భారతీయ ఆర్థికవ్యవస్థకు రైల్వే విభాగం జీవనాడి వంటిది. ఏటా రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన పెరగటం లేదు. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులు తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. మెట్రో నగరాల్లో రైల్వే బ్రిడ్జిలు రద్దీగా ఉండి ప్లాట్ఫాం మొదలు నుంచి చివరి వరకు చేరుకునేందుకు కనీసం 15 నిమిషాలు పడుతున్నది. రద్దీ సమయాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు పనిచేయక పోవడం నిత్యకృత్యం.
సామాన్య ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఎక్స్ప్రెస్ రైళ్లలో అన్ రిజర్వ్డ్ బోగీల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల స్లీపర్ క్లోచ్లలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బోగీలలో కెపాసిటీకి మించిన ప్రయాణికులు ఉండటం వలన టాయిలెట్ ఉపయోగం ఎక్కువ. మూత్రశాలల్లో నీరు లేకపోవడం, భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నదని ప్రయాణికులు వాపోతుండటం గమనార్హం. బోగీల్లో అపరిశుభ్రత ప్రయాణికుల ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నది. ఒకే రైలును పేరు మార్చి వివిధ రూట్లలో తిప్పడం వల్ల బోగీలను, టాయ్ లెట్లను శుభ్రపరచడం, బెర్తులు, సీట్లు, చెడిపోయిన నల్లాలు, పైపుల మరమ్మతు చేసే సమయం కూడా ఉండటం లేదని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు.
ఒక్కోసారి ఎటువంటి ముందస్తు సూచనలు తెలపకుండా ప్యాసింజర్ రైళ్లు రద్దుచేయడం లేదా ఎక్స్ప్రెస్ రైళ్ల గమ్యం తగ్గించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో మిగ్జాం తుఫాన్ వల్ల రైళ్లు రద్దుచేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రద్దుచేయడం మంచిదే, కానీ, తుపాన్ ప్రభావం లేని ఖాజీపేట, విజయవాడ జంక్షన్ల మధ్య ప్రతిరోజు నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కేంద్రంలోని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వారు కేవలం హామీలు, గ్యారంటీలకు పరిమితమయ్యారు.
రైల్వేలు ప్రజల సొమ్ముతో నిర్మించినవి. అందుబాటు ధరల్లో సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజల వద్ద వసూలు చేసిన పన్నులు ద్వారా వచ్చిన సొమ్ముతో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచాలి. వయో వృద్ధులకు గతంలో ఇచ్చిన రాయతీలు పునరుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్కు రాకెట్ పంపినప్పుడు అంతకన్నా తక్కువ ఖర్చుతో రైళ్ల సంఖ్య పెంచి స్టేషన్లలో మౌలిక సదుపాయాలు, నూతన ప్యాసింజర్ రైళ్లు, బోగీల సంఖ్య పెంచవచ్చు. సుఖవంతమైన, ఎటువంటి అసౌకర్యం లేకుండా పరిశుభ్రమైన రైలు ప్రయాణం చేసినప్పుడే ‘స్వచ్ఛ రైల్- స్వఛ్చ్ భారత్’ నినాదానికి సార్థకత ఏర్పడుతుంది. ఈ దిశగా రైల్వే అధికారులు దృష్టి సారించాలి.
– ఆళవందార్ వేణుమాధవ్