విశాలాంధ్ర పేరుతో తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణను ప్రాణం తీసిందే కాంగ్రెస్. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన 4 వేల మందిని భారతీయ సైన్యం పేరుతో చంపించింది కూడా కాంగ్రెస్. స్వరాష్ట్రం అడిగినందుకు 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది.
తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని పోరాడినందుకు మలి దశ ఉద్యమంలో 1200 మంది యువకుల ఆత్మహత్యలకు కారణమైంది కూడా కాంగ్రెస్ పార్టీనే. ప్రజల కోసం పోరాడుతున్న నక్సలైట్లను చర్చల పేరుతో అడవుల నుంచి బయటకు పిలిచి..వందల మందిని కాల్చి వేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే.
గారడీ మాటలు, పతరాలేని వ్యాఖ్యలతో ముందు కు వస్తున్న కాంగ్రెస్ 60 ఏండ్ల చరిత్ర ప్రజలకు తెలియనిది కాదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచే ప్రారంభమైన కాంగ్రెస్ ద్రోహం 2014 వరకు కొనసాగింది. తెలంగాణ ప్రజల వాస్తవ అభిప్రాయాలను గౌరవించకుండా నాటి నెహ్రూ ప్రభుత్వం తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో విలీనం చేయడం కాంగ్రెస్ తొలిద్రోహం. అంతటితో ఆగకుండా ఇక్కడ కొనసాగుతున్న సాయుధ రైతాంగ పోరాటంపై నెహ్రూ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సైనికచర్య పేరుతో వేలాదిమంది తెలంగాణ ఉద్యమకారులను సైన్యం ఊచకోత కోసింది. పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ ఒప్పందాలను కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. 1969లో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై ఉక్కుపాదాన్ని మోపింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇందిరమ్మరాజ్యం తెస్తామంటున్న నేటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు నాడు ఇందిరమ్మ చేసిన ద్రోహాన్ని ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోవాలి.
ఇక మలిదశ ఉద్యమంపై కాంగ్రెస్ ధోరణి అంతా మోసపూరితమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం కొనసాగుతుంటే..9 ఏండ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ..అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం 2004లో తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకొని అధికారాన్ని చేపట్టింది. తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో పెట్టిన కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఒక్కఅడుగు కూడా ముందుకు వేయలేదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణకు అన్యాయం చేసే నిర్ణయాలు తీసుకుంటుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం తమకు అధికారమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించారు. మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ ద్రోహం వల్ల 1200 మందికిపైగా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష, తెలంగాణవ్యాప్తంగా వచ్చిన ప్రజా ఉద్యమం ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించింది. తెలంగాణ ప్రకటన సమయంలో కూడా అనేక అడ్డంకులు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీనే.
ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రం తెచ్చిన పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వ పథకాలను రూపొందించడం..వాటిని అమలు చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేయడం ప్రారంభించిందో..అప్పుడే అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే.
తాజా ఎన్నికల నేపథ్యంలో 60 ఏండ్లలో సాధించలేనిది, ఇప్పుడు అధికారమిస్తే అందిస్తామని మాయచేస్తున్నది. పతరాలేని 6 గ్యారెంటీలను చెప్తూ..కర్ణాటక మాడల్ను రుద్దాలని చూస్తున్నది. కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు, నీటి కొరతలు, ముఖ్యమంత్రుల మార్పు తప్ప మరేం ఉండదు. అందుకే 60 ఏళ్ల మోసాలను యాది చేసుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయమిది. అభివృద్ధికి పట్టం కట్టాల్సిన సందర్భం ఇది!
బండారు జితేందర్
93912 94127