‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ’ అనే సామెత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. రాహుల్గాంధీ చేస్తున్న జోడో యాత్ర కనీసం సొంత పార్టీ నేతలను ఐక్యం చేయకపోగా, ఇండియా కూటమిలో ఎడబాటును ఎగదోసింది. జారిపోతున్న పార్టీ జాతీయ నేతలు, వదిలిపోతున్న కూటమిలోని స్నేహితులు.. కాంగ్రెస్ భవితవ్యాన్ని కండ్లకు కట్టినట్టుగా చూపెడుతున్నారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కోసం పడరాని పాట్లు పడుతున్నా, హస్తం పార్టీకి ప్రతికూల ఫలితాలే ఎదురవుతున్నాయి. ఎజెండా లేని రాహుల్ గాంధీ పాదయాత్ర గాలిలో బాణంలా
మారి, తోపులాటలకు, తన్నులాటలకు వేదికగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల ముంగిట నిలబడ్డ ‘ఇండియా’ కూటమికి ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ అక్కరకురానిదిగానే కనిపిస్తున్నది. రాజకీయ పోరు యాత్రను విహారయాత్ర తీరున నిర్వహిస్తున్న రాహుల్గాంధీ దేశం మాట దేవుడెరుగు, హస్తం పార్టీ కార్యకర్తలకే విశ్వాసాన్ని ఇవ్వలేకపోతున్నారు. రాజకీయాల్లో ఉండాల్సిన వాస్తవిక దృక్పథం కొరవడి, సంస్థాగత నిర్మాణం బలహీనపడి, సైద్ధాంతిక కోణం వీడి కేవలం సరంజామా సమకూర్చే వారినే సన్నిహితులుగా చేసుకొని ఎన్నికల సమరానికి కాంగ్రెస్ కాలుదువ్వడం విడ్డూరమే కదా!. జనామోద సాధనా విద్యలో కాకలుదీరిన యోధులు, సుదీర్ఘ అనుభవం, మేధోసంపద, దేశం నలుమూలలపై లోతైన అవగాహన కలిగిన సీనియర్ నాయకుల ఉనికి నేడు పది జనపథ్లో నామమాత్రంగా మారింది. వారియర్లపై కాకుండా వార్ రూంలపై ఆధారపడి హస్తం పార్టీ ఓట్ల వేటకు పావులు కదుపుతున్నది.
అందువల్లే బీజేపీని నిలువరించే జనామోద ఎజెండాను కూడా కనీసం చర్చగా మలచడంలో చతికిలపడుతున్నది. బీజేపీ సర్కార్ వైఫల్యాలపై ప్రభావవంతమైన ఏ ప్రజాస్వామిక పోరుకూ కాంగ్రెస్ నాయకత్వం వహించి కదిలించలేకపోయింది. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడి, పార్లమెంట్ ఎన్నికలకు ఏడాది ముందు గడబిడ తప్ప, నిర్దిష్టమైన పని తీరు హస్తం పార్టీలో కాగడా పెట్టి వెతికినా కానరాదు. రైతు పోరైనా, ఈశాన్య రాష్ర్టాల రోదనైనా ఉడికిన తర్వాత తిరగవాత గంటెను పట్టుకొని ఫోజులివ్వడమేగానీ ఏ పోరు నూ నడిపిందేలేదు. అందుకే అక్కరకురాని ఆరోవేలులా మారిపోయి, ప్రాంతీయ పార్టీల భుజాలపై హస్తం వేసుకొని యాత్రాయనం కొనసాగిస్తున్నది. నితీష్ వదిలించుకున్నా, దీదీ దుమ్మెత్తి పోస్తున్నా, స్టాలిన్ వెనకాముందాడుతున్నా కారణం బలహీన కాంగ్రెస్తో కూడి బీజేపీతో తలపడితే, ప్రమాదకర ఫలితాలు ఖాయమనే కదా?
మొదటి దశ జోడో యాత్ర హైవే పొడుగునా అర్థం లేని ప్రయాసగా మారి, ప్రజారాశుల మనోఫలకంపై ఏ ముద్ర వేయకుండానే ముగిసింది. చెరువంతా వలేసి రెండే పర్కలు పట్టినట్లు, డీకే శివకుమార్, రేవంత్రెడ్డి లాంటి ఇద్దరు దుడ్డు కర్రలు తప్ప ఢిల్లీ జనపథ్కు దొరికిందేం లేదు. రెండో దశ జోడో యాత్రకు కూడా న్యాయ్ యాత్ర అనే పేరు పెట్టి ఉత్తరాదిన ఎడారిలో ఇసుక వ్యాపారిలా ఎన్ని అవస్థలు పడ్డా కాంగ్రెస్ పార్టీని నమ్మేవారెవరు? వృద్ధి నమూనాలకు వక్రదృష్టిని కల్పించి, అంతరాలను పెంచి, జాతి జనులను వైరుధ్యాలకు వేలాడదీసిందే కాంగ్రెస్ సర్కార్లు. ప్రతి ఊరిలో లోహియా, కర్పూరీ ఠాకూర్, అంబేద్కర్ వంటి ఆలోచనపరులుండే రాష్ర్టాలలో, నేరగాడే మళ్లీ బేరమాడేందుకు వచ్చినట్టుగా సామాజిక న్యాయం సూక్తులు వల్లిస్తే ఉత్తరాధీయులు వలలో పడిపోతారా? ప్రభుత్వ విభాగాల్లో, న్యాయ వ్యవస్థలో బీసీలకు భాగస్వామ్యం నేటికీ ఎండమావిగానే ఉండటానికి కారణమే కాంగ్రెస్ కదా? పెరియార్ పోరు సలిపితేనే గాని మొదటి రాజ్యాంగ సవరణకు నాటి హస్తం పెద్దలకు చేతులే రాలేదు.
అంబేద్కర్ నిలదీస్తేనే గాని తొలి బీసీ కమిషన్ వేయాలనిపించలేదు. 1952లో మొదటి బీసీ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత, పార్లమెంట్ సెంట్రల్ హాల్కు కాకా సాహెబ్ కాలేల్కర్ను పిలిచి, మందలించి, ఆయనతో డిసెంట్ నోట్ రాయించి, తొలినాళ్లలోనే బడుగుల బతుకుల్లో బండరాళ్లేసింది హస్తం పార్టీ పెద్ద మనుషులే కదా! 1952 నుంచి 1993 దాకా మండల్ కమిషన్ సిఫారసులకే కాదు బీసీల ఎదుగుదలకూ, బీజేపీతో కలిసి అడుగడుగునా అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీనే.
1980లో మండల్ నివేదిక సమర్పిస్తే 1993 దాకా దశాబ్దానికి పైగా మెజారిటీ ప్రజల హక్కులను చెత్త బుట్టపాలు చేసిందెవరు? ఇండిపెండెంట్ ఇండియాలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు పాక్షికంగానైనా అవకాశాలు దక్కకుండా, దగా చేసి అమానవీయ అంతరాల వ్యవస్థలను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. న్యాయ్ యాత్రలో రాహుల్ మాట్లాడుతున్నవి నిజాలే కానీ, అవి గోముఖ వ్యాఘ్రమైన హస్తం పార్టీ వారసులు వల్లిస్తే, అపహాస్యం పాలవుతారేగానీ ఆకట్టుకోజాలరు. కేంద్ర సర్కార్ కొలువుల్లో, ఏ క్యాటగిరీ ఉన్నత ఉద్యోగాల్లో బీసీలు కేవలం 6.9 శాతం, బీ క్యాటగిరీ ఉద్యోగాల్లో 7.3 శాతం, చివరికి సీ క్యాటగిరీ కొలువుల్లోనూ 15.3 శాతమే. కార్యనిర్వాహక వ్యవస్థలోనే ఇలా ఉంటే న్యాయవ్యవస్థలో అయితే తక్కెడ తూకానికీ పెట్టలేని బలహీన స్థితిలోకి బీసీలను నెట్టేశారు. అంతెందుకు మండల్ కమిషన్ సిఫారసులపై పార్లమెంటులో జరిగిన చర్చలో రాజీవ్గాంధీ గుడ్డిగా వ్యతిరేకించిన వాస్తవం అందరికీ తెలిసిందే. అయితే ఆ మండల్ నివేదిక రూపకల్పనకు సహకరించినందుకు రాజీవ్గాంధీ కోపం పెంచుకొని, నెలలపాటు తనతో మాట్లాడలేదని దివంగత మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ ‘అదొక్కటే ముగింపు’ అనే తన ఆత్మకథలో రాసుకున్నారు. అన్యాయమైన వ్యవస్థను కాంగ్రెస్సే వనంలా పెంచి, తీరా నేడు గట్టెంబడి నడుస్తూ గగ్గోలు పెడితే, బడుగులు నవ్వుకుంటారేగానీ నమ్ముతారా రాహులా?
నిండు సభలో ఫ్లయింగ్ కిస్లూ, కౌగిలింతలతో అభాసుపాలైనట్టే, పార్లమెంట్ వెలుపలా వివేకం లేని పరంధామయ్య ఖాళీ చేతులతో వరికోతలకు దిగినట్టుగా రాహుల్గాంధీ రాజకీయాల్లో అవస్థలు పడుతున్నారు. దేశానికి ప్రత్యామ్నాయ పాలనా ఎజెండాను వివరించకుండా, నిర్దిష్టమైన రాజకీయ నయా దృక్పథం రూపొందించుకోకుండా, గాలిపటం ఎగరేసినట్టుగా హస్తం పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు. దాదాపు 15 లక్షల కేంద్ర సర్కారు కొలువులు భర్తీ చేయకున్నా, రూపాయి పతనమైనా, ద్రవ్యోల్బణం తరిమినా, ప్రభుత్వరంగ సంస్థలు అమ్మినా, జీఎస్టీతో జనం గుల్లయినా హస్తం పిడికిలి బిగించిందే లేదు. పోరాడే స్వభావం వదిలి, నడకను, నటనను నమ్ముకొని అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ భావిస్తుండటం విడ్డూరం. ఈ విచిత్ర కార్యాచరణతోనే హస్తం పార్టీ ప్రజలకు దూరంగా, చివరికి హస్తినలోనూ లోకువైపోయింది. ఉత్తర, దక్షిణ భారతదేశమంతా తిరిగి ఎంత ఎగిరెగిరి దంచినా గిట్టుబాటు కావడం మాత్రం కాంగ్రెస్కు అసాధ్యం. సంస్థాగత నిర్మాణం, భావోద్వేగ ఎజెండా, నిత్య కార్యాచరణ కలిగిన కమలం పార్టీని ఎన్నికల కురుక్షేత్రంలో ఎదిరించే సామర్థ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏనాడో కోల్పోయింది. పైగా వయోభారం, ఆరోగ్య సమస్యల వల్ల సోనియా గాంధీ నాయకత్వమే కాదు, ఖర్గే లాంటి సీనియర్లు కూడా లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం అసాధ్యం. ఇలా ఏ కోణంలో చూసినా ఇప్పుడు దేశంలోని బడుగులకైనా, దేశ భక్తులకైనా రాజకీయ శక్తులు ప్రాంతీయ పార్టీలు మాత్రమే.
రాజకీయాల్లో నిన్న కలిసొచ్చినట్టు నేడు కూడా కలిసివస్తుందనే లెక్కలు సరికానే కావు. అసెంబ్లీ ఎన్నికల్లో రాబట్టుకున్న ఫలితాలనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సాధించగలమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలగంటే అవివేకమే అవుతుంది. ఇప్పటికే ఎన్నికల తర్వాత అరవై రోజుల్లోనే హస్తం పార్టీ అసలు నైజం తెలంగాణ మొత్తం బట్టబయలైపోయింది.
రైతుబంధు రాక, బీమాకు దిక్కేలేక, సాగు నీటి కటకటకు పంటలెండి పల్లెలు పరేషాన్లో పడ్డయి. వస్తూ, పోతూ ఆటాడుతున్న కరెంటు కష్టాలు షురూ అయ్యాయి. గ్యారెంటీలు అందక, కేసీఆర్ పథకాలు పొందక ప్రజాచర్చలో ‘కొత్తది’ ఉత్తదేననే భావన గొల్లుమంటున్నది. అన్న మీద కోపం అమ్మ మీద చూపి, ఖాళీ తల్లెలో కన్నీళ్లు నింపుకున్నట్టుగా అందరికీ అనిపించబట్టె. ఇంత తొందరగా జనంలో భిన్నాభిప్రాయాన్ని మూటగట్టుకున్న సర్కార్ బహుశా కాంగ్రెస్ పార్టీదేనేమో! రైతుబంధు రాలేదంటే చెప్పు దెబ్బలు తింటరని రైతులను మంత్రులే బెదిరిస్తుంటే, ప్రశ్నించిన జర్నలిస్టుల ప్రాణమే తియ్యజూస్తుంటే, నోటితో పలికి నొసటితో వెక్కిరించినట్టు పదవులు ఒకే వర్గానికి వరమిస్తుంటే, దేశ్ముఖ్ల పాలన మళ్లీ వచ్చిందని ప్రజలు దిగులు చెందుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ‘అంబారెక్కిన మరుగుజ్జు నా అంత ఎత్తెవడున్నడని ఎగిరిపడ్డట్టుగా’ ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఒకేలా ఉండదని అనేక ఎన్నికల్లో వెల్లడైంది. రేపు లోక్సభ ఎన్నికల్లో సైతం తెలంగాణ విలక్షణ తీర్పును ఇవ్వడం ఖాయం.
దగాపడ్డ దండులా రగులుతున్న రాష్ట్ర జనం హస్తం పార్టీకి గుణపాఠం చెప్పితీరుతారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాజెక్టులను కేంద్ర సర్కార్ పర్యవేక్షణకు ఒప్పుకొన్న వాస్తవం తెలిశాక ప్రజలు మరింత స్పష్టంగా రాజకీయ నిర్ణయానికి వచ్చేశారు. జాతీయ స్థాయిలో కూడా.. ఎదగలేని కాంగ్రెస్ను నమ్మితే, ఎదుగూబొదుగే కాదు ఏదీ మనదిగా ఉండనివ్వరనే సత్యం అర్థమైంది. ఎదగని కాంగ్రెస్, ఎదపై ఎత్తుకోలేని బీజేపీ పార్టీలకంటే, అడుగడుగునా రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరు చేసే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. నిన్నంతా నడిపించిన గులాబీ జెండానే, రేపు కూడా తెలంగాణకు కాపలాగా నిలుస్తుందనేదే నిజం. దేశంలోని ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రబలశక్తిగా మారబోతున్నాయి. భూమిపుత్రుల రాజకీయ శక్తులే దేశ పాలనావ్యవస్థను శాసించనున్నాయి. జరగబోయే ఆ చారిత్రక పరిణామంలో తెలంగాణ పార్టీ కూడా శాసించే శక్తిగా వెలగాలన్నదే జనం ఆకాంక్ష.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242