‘ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న’ అన్న సామెత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాలకు సరిగ్గా సరిపోతుంది. పదేండ్లుగా అధికారంలో లేని పార్టీ ప్రస్తుతం అధికార దాహంతో ఆవురావురని ఎదురుచూస్తున్నది. అమలుకానీ హామీలను చేసి చూపిస్తామని చెప్తున్నది.
ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామనేది ఒకటి. ఆధార్కార్డులతో పోల్చి చూసుకున్నపుడు 2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 1.89 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ రూ.2500 చొప్పున ప్రతినెలా ఇవ్వాలంటే ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతాయి? అందరికీ ఇస్తారా? లేదంటే కొంతమందికే ఇస్తారా? ఆ కొంతమందిలో ఎవరెవరు ఉంటారో తెలియదు. ఇది సాధ్యమయ్యేదేనా?
ఇక తెలంగాణలో సుమారు ఆరున్నర లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరందరికీ రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే మిగతా సొమ్ము ప్రభుత్వంపై పడుతుంది. నెలకు ఎన్ని వేల కోట్లు గ్యాస్ సిలిండర్ల మీద పెడతారు? అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు. రోజుకు ఒక కోటి మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం మంది మహిళలు అనుకుంటే ఉచిత ప్రయాణం వల్ల ప్రతిరోజూ ఎన్నికోట్లు ఆర్టీసీ వెచ్చించాల్సి ఉంటుంది? ఒక ఏడాది కాలానికి ఆర్టీసీకి ఎన్ని వేల కోట్ల నష్టం వస్తుందో నాయకులు లెక్కలు వేసుకుంటే మంచిది. ఈ నష్టం వల్ల ఆర్టీసీ భవిష్యత్తులో కోలుకుంటుందా?
రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు ఇస్తామంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఏటా రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నది. దీనికి అదనంగా మరొక రూ.5వేలు కలిపి రైతు భరోసా కింద ఇస్తారు. అంటే ఎన్ని వేలకోట్లు అవసరం పడుతాయి? ఇక కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో, ఎవరి పొలంలో ఎవరు పంట పండిస్తున్నారో ఆ రైతుకు మాత్రమే తెలుస్తుంది. కానీ, ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉండవు. ఎవరు వ్యవసాయ కూలీలో కూడా ప్రభుత్వ రికార్డుల్లో ఉండవు. అలాంటపుడు ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతాయో ఆ పార్టీ వారికే తెలియాలి. ప్రస్తుత ప్రభుత్వం 44 లక్షల మందికి ఇస్తున్న చేయూతకు అదనంగా మరొక రెండు వేలు కలిపితే పింఛను రెండురెట్లు పెరుగుతుంది. ఇందుకు ఎన్ని కోట్లు అవసరం?
ప్రజలకు కేవలం డబ్బులు పంచి అధికారంలోకి రావాలనుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి సాధ్యంగానీ హామీలు ఇచ్చేముందు వెనెజుల, శ్రీలంక, పాకిస్థాన్ దేశాల పరిస్థితిని గమనించాలి.
ఆ దేశాలు ప్రస్తుతం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక రొట్టె ముక్క కోసం ఇబ్బంది పడుతున్న దేశాల పరిస్థితి తెలంగాణకు రావద్దు. నాటి కాంగ్రెస్ పాలకుల చేతకానితనం వల్లనే తెలంగాణ నాశనం అయింది. వేలాది మంది బతుకుతెరువు కోసం వలసలు వెళ్లారు. నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి మళ్ళీ వస్తున్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి మురిసిపోతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ మళ్ళీ వెనక్కుపోవద్దు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి బృహత్తర ప్రాజెక్టులు కడతామని, ప్రతి ఊరికి బస్ కనెక్టివిటీ ఇస్తామని, ఒక పెద్ద పరిశ్రమను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పటం లేదు. దేశం గర్వపడేలా మహిళలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, విశ్వం గర్వపడేలా క్రీడల్లో రాణించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పటం లేదు. మనిషి కష్టపడి సంపాదించిన దానికి అదనంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది. వారి భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని చెప్పే పార్టీలకు ప్రజలు జేజేలు పలుకుతారు.
-కన్నోజు మనోహరాచారి
79950 89083