రాజకీయ మహామహుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రసిద్ధి. రెండు మూడు తరాల నుంచి రాజకీయాలే వీరికి పరమావధి. ఇలాంటి కుటుంబాలు ఇంతకుముందు జిల్లాకు ఒక్కటీ, రెండు ఉండేవి. ఉమ్మడి ఏపీలో ఈ తెలంగాణ కాంగ్రెస్ కుటుంబాలు అటు ఆంధ్ర, ముఖ్యంగా రాయలసీమ రాజకీయ కుటుంబాలతో మంచి సుహృద్భావ ఆర్థిక, రాజకీయ సంబంధాలు నెరిపేవారు. వారి బాంధవ్యం రాజకీయాలకే పరిమితం కాకుండా వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా కొనసాగింది. తెలంగాణ రావడంతో ఈ కుటుంబాల రాజకీయ ప్రాబల్యానికి అడ్డుతెర పడినట్టయింది. కొంతమందే నిలదొక్కుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు కాగలిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లా గెలుస్తారనే నమ్మకం ప్రజలకే కాదు, వీరికి కూడా లేదు.
తెలంగాణ ఉద్యమంలో భాగమై అత్యాశకు పోయి భంగపడిన కొంతమందిని బీజేపీలో చేర్చుకున్నది.రాజకీయ పరిజ్ఞానం, విలువల్లేని నాయకులను కేసీఆర్ మీదకు ఎగదోసింది. ఇదంతా చేస్తుంది సంఘ్ అంటే నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. తెలంగాణకు ఏమిస్తారో చెప్పలేని స్థితిలో బీజేపీ ఉన్నదంటే మత రాజకీయాలను మించి ఆలోచించలేని సంఘ్, వాళ్లను గైడ్ చేస్తున్నదని అర్థమవుతుంది.
ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ కాంగ్రెస్ నాయకులే కేసీఆర్పై, ఆయన ప్రభుత్వంపై ఏదో ఒకరకంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే ఒక కాంగ్రెస్ నాయకుడికి ‘ధరణి’ అంటే కడుపు మంట. కానీ, ధరణి కోసం రైతులు ఏండ్లతరబడి ఎదురుచూస్తున్నారు. అలాంటి దానిపై కడుపు మంట ఎందుకుంటుంది? ఎవరికైతే బినామీ భూములున్నాయో లేదా అసైన్డ్ భూములు కొన్నారో వాళ్ళకే ఇబ్బంది. అంతేకానీ 95 శాతం మంది రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2022 నాటికే రాష్ట్రంలో ధరణి ద్వారా దాదాపు 26 లక్షల లావాదేవీలు జరిగాయని రికార్డులు చెప్తున్నాయి.
‘ధరణి’ రావడంతో ఎంతోమంది రైతులకు మేలు జరిగింది. ఎప్పటినుంచో ఉన్న భూమి పత్రాలు ఇప్పుడు పక్కా రూపం దాల్చుకున్నాయి. ధరణి పాస్బుక్ రైతులకు భరోసా ఇచ్చింది. ధరణి రాకపోయుంటే వచ్చేతరం వాళ్లకు కూడా భూమి పత్రాలు పొందాలంటే పది మంది చుట్టూ వందల సార్లు తిరగాల్సి వచ్చేది. ఇలా 95 శాతం మంది రైతులు సంతోషంగా ఉంటే ఒక 5 శాతం మంది వివిధ కారణాల వల్ల ధరణితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే వీళ్ల సమస్యలు ధరణి వల్ల వచ్చినవి కాదు. అంతకుముందు నుంచీ ఉన్న సమస్యలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. తమ ప్రభుత్వం వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాబట్టి దీనిగురించి రైతులు, రైతు కుటుంబాలే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అసలు చెప్పాలంటే ‘డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్’ మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం హయాంలో ఇది ఊపందుకున్నది. 2008లో ‘డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నయిజేషన్ ప్రోగ్రామ్’ కేబినెట్ ఆమోదం పొందింది. రెండు కేంద్ర ప్రాయోజిత పథకాలైన భూ రికార్డుల కంప్యూటరైజేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ను బలోపేతం చేయడం, ల్యాండ్ రికార్డ్స్ నవీకరణలు విలీనం చేయబడ్డాయి. దేశంలోనే 95 శాతం భూ వివరాలు డిజిటైజ్ కాబడితే, ఇది తెలంగాణలో మరింత పక్కాగా, రైతులకు ఉపయోగపడేలా జరిగింది.
ఇంకో వింత విషయం ఏమంటే కాంగ్రెస్ నాయకులు లేవనెత్తే అంశాలు నాయకుడిని బట్టి మారుతుంటాయి. ఒకరు ధరణి గురించి మాట్లాడితే మరొకరు మరో అంశం గురించి మాట్లాడుతారు. వీళ్లకు స్పష్టత ఉండదు. తెలంగాణ కాంగ్రెస్కు ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆపద వస్తే ఆదుకొని ధైర్యం చెప్పే నాయకుడు కావాలి. వరంగల్, హైదరాబాద్ పట్టణాలకు వరదలు వచ్చినప్పుడు ప్రగతిభవన్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ అయి వరదలు తగ్గే వరకు నిరంతరంగా మానిటర్ చేశారన్న విషయం మన కు తెలుసు. అంతేకానీ, మనకు కావలిసింది బురద రాజకీయాలు చేసే నాయకులు కాదు.
ఇక బీజేపీ పరిస్థితి భిన్నంగా ఉన్నది. బీజేపీ అగ్ర నాయకత్వం ఎప్పుడు తెలంగాణకు అండగా నిలవలేదు. అద్వానీ నుంచి మోదీ దాకా అందరూ ఆంధ్రా నాయకుల మాటలు నమ్మేవాళ్లే. దీనికి కారణం కొందరు ఆంధ్ర బీజేపీ నాయకుల పలుకుబడి, సంఘ్లో ప్రబలంగా ఉన్న నాయకుల పలుకుబడి. సంఘ్పరివార్ వ్యక్తులు, అగ్రకులాలకు చెందినవారే. కుల రాజకీయాల్లో భాగంగా అగ్ర కుల సంఘ్ వ్యక్తులు కూడా తెలంగాణకు వ్యతిరేకులే. తెలంగాణ వచ్చిన తర్వాత సంఘ్ మత రాజకీయాలతో తెలంగాణలో పుంజుకుందామనుకున్నది.
కేసీఆర్ను లక్ష్యం చేస్తూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పెట్టింది. అయినా అదరకుండా, బెదరకుండా కేసీఆర్ అద్భుతమైన విజన్తో రైతులోకానికి కరెంట్, నీళ్లు, పెట్టుబడి సాయం అందించడంతో సంఘ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక వలె మారింది. అయితే బీజేపీ తన చేతిలో ఉన్న పని కూడా తెలంగాణకు చేయకపోవడం బాధాకరం.
నిజామాబాద్ నుంచి హైదరాబాద్ బస్సులో ప్రయాణిస్తుంటే బోయిన్పల్లి చెక్పోస్ట్ దాటిన తర్వాత ఎడమ వైపు ఆర్మీ వాళ్ళ కాంపౌండ్ స్టార్టవుతుంది. అక్కడ గుర్రాలను కట్టేసే షెడ్ను మా చిన్నపుడు చూసేవాళ్ళం. ఇప్పుడు షెడ్ ఉంది కానీ అందులో గుర్రాలు లేవు. చాలావరకు అక్కడ ఆర్మీ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. అట్లాగే శామీర్పేట్ వైపు వెళ్తుంటే కూడా. హైదరాబాద్కు అత్యంత దగ్గరగా అత్యంత ఇరుకు హైవేలు ఉన్నవి ఈ రెండు రూట్లు మాత్రమే. హైదరాబాద్ అన్నివైపులా హైవేలను కలుపుతూ రోడ్లు వెడల్పు చేశారు. కానీ ఆర్మీ సహాయ నిరాకరణ వల్ల తెలంగాణకు హైదరాబాద్తో ముఖ్యమైన రోడ్లు ఇంకా ఇరుకుగా, వాహనదారులకు ఇబ్బందిగా ఉన్నాయి. ఈ అంశం ప్రస్తావించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, బీజేపీ లేదా సంఘ్కు తెలంగాణ ప్రజల అభివృద్ధి కాంక్షిస్తే ఆర్మీ వాళ్లతో రోడ్ వెడల్పుకు అంగీకరింపజేసేవాళ్ళు. రెండవది అప్పటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరో, ఎందుకు రోడ్ వెడల్పునకు ఆర్మీ వాళ్ళ చేత ‘నో’ చెప్పించిందో అందరికి తెలిసిందే.
ఆంధ్ర, తెలంగాణల విషయాలకొస్తే బీజేపీ, సంఘ్ ఎప్పుడు ఆంధ్ర పక్షపాతి. బీజేపీకి నచ్చని పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ద్వారా సంఘ్ ఆంధ్రకు అండగా ఉంటుంది. వింతైన విషయం ఏమంటే బీజేపీలో ఎప్పుడూ ఆంధ్రా నాయకుల హవానే నడుస్తది. బీజేపీకి ఓట్లు, సీట్లు తెలంగాణలో వస్తే నాయకులు మాత్రం ఆంధ్రాలో ఉండేవాళ్లు. ఇక్కడి బీజేపీ లీడర్షిప్ను ఎదగనివ్వక పోవడానికి కారణం ఆంధ్రా నాయకులే. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని సమర్థ బీజేపీ నాయకులను దూరం పెట్టి ఆంధ్రా నాయకులకు అనుగుణంగా ఉన్నవాళ్లను ప్రోత్సహించారు. దాని ఫలితమే ఇప్పటి బీజేపీ నాయకత్వ లోపం. ఇక్కడ సంఘ్, బీజేపీ కుట్రలను తెలంగాణ బీజేపీ నాయకులు, ప్రజలు అర్థం చేసుకోవాలి. సంఘ్కు, బీజేపీకి కావలిసింది బలహీన నాయకులు. ఆలా అయితేనే వాళ్ళ ఆర్థిక, మత ప్రాజెక్టును అమలు చేసుకోగలుగుతారు. అయితే సంఘ్ కానీ, బీజేపీ కానీ అర్థం చేసుకోవాలిసిందేమంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు మూస ఓటింగ్కు దూరంగా ఉంటారు.
ప్రశ్నించే గుణం ప్రతి తెలంగాణ ఓటరులో ఉన్నది. ఎవరైతే కేసీఆర్కు ఓటు వేయవద్దని అడుగుతున్నారో వాళ్లను కూడా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మీ పార్టీ తెలంగాణకు ఏం చేసిందని? ఈ ప్రశ్నించే అలవాటు వల్లనే, తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది, టీఆర్ఎస్ రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కలిగింది.
దురదృష్టవశాత్తు, సంఘ్, బీజేపీ చేస్తున్న వికృ త రాజకీయ చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఉదాహరణకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహా రం. ఇంకా నీచమైన విషయం ఎలక్షన్లలో కాంగ్రెస్తో చీకటి ఒప్పందం. దీన్ని అన్ని ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గమనించారు. కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లడం, బీజేపీ ఓట్లు కాంగ్రెస్కు మళ్లడం. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనలేకే కాంగ్రెస్, బీజేపీలు దిగజారుడు రాజకీయాలు చేశాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను బట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నాయకులు, వారి ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు కాపాడుదామా లేక మన, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిద్దామా అన్నది మన చేతుల్లోనే ఉన్నది.
సిరారె