టీఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడం వెనుక అభ్యుదయ కాంక్ష, దూరదృష్టి, సాహసం ఉన్నాయి. తెలుగు వ్యక్తి, ఆ మాటకు వస్తే దక్షిణాది నాయకుడెవరూ గతంలో ఇంతటి ధైర్యాన్ని ప్రదర్శించలేదు. టీఆర్ఎస్ను జాతీయస్థాయి పార్టీగా మార్చడం వెనుక పట్టుదల కనిపిస్తున్నది. మిగిలిన పార్టీల వలె పేరులోనే భారతీయత లేదు. అది ప్రత్యామ్నాయ ప్రణాళిక, కార్యాచరణలో ఉన్నది. అందుకే గర్వంగా ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని చెప్పుకోగలుగుతున్నారు.
ప్రతి పార్టీ తనదైన శైలిలో ఇలాంటి రాజకీయ నినాదాలు ఇస్తుంటాయి. ఇది సహజం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్న ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న నినాదం వాటికన్నా భిన్నమైనది. రైతుల సమస్యలే భూమికగా ఏర్పాటైన పార్టీ ఎంచుకున్న నినాదం అది. గతంలో రైతుల సమస్యలపై పార్టీలు గళమెత్తిన సందర్భాలు లేకపోలేదు. చౌదరి చరణ్సింగ్, దేవీలాల్ బలమైన రైతు నాయకులుగా వ్యవహరించారు. అయితే వారి ప్రయత్నాలు తాత్కాలిక ఫలితాలిచ్చాయే తప్ప, శాశ్వత ప్రయోజనాలు ఇవ్వలేకపోయాయి. ఆ లోటును పూడ్చడమే బీఆర్ఎస్ లక్ష్యం.
ఎంత లేదనుకున్నా కొన్ని దశాబ్దాల కిందటి వరకు రైతులకు సామాజిక హోదా, గుర్తింపు ఉండేది. కానీ ఇపుడు రైతులుగా చెప్పుకోవడానికి యువత ముందుకు రావడం లేదు. ఆదాయాలు తగ్గ డంతో ఒకప్పుడు ఉన్నత వర్గాలుగా గుర్తింపు పొందిన జాట్లు, పటే ళ్లు, మరాఠాలు తమను బీసీలుగా గుర్తించాలని ఉద్యమాలు చేస్తు న్నారు. అంటే ఆర్థిక సమస్య సామాజిక సమస్యగా మార్పు చెందిం ది. బహుముఖ కోణాలున్న ఈ సమస్యలు లోతుగా చర్చించాల్సిన విషయాలు. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు. అది కొరవడటమే బీఆర్ఎస్ను ఏర్పాటు చేయక తప్పనిసరి పరిస్థితి కల్పించింది. వ్యవసాయ సంస్కరణల పేరుతో బీజేపీ ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకువచ్చినా కనీసం పార్లమెంటులోనైనా వాటిపై చర్చ జరుగలేదు. రైతులకు కాదుకదా కనీసం చాలా మంది ఎంపీలకూ వాటిపై పూర్తిగా అవగాహన లేదన్నది నిష్ఠుర సత్యం. ఆ ఫలితమే వాటి ఉపసంహరణ. సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను కూడా రైతుల నుంచే తెలుసుకొని అందుకు తగ్గ కార్యాచరణను రూపొందించడాన్నే బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకే దక్షిణాది నాయకుడు పెట్టిన బీఆర్ఎస్ పార్టీపై కూడా ఉత్తరాదిలో కూడా ఆసక్తి నెలకొన్నది.
కశ్మీర్లోని ఆపిల్ రైతుల దగ్గరి నుంచి కేరళలోని కొబ్బరి రైతుల వరకు, బెంగాల్లోని వరి రైతుల నుంచి గుజరాత్లోని పత్తి రైతుల వరకు.. అందరిదీ ఒకటే ఆవేదన. మద్దతు ధర, మార్కెటింగ్ లేకపోవడం. వ్యవసాయం అంటే యువతలో వైముఖ్యం కలగడానికి ఇదే ప్రధాన కారణం. మద్దతు ధరపై రైతులు ఆందోళనలు చేసినా, కేంద్ర సర్కార్ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.
ప్రభుత్వం ఒక ధరను నిర్ణయిస్తే.. మార్కెట్లో అంతకుమించి ధర పలికినప్పుడు రైతులకు నష్టం వస్తుంది కదా, అందుకే దీన్ని అమ లు చేయలేకపోతున్నామని కేంద్రం చెప్పుకొచ్చింది. అయితే ప్రభుత్వ వాదన సరికాదు. అధిక ధరలు పలకడం నిత్యం జరిగేది కాదు. రైతుల చేతిలోని పంట అంతా అమ్మకం జరిగి, మార్కెట్లో ఇక లభించదన్న సమయంలోనే ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరే గిట్టుబాటు కావడం లేదని భావిస్తుంటే అది కూడా లభించని పరిస్థితి నెలకొన్నది. ఇక మార్కెటింగ్ అన్నది మాయాజాలమే. ఇంత డిజిటల్ యుగంలోనూ ధరల్లో హెచ్చుతగ్గులు రైతులకు తెలియడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి గ్యారెంటీ ఇచ్చేలా పనిచేస్తామంటున్నది భారత్ రాష్ట్ర సమితి.
బీఆర్ఎస్కు మరో భూమిక తెలంగాణ మాడల్. ప్రస్తుతం డబు ల్ ఇంజిన్ అన్న మాట ఎక్కువగా వినిపిస్తున్నది. కానీ చాలాచోట్ల ట్రిపుల్ ఇంజిన్లూ ఉన్నాయి. కానీ వాటి ప్రగతి కనిపించడం లేదు. ఎందుకు? కీలకమైన ‘గ్రోత్ ఇంజిన్’ లోపించడం. గ్రోత్ ఇంజిన్ కేవలం ఆర్థికపరమైన భావన కాదు. సామాజికమైనది కూడా. తెలంగాణకు భాగ్యనగరం గ్రోత్ ఇంజిన్గా మారింది. కారణం.. మౌలిక సౌకర్యాల కల్పన ఒక్కటే కాదు. సామాజిక సమ్మిళితను ప్రోదిచేయడం కూడా. దేశంలోని భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని ఆహ్వానించింది. సామాజికశాంతిని నెలకొల్పింది. అందుకే మాన వ వనరులతో పాటు, పెట్టుబడులు కూడా ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. ఆయా వనరుల ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా గ్రోత్ ఇంజిన్లుగా మారనున్నాయి. ఉదాహరణ కు తెలంగాణ ఇప్పటికే విత్తనాల భాండాగారంగా మారింది. ప్రైవే టు పెట్టుబడులను ఆహ్వానించి, వాటికి రక్షణ కల్పించడమే గ్రోత్ ఇంజిన్ మాడల్లో కీలకాంశం. తెలంగాణ మాడల్లోని మరో అం శం అభివృద్ధి, సంక్షేమాల సమ్మిళితం. అంటే ఒకదాని ద్వారా మరొకటి లబ్ధి పొందేది.
ఉదాహరణకు ‘దళిత బంధు’. లబ్ధిదారులకు నేరుగా నగదు అందుతున్నది కాబట్టి అది సంక్షేమ పథకంగా కనిపిస్తుంది. కానీ ఆ సొమ్ముతో లబ్ధిదారు ఆటో ట్రాలీ కొనుక్కొని ఉపాధి పొందితే అది అభివృద్ధి పథకమే. ఒకదాని ద్వారా మరొకటి సాధ్యమైంది. ఈ మాడల్ దేశమంతా రావాలన్నది కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి ఆశయం.
అన్నింటికన్నా ముఖ్యమైనది కేసీఆర్ వ్యక్తిత్వం. ఆయన ప్రాక్టీసింగ్ హిందూ. దేవాలయాలు కట్టినా, పూజలు చేసినా ఎక్కడా వాటిని స్వప్రయోజనాలకో, రాజకీయ లబ్ధికో వాడుకోరు. హిందువునని ప్రత్యేకంగా చెప్పుకోరు. కానీ ధర్మశాస్ర్తాల ప్రకారం నడుచుకుంటారు. ఇతర మతాలవారినీ గౌరవిస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అభిమానం పొందడానికి ఇదీ ఒక కారణం. మొత్తమ్మీద బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా రాజకీయ మథనానికి దారితీసింది.
-గోసుల శ్రీనివాస్ యాదవ్ , 98498 16817