దశాబ్దాల పాటు ప్రాజెక్టులను నిర్మించే చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. 36 ఏండ్ల పాటు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును నిర్మిస్తే అది కూడా అసంపూర్తే. అట్లాగే 1984లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి ప్రాజెక్టును.. స్వరాష్ట్రం సిద్ధించాక 2014లో పనులు మొదలుపెట్టి.. 2017లో నిర్మాణం పూర్తి చేసుకున్నాం. భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంతే. వాటిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అసంపూర్తిగా వదిలేస్తే.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి, స్వరాష్ట్రంలో సాగు, తాగుజలాలు అందించింది కేసీఆర్ సర్కారే.
ఉమ్మడి పాలనలో జలయజ్ఞాన్ని ధన యజ్ఞం చేసి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు తలపెట్టి తట్టెడు మన్ను తీయకుండా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి నీళ్లు తీసుకుపోతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నారు ఆనాటి కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా, మంత్రి పదవుల కోసం పూలు చల్లి, కొబ్బరికాయలు కొట్టి, హారతులిచ్చి పేపర్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసి, అధిష్ఠానం మెప్పుపొందే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆనాడు కేంద్రంలో కూడా కాంగ్రెస్సే అధికారంలో ఉన్నదనే విషయం.
రాష్ట్రం సిద్ధించినంక కృష్ణా నదిపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై ప్రతి నీటిబొట్టుకు యుద్ధం చేసి.. సాగు, తాగుజలాల కొరత లేకుండా చేసింది కేసీఆర్ సర్కారే. అంతేకాదు ఆనాటి కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, ఆ హామీకి చట్టబద్ధత కల్పించలేదు. కానీ, ఆంధ్రా ప్రాంతంలో నిర్మించే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అంశానికి చట్టబద్ధత కల్పించి ఓ రకంగా తెలంగాణను వంచించింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పొరుగు రాష్ర్టాలలో నిర్మించే ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. అయినా కేసీఆర్ సర్కార్ వెనుకడుగు వేయలేదు. మోదీ సర్కార్ రూపాయి ఇవ్వకపోయినా పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను దాదాపు 80 శాతం పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ, తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులను నిలిపివేయడమే కాకుండా కేంద్రానికి అప్పజెప్పేందుకు అంగీకరించింది.
ఒక నాడు నీటి చుక్క కోసం కంట నీరు పెట్టిన ప్రాంతం.. ‘పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే నా పాలమూరులోన..’ అని ప్రసిద్ధ కవులు గొంతెత్తి పాడిన ప్రాంతం పాలమూరు. అట్లాంటి ప్రాంతంలో గత పదేండ్లు తాగు నీళ్ల రుచి చూడగలిగినం. ఒక పంట పండించేందుకు వర్షపు చుక్క కోసం ఆకాశం వైపు చూసిన చోట.. కేసీఆర్ పుణ్యమాని రెండు పంటలను సమృద్ధిగా పండించారు రైతన్నలు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత దుశ్చర్యల వల్ల మళ్లా ఆ పాత రోజులు తిరిగి వచ్చి కంటశోశనే మిగిలిస్తున్నది.
మేడిపల్లి వెంకటేశ్వర్రెడ్డి
96151 46666