ఏదైనా జరగాలని బలంగా కోరుకుంటే అది జరిగి తీరుతుందంటారు! ‘తెలంగాణకు ప్రాణాధారమైన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కు ధారాదత్తం చేయాలి’ అని కాంగ్రెస్ పార్టీ ఏడు దశాబ్దాల కిందటనే బాగా బలంగా కోరుకుంది కాబోలు. సమయం ఎక్కువ తీసుకున్నా ఆ పార్టీ విజయవంతంగా ఆ ప్రక్రియను పూర్తి చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులకు గండి కొట్టింది. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ట్రిబ్యునళ్ల వద్ద పాలకుల తీరు… తెలంగాణపై నీటి వివక్షలను చూస్తే అన్యాయం కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. స్వరాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణకు న్యాయపరమైన వాటా దక్కి ఒడ్డున పడుతుందనే ఆశలు చిగురించాయి.
Krishna Water | కేంద్రం పుణ్యాన ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలింది. ఈలోగా ‘మార్పు’ అంటూ కొలువుదీరిన రేవంత్రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంకల్పాన్ని పరిపూర్ణం చేసింది. తెలంగాణ రాష్ర్టాన్ని ‘హస్త’గతం చేసుకున్న రెండు నెలల్లోపే కృష్ణార్పణం అంటూ కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లొదిలింది. నాగార్జునసాగర్ను పూర్తిగా కేంద్రానికి అప్పగించడంతో ‘భౌగోళికంగా’ తెలంగాణ గట్టున ఉన్నా… జలాలను తరలించుకుపోవడంలో ఆంధ్రప్రదేశ్ గట్టెక్కినట్లయింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు లేనప్పుడు సైతం గొలుసుకట్టు చెరువులతో కళకళలాడిన తెలంగాణ ప్రాంతం ఇప్పుడు అటు చెరువులు నిండే పరిస్థితిలేక… ఇటు నదీజలాలు రాక… రెంటికి చెడిన రేవడిలా తయారవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా ఒక వాదన చేయాలంటే అందుకు బలమైన ప్రాతిపదిక ఉండాలి. కృష్ణాజలాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఆది నుంచి అన్యాయం చేసిందనేందుకు గట్టి పునాదులే ఉన్నాయి. ‘కృష్ణా ప్రాజెక్టులను ఎవరు అప్పగించారు? ఎవరో రాసిన మినిట్స్ చూసి మాట్లాడితే ఎట్లా?’ అని రెండు రోజుల కిందట అసెంబ్లీ వేదికగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సెలవిచ్చారు. మంత్రి హోదాలో ఇలా మాట్లాడటం విడ్డూరంగానే ఉంది. ఎందుకంటే, మినిట్స్ జారీ చేసింది.. ఏపీ ప్రభుత్వమో, ప్రైవేటు సంస్థనో కాదు! సాక్షాత్తూ కేంద్ర జల్శక్తి శాఖ నుంచి అధికారికంగా విడుదలైన మినిట్స్ అవి. దాన్ని ‘మేం ఖాతరు చేయము’ అంటే కుదురుతుందా? నిన్నటి వరకు నాగార్జునసాగర్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో ఇలా మొండికేసినా కేంద్రం, ఏపీ ఏమీ చేయలేకపోయాయి. కానీ, ఇప్పుడు వాళ్లకు ఆ అవసరం లేదు. ఒక కాగితాన్ని తెలంగాణ ముఖాన కొట్టి, చేయాల్సిన కార్యాన్ని నిశ్చితంగా చక్కబెడతాయి. అటు సాగర్, ఇటు శ్రీశైలం రెండు ప్రాజెక్టులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇప్పుడు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి.
ప్రతి నీటి బొట్టుకు కేంద్రం ముందు మోకరిల్లడం, కృష్ణా నదినే ఏపీ మళ్లిస్తుంటే లేఖల మీద లేఖలు రాస్తూ గగ్గోలు పెట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. జల దోపిడీని అడ్డుకోవడం దేవుడెరుగు.. నియంత్రించేంత పట్టుగానీ, ఇతరుల జుట్టు గానీ మన చేతుల్లో లేకుండాపోయింది. పొరపాటో, తెలంగాణ గ్రహపాటో తెలియదు గానీ, తెలంగాణను నిలువునా ముంచే కొన్ని కీలకమైన ‘మార్పు’లు కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుంటాయి.. చరిత్రలో పదిలంగా నిలిచిపోతుంటాయి.కాంగ్రెస్-తెలంగాణ కెమిస్ట్రీ అలాంటిదేమో మరి!
తెలంగాణ ప్రయోజనాలకు మొదటి విఘాతం…
మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిలగాడు, కాస్త ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబంలోని పిల్లోడితో తిరుగుతుంటే… ‘ఎందుకురా! ఆ పిలగానెమ్మటి తిరుగుతవ్. వాళ్ల నాయన బాగా సంపాదించిండు. వాళ్లెట్ల తిరిగినా నడుస్తది! కానీ, మనకు నడవదు’.. అని తల్లిదండ్రులు మందలించడం గ్రామీణ వాతావరణంలో పెరిగిన మనందరం వినే ఉంటాం. కృష్ణాజలాల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ బంధం కూడా ఇలాంటిదే. స్వతంత్రంగా హైదరాబాద్ స్టేట్లో ఉండే తెలంగాణ ప్రాంతం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్తో కలిసిందో… అప్పటి నుంచి కడుపు కాలినోడిది పోరాటం! కడుపు నిండినోడికి చెలగాటం అన్నట్టుగా తయారైంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీల మధ్య బచావత్ ట్రిబ్యునల్ కృష్ణాజలాల పంపిణీ చేపట్టినప్పుడు ఒక దశలో స్కీం-ఏ, స్కీం-బీ అనే విధానాలను ముందుంచింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం స్కీం-ఏ అంటే.. ఎగువ రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర తమకు కేటాయించిన నికర జలాల్ని వాడుకున్న తర్వాత మిగిలిన జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి. నీళ్లు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా ఏపీ భరించాలే గానీ పేచీ పెడితే కుదరదు. ఆ రెండు రాష్ర్టాలకు కేటాయించిన నికర జలాల కంటే అదనంగా ఎంత భారీ మొత్తం వచ్చినా ఉమ్మడి ఏపీ వాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే హక్కు అనేది ఉండదు. స్కీం-బీ అంటే… కృష్ణా నదిలో ఏ సంవత్సరంలోనైనా నీళ్లు ఎక్కువైనా, లోటులో ఉన్నా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) పంచుకోవాలి. అంటే వర్షాభావ పరిస్థితుల్లోనూ మూడు రాష్ర్టాలు ఆ లోటును సమానంగా పంపిణీ చేసుకోవాలి. కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం స్కీం-ఏ వైపు మాత్రమే మొగ్గు చూపింది. అంటే మహారాష్ట్ర వాడుకోగా దిగువకు వచ్చే వరదను కర్ణాటక ఆల్మట్టిలో బంధిస్తుంది. 129.72 టీఎంసీల సామర్థ్యమున్న ఆ ప్రాజెక్టు నిండిన తర్వాత 37.69 టీఎంసీలతో దిగువన ఉన్న నారాయణపూర్ నిండితే గానీ జూరాల వైపు వరద రాదు. బచావత్ సమయంలోనే కాదు… బ్రిజేష్ ట్రిబ్యునల్ సమయంలోనూ ఉమ్మడి ఏపీ పాలకులు ఇదే రీతిన వ్యవహరించారు.
ఆల్మట్టి ఎత్తును 519.40 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకోవచ్చనే అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం 2009లో అప్పటి ఉమ్మడి సర్కారుకు ఒక లేఖ రాసింది. ఆల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకునేందుకు సహకరిస్తే… 50 టీఎంసీల నీటిని నిల్వ చేసి దిగువకు వదులుతామని ఆఫర్ ఇచ్చింది. వాస్తవంగా అందుకు అంగీకరించి ఉంటే వర్షాభావం నెలకొన్నప్పుడు కచ్చితంగా కర్ణాటక కిందకు 50 టీఎంసీలను కిందకు వదిలేది. ఈ మేరకు రెండు రాష్ర్టాలు బయట మాట్లాడుకోవచ్చని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వెసులుబాటు కూడా ఇచ్చిందని మినిట్స్లోనే నమోదైంది. కానీ, కర్ణాటక వదిలే 50 టీఎంసీల జలాలు.. దిగువన జూరాలకే ఎక్కువగా పరిమితం అవుతాయి. ముఖ్యంగా కృష్ణా డెల్టా దాకా వచ్చే పరిస్థితి ఉండదని అప్పటి పాలకులు దాన్ని తిరస్కరించారు.
మరి.. గట్టిగా వాదనలు వినిపించి ఎత్తు పెంపునైనా అడ్డుకున్నారంటే అదీ లేదు. దీంతో బ్రిజేష్ ట్రిబ్యునల్ కర్ణాటక రాష్ర్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం బ్రిజేష్ ట్రిబ్యునల్ అమలులో లేనందున ఆల్మట్టిలో 129.72 టీఎంసీల నిల్వకే కర్ణాటక పరిమితమైంది. ఒక్కసారి బ్రిజేష్ ట్రిబ్యునల్ అమల్లోకి వస్తే ఇంతకంటే అదనంగా వంద టీఎంసీలు అంటే 229 టీఎంసీల వరకు నిల్వ చేసుకుంటుంది. చాలా సంవత్సరాల పాటు శ్రీశైలం వరకే అరకొరగా వస్తున్న కృష్ణా జలాలు.. అదే జరిగితే చుక్క కూడా దిగువకు రావు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రయోజనాలకు ఎలా గండికొట్టారో దీని ద్వారా అర్థమవుతున్నది.
మరింత విఘాతం కలిగించిన వైఎస్…
కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎంతసేపూ సీమాంధ్ర కోణంలోనే సాగునీటి రంగాన్ని చూడటంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతూ వచ్చింది. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తెలంగాణ హక్కులపై రెండో అతిపెద్ద దెబ్బ పడింది. గతంలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలుగుగంగ పేరిట శ్రీశైలం నుంచి రాయలసీమకు కృష్ణాజలాల మళ్లింపును చేపడితే.. వైఎస్ రాజశేఖర్రెడ్డి దానిని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల డిశ్చార్జికి పెంచారు. ఈ క్రమంలో పెన్నా బేసిన్లో ఏకంగా 350 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా జలాశయాలు నిర్మించారు. అదే సమయంలో తెలంగాణకు పట్టుమని పది టీఎంసీల నీటి నిల్వలేని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను ఇచ్చారు. అయితే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు బ్రిజేష్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశాయి. దీంతో ట్రిబ్యునల్ వెంటనే స్పందించి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఆ సమయంలోనే వైఎస్ రాజశేఖర్రెడ్డి చేసిన చర్య తెలంగాణకు శరాఘాతంగా మారింది. జలయజ్ఞం కింద కృష్ణాపై చేపడుతున్న ప్రాజెక్టులకు నికర జలాలు అడగబోమని ట్రిబ్యునల్కు ఒప్పంద పత్రాన్ని ఇచ్చారు. అంటే ఆయా ప్రాజెక్టులు నికరజలాల హక్కులను కోల్పోయాయన్నమాట. ఎన్నికల సమయంలో ఉచిత కరెంట్ అంశం వచ్చినప్పుడు.. వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన ఉచిత కరెంటును కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకొని గొప్పగా ప్రచారం చేసుకున్న రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు మరి కృష్ణాజలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన వైఎస్ పాపాన్ని అదే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలి. కానీ, సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 4న నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాత్రం వైఎస్ తెలంగాణకు ద్రోహం చేశారని… దానికి మంత్రివర్గంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు వత్తాసు పలికారంటూ బుకాయించే ప్రయత్నం చేశారు.
నిజం నిప్పులాంటిది. ఎవరి చిత్తశుద్ధి ఎలాంటిదో తెలంగాణ ప్రజలకు తెలుసు. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో టీఆర్ఎస్ ఎంత పోరాడింది.. కాంగ్రెస్ తరఫున సొంత పార్టీపైనే యుద్ధం ప్రకటించిన పీజేఆర్కు అప్పుడు, ఇప్పుడు ఎంత మద్దతుగా నిలిచింది అనేందుకు తెలంగాణ సమాజమే సాక్ష్యం. అంతేకాదు, వైఎస్ బతికి ఉన్నంతకాలం మంత్రి పదవులను కాపాడుకునేందుకు వెంపర్లాడింది ఎవరు? తెలంగాణ నీళ్లను తరలించుకుపోయి కట్టుకున్న ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో హారతులు పట్టింది ఎవరు? అప్పుడు వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు? అనే కఠోర వాస్తవాల్ని సందర్భానుసారం వెసులుబాటు మేరకు సీఎం రేవంత్ మరిచిపోయినట్టు నటించినా… ప్రజలు గుర్తుంచుకుంటారని మాత్రం మరిచిపోవద్దు.
మేడిగడ్డకు మళ్లిస్తే చెరిగిపోయే పాపమా ఇది?
బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్ల ముందు వాదనలు జరుగుతున్న సమయంలో ఏ ఒక్క క్షణం… ఏ ఒక్క కాగితాన్ని తెలంగాణకు అనుకూలంగా ఇవ్వని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు… చివరకు అంతర్గత పంపిణీల్లోనూ వివక్షనే చూపించారు. సీఎం రేవంత్రెడ్డి తన ప్రెస్మీట్లో ‘తెలంగాణలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68 శాతం ఉంటే 299 టీఎంసీలా?’ అని ప్రశ్నించారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు అధికారాన్ని పంచుకొని అనుభవించి, నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో పక్కనే కూర్చున్న ఉత్తమ్కుమార్రెడ్డి వైపు తిరిగి ఈ ప్రశ్న సంధిస్తే బాగుండేది. పైగా ఏపీ-తెలంగాణ మధ్య తాత్కాలిక పంపిణీ (షేరింగ్) ఒప్పందం జరిగితే.. దానిని సీఎం హోదాలో ఉండి కేటాయింపులు (అలాట్మెంట్)గా అభివర్ణించడమంటే రేవంత్రెడ్డి తెలంగాణకు న్యాయం చేయాలనుకుంటున్నారా? లేదా ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణకు 299 టీఎంసీలు షేరింగ్ కాదు, కేటాయింపులేనని ప్రపంచానికి చాటిచెప్పి అన్యాయం చేయాలనుకుంటున్నారా? ఆయనకే తెలియాలి.
ఎందుకంటే, ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ రేప్పొద్దున బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఒక డాక్యుమెంట్గా ఉంచే ప్రమాదమూ లేకపోలేదు. అసలు విషయానికొస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో కృష్ణాజలాల పంపిణీలో రెండు పర్యాయాలు భారీ ఎత్తున తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా సీఎం రేవంత్రెడ్డి హయాంలో కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి ధారాదత్తం చేసి మూడో అతిపెద్ద విఘాతంతో పరిపూర్ణం చేసింది. ప్రాజెక్టులను అప్పగించలేదని మంత్రులు పదేపదే చెప్తున్నా… కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్తో పోరాడేందుకు కలిసి రావాలంటూ సీఎం రేవంత్రెడ్డి రెండు రోజుల కిందట అసెంబ్లీ వేదికగా కౌరవులు… పాండవుల కథ వినిపించారంటేనే పరిస్థితి చేజారిపోయినట్టు అర్థమవుతున్నది. అందుకే బీఆర్ఎస్ నల్లగొండలో పోరు శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవడంతో దానిని కొంతమేరకైనా పక్కదోవపట్టించే ప్రయత్నంలో భాగంగా మేడిగడ్డ వైపు దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడో విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. అదేమిటంటే, తొమ్మిదిన్నరేండ్ల పాటు ఏపీకి సాగు, తాగునీళ్లు వదలాలన్నా తాళం చెవి తెలంగాణ చేతిలోనే ఉన్నది. ఏపీ ఎన్ని లేఖలు రాసినా, కృష్ణా బోర్డు ఎంత ఒత్తిడి చేసినా.. కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే తప్ప సాగర్ కుడి కాల్వకు సైతం నీటి విడుదల జరగకపోయేది. ఇది కండ్ల ముందున్న చరిత్ర.
ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో సాగర్ ఎడమ కాల్వ ద్వారా నల్లగొండకు గుక్కెడు నీళ్లు కావాలన్నా.. ఏపీ అభ్యంతరం పెట్టకుండా, కృష్ణా బోర్డు అనుమతి ఇస్తే తప్ప గేట్లు తెరుచుకోవు. కండ్ల ముందున్న వాస్తవమిది. మరి కేసీఆర్ ప్రభుత్వమే కృష్ణా ప్రాజెక్టులను ధారాదత్తం చేసిందంటూ సీఎం రేవంత్రెడ్డి పదేపదే ఆరోపణలు చేసినా ఈ నిజాల ముందు అవి నిలబడతాయా?
నిందారోపణలు కాదు.. నష్ట నివారణ అవశ్యం…
ఒకవైపు కేంద్రం.. మరోవైపు ఏపీ.. కృష్ణా బోర్డు పరిధిని అధికారికం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 16న కేంద్ర జల్శక్తి శాఖ మరో సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింత కుదరదని అందులో స్పష్టంగా, అధికారికంగా మినిట్స్ నమోదు చేయించాలి. దాంతో పాటు ప్రధానంగా ఆపరేషన్ ప్రోటోకాల్ అనేది తెలంగాణ ఇవ్వబోదని చెప్పాలి. అదేవిధంగా ఎంత కష్టమైనా తిరిగి నాగార్జునసాగర్ను తెలంగాణ చేతుల్లోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చేతిలో శ్రీశైలం ఎలా ఉంటది? సాగర్ మా చేతుల్లో ఎందుకు లేదు? అనే వాదనతో కేంద్రం మెడలు వంచాలి. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాన్ని చేజార్చుకోకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే, కుడివైపున పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ద్వారా రోజుకు 12-13 టీఎంసీల నీటిని తరలించుకుపోయే అస్త్రశస్ర్తాలను ఆంధ్రప్రదేశ్ సిద్ధం చేసుకుంది. ఇటు ఎడమ గట్టున తెలంగాణకు చెందిన కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులన్నింటినీ అందుబాటులోకి తెచ్చి తోడుకున్నా రోజుకు గరిష్ఠంగా రెండు, రెండున్నర టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఎత్తిపోసుకునే పరిస్థితి లేదు. ఎత్తున ఉండటం తెలంగాణకు భౌగోళిక శాపంతో పాటు ఎస్ఎల్బీసీ వంటి టన్నెల్ నిర్మాణాలకు రాజీవ్ టైగర్ రిజర్వు ఫారెస్టు అవరోధంగా మారింది. అందుకే ఆంధ్రప్రదేశ్ను నియంత్రించడంతో పాటు కృష్ణాజలాల వినియోగాన్ని మనం పెంచుకోవాలంటే వరద వచ్చినప్పుడు ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రం ద్వారా నీటిని నాగార్జునసాగర్కు తరలించాలి.
గరిష్ఠస్థాయి కరెంటు ఉత్పత్తితో 45 వేల క్యూసెక్కులు దిగువకు వదిలే అవకాశం ఉన్నందున రోజుకు కనీసం నాలుగు టీఎంసీలనైనా సాగర్కు తీసుకుపోవచ్చు. దీని ద్వారా మనకు చౌకగా విద్యుత్తు లభించడమే కాకుండా.. ఎగువ నుంచి ఇన్ఫ్లోలు నాగార్జునసాగర్ వరకు రానిపక్షంలో మనం సాగర్కు తరలించిన జలాలు రక్షణగా ఉంటాయి. ముఖ్యంగా నిన్నటివరకు సాగర్ కుడి కాల్వ సైతం మన ఆధీనంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు కళ్లెం వేసినట్టు ఉండేది. కానీ, మున్ముందు కృష్ణాజలాల వినియోగంలో ఆ రాష్ట్రం మరింత దూకుడు ప్రదర్శించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఆ రాష్ట్ర చర్యలు సమంజసంగానే కనిపించవచ్చు. అందుకే తెలంగాణ ప్రయోజనాల కోణంలో మనం ఆ రాష్ర్టాన్ని కట్టడి చేయాలంటే కృష్ణాజలాల వినియోగాన్ని పెంచేందుకు మరిన్ని అడుగులు పడాల్సిన చారిత్రక అవసరం ఉంది. ఎందుకంటే అధికారానికి ఐదేండ్ల పరిమితి ఉండొచ్చు గానీ, ఆ సమయంలో వేసే అడుగులు భావితరాలను కాపాడతాయి.
గత తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, తుమ్మిళ్ల పథకాలతో పాలమూరు స్వరూపమే మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పుట్టినప్పటి నుంచి తమ ప్రాంతంలోని చెరువుల్లో నీళ్లు చూడని పాలమూరు బిడ్డలు గత తొమ్మిదిన్నరేండ్ల కాలంలో జలసిరిని కండ్లారా చూశారు. రివర్స్ వలసలతో పాలమూరును సస్యశ్యామలం చేశారు కేసీఆర్. కాంగ్రెస్, టీడీపీలు దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కూడా ఉమ్మడి ప్రాజెక్టులు మినహా తెలంగాణలోని కృష్ణా బేసిన్లో పట్టుమని 10 టీఎంసీల నీటి నిల్వను చేపట్టలేదు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దాదాపు 70 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమనేది తెలంగాణకు ఒక వరం.
సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మోదీ సర్కార్పై ఒత్తిడి పెంచడం వల్ల ఆలస్యంగానైనా కేంద్రం స్పందించి ట్రిబ్యునల్కు సిఫారసు చేసింది. దీంతో కచ్చితంగా తెలంగాణకు కృష్ణాజలాల్లో ఉమ్మడి రాష్ట్రంలోని జీవోల్లో కేటాయించిన దాని కంటే రెట్టింపు స్థాయిలో కేటాయింపులు జరుగుతాయనే ఆశ, ఆకాంక్ష అందరిలోనూ ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా చేసిన ప్రయత్నాలను రేవంత్రెడ్డి సర్కార్ కూడా కొనసాగించి విజయం సాధించాలనేది ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కోరుకుంటున్నదే. ఈ నేపథ్యంలో అంతకుముందుగానే జలాల వినియోగానికి మరిన్ని ప్రాజెక్టులను సిద్ధం చేసుకోవడం చాలా అవసరమని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు దీటుగా, ఆ రాష్ట్రం హక్కుకు మించి జలాలను వినియోగించుకోకుండా నియంత్రించాలంటే ‘జూరాల’ అస్ర్తాన్ని ప్రయోగించక తప్పదని పలువురు నిపుణులు చెప్తున్నారు. గతంలో రూపొందించిన జూరాల-పాకాల వంటి వరద కాల్వ.. లేదా ఇంకేదైనా.. నిపుణులతో ప్రభుత్వం మేధో మథనం చేసి భూమ్యాకర్షణ శక్తిని ఆధారంగా చేసుకొని కృష్ణాజలాలను తరలించేందుకు చర్యలు తీసుకుంటే భావితరాలకు శ్రీరామరక్షగా ఉంటుంది. దీంతో పాటు మరికొంత మంది నిపుణులు సూచిస్తున్నట్టుగా జూరాల వద్ద పవర్ పంప్డ్ స్టోరేజీ పథకం వంటివి చేపట్టాల్సిన అవసరముంది. అందుకే నిందారోపణలు మాని.. చేపట్టాల్సిన తక్షణ చర్యలపై రేవంత్ సర్కారు దృష్టిసారిస్తే నష్ట నివారణ సాధ్యమవుతుంది.
-గుండాల కృష్ణ
80966 77031