BRS | కేంద్రంలో అధికారం చేపట్టడమే ఏకైక ఎజెండాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని అత్యధిక కాలం పాటు పాలించిన ఈ రెండు పార్టీలు సామాజిక సమానత్వాన్ని సాధించలేకపోయాయి. ఫలితంగా దేశంలో ఇప్పటికీ సామాజిక, రాజకీయ వివక్ష కొనసాగుతూనే ఉంది. మరోవైపు దళితులపై రోజురోజుకు దాడులు పెరిగి సామాజిక భద్రత కరవైంది. అధికారం కోసం కొత్త కొత్త నినాదాలు ఇస్తున్న రెండు జాతీయ పార్టీల లక్ష్యం ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడమే.
అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేటికీ అవే అబద్ధాలు చెప్తూ కాలయాపన చేస్తున్నది. ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్క పరీక్ష నిర్వహించకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం విడ్డూరం. నియామకపత్రాలు ఇస్తూ గత ప్రభుత్వ ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని తాపత్రయ పడటం సిగ్గుచేటు.
కేసీఆర్, మోదీ ఒక్కటేనని పదేపదే ప్రచారం చేసే రేవంత్రెడ్డి.. మోదీని పెద్దన్నగా పేర్కొనడాన్ని బట్టి వారి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఏనాడూ తెలంగాణకు రూపాయి సాయం చేయని మోదీ సర్కార్.. రాష్ట్రంలో బలపడటానికే కాంగ్రెస్కు అంతర్గతంగా మద్దతు ఇస్తున్నదనే విషయం అందరికీ అర్థమవుతున్నది. నాడు రాహుల్గాంధీని బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలతో అవమానించినప్పుడు మొదటగా కేసీఆర్ ఖండించారు. కానీ, రాహుల్గాంధీని అవమానపరిచిన ఘటనను మరిచిన రేవంత్రెడ్డి.. నాడు బాసటగా నిలిచిన కేసీఆర్నే తిట్టడం విడ్డూరం.
రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తూ.. పార్టీలను చీలుస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. ఏక్నాథ్ షిండేలను తయారు చేస్తూ ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరిస్తున్నది. అటువంటి బీజేపీకి రేవంత్రెడ్డి వంత పాడటం దేనికి సంకేతం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన కూడా బీజేపీ పంచన చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే కనుక జరిగితే మరోసారి పరాయి పాలన కిందికి తెలంగాణ చేరినట్టే. ఆనాడు ఉమ్మడి పాలకులు మన వనరులను దోచుకున్నట్టే.. భవిష్యత్తులో గుజరాత్ వ్యాపారులు మన తెలంగాణను దోచుకోవడం ఖాయం. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేరికతో బీఆర్ఎస్కు దళితుల మద్దతు మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. తెలంగాణ హక్కులను కాపాడుకోవాలంటే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్కే ఓటు వేయాలి.
-సంపత్ గడ్డం
78933 03516