోగార్థులకు బాసటగా నిలువనుంది. 24 గంటల పాటు స్టడీ సెంటర్లలో చదువుకునేలా భోజన సదుపాయంతో కూడిన ఏర్పాట్లు చేయనున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్ల సంఖ్యను పెంచడంతోపాటు వాటిని బలోపేతం చేయడం ద్వారా.. ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతను మరింత ప్రతిభావంతులుగా మలుస్తున్నది. టీ-శాట్ ద్వారా టెలివిజన్ ఛానల్లో ఉచిత శిక్షణ, యూనివర్సిటీల్లో ఉచిత శిక్షణా కేంద్రాలు, స్టడీ సర్కిళ్ల పెంపు, ఆన్లైన్లో పోటీపరీక్షల మెటీరియల్.. వంటి అనేక చర్యలు తెలంగాణ విద్యార్థి సమాజానికి తెలియనివి కావు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం అందిస్తున్న అనేక సౌకర్యాలను ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించాలని ఇటీవలే మంత్రి కేటీఆర్ ఉద్యోగార్థులకు బహిరంగ లేఖ రాశారు కూడా.
రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అనేక మంది విద్యార్థి నాయకులకు ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్ తదితర పదవులను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అందించింది. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో యువతకు రాజకీయాల్లో ప్రోత్సాహం కల్పించింది. మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువత కోసం గతంలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటికి అదనంగా 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 40 వేలకు పైగా ఉద్యోగాలకు ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. ఉద్యోగాల్లో స్థానిక యువతకే 95 శాతం లభించేలా సరికొత్త జోనల్ వ్యవస్థను రూపొందించి అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ మెయిన్స్ తదనంతరం నిర్వహించే ఇంటర్వ్యూలను రద్దు చేసింది.
నియామకాలకు సంబంధించి జోనల్ వ్యవస్థను ఆమోదించకుండా నాడు కేంద్రప్రభుత్వం, నేడు యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లును ఆమోదించకుండా రాష్ట్ర గవర్నర్ ఇబ్బందులు పెట్టినప్పటికీ ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నది. అంతేకాదు, యువతలో నైపుణ్యాలను పెంపొందిస్తూ వారి సేవలను ఉత్పాదక రంగంలో ఉపయోగించుకోవడానికి వీలుగా ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ (టాస్క్) అనే సంస్థను ఏర్పాటు చేసింది. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి కేటీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో పెట్టుబడులు తరలి వచ్చాయి. తద్వారా 17.26 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఉనికిలోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగ నియమకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరించిందో తెలంగాణ యువతరానికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాల హయాం లో పైరవీలు, అవినీతి పెద్ద ఎత్తున నడిచేవి. కానీ, స్వరాష్ట్రంలో ప్రభుత్వం వీటి ఊసే లేకుండా ఎంతో నిబద్ధతతో నియామక ప్రక్రియను చేపట్టింది.
ప్రతిపక్షమంటే ప్రభుత్వానికి ప్రజోపయోగకరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా అభివృద్ధికి తోడ్పడాలి. కానీ, తెలంగాణ రాజకీయాల్లో అటువంటి ప్రతిపక్షాలు మచ్చుకైనా కనిపించవు. స్వీయ రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం ఏమాత్రం పట్టని ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఉండటం నిజంగా దురదృష్టకరం. పేపర్ లీకేజీ సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చి, యువతను భ్రమల్లో ఉంచే విధంగా ప్రతిపక్షాలు పథకాలు రచిస్తున్నాయి. సమస్యకు మరింత ఆజ్యం పోసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం విపక్ష నేతల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వ్యక్తులు చేసిన తప్పిదాలను వ్యవస్థకు ఆపాదించి యువతను గొడవలకు ప్రేరేపించి రాజకీయంగా లబ్ధి పొందాలని భావించడం ప్రతిపక్షాల దిగజారుడు రాజకీయాలకు ఒక సంకేతం. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న పలు రాష్ర్టాల్లో కూడా అనేక సార్లు పేపర్ లీకేజీ ఘటనలు సంభవించాయి. ఉమ్మడి ఏపీలోనూ బోలెడన్ని సార్లు జరిగాయి. నేడు నానా యాగీ చేస్తున్న వారు దీనికి ఏమి సమాధానం చెబుతారు. ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారానికి చేయూతనందించాలి కాని మరో కొత్త సమస్యను సృష్టించకూడదు.
చైతన్యవంతులైన తెలంగాణ యువత విపక్షాల స్వార్థ రాజకీయాలకు ప్రభావితం కావద్దు. రాజకీయ ఊబిలో చిక్కుకొని విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆందోళనకు గురికాకుండా విజ్ఞతతో ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, మనోస్థయిర్యాన్ని కోల్పోకుండా లక్ష్య సాధన దిశగా ముం దుకు సాగాలి. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం యువత ఆకాంక్షలకు అద్దం పడుతూ, వారికి ఉజ్వలమైన బంగారు భవిష్యత్తును అందిస్తుంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ నేత)
-కొనుకటి ప్రశాంత్
80084 92700