ఎద్దేడ్శిన ఎవుసం.. రైతేడ్శిన రాజ్యం బాగుపడదని పెద్దలు అంటుంటారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఈ సామెతను నిజం చేసి చూపించాయి. స్వతంత్ర భారత్లో అత్యధిక కాలం పాటు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎవుసాన్నిఆగం చేసిన ఆ పార్టీ.. అది సరిపోదన్నట్టు మరోసారి తెలంగాణను ఎండబెట్టేందుకు కంకణం కట్టుకున్నది. దశాబ్దాల పాటు రైతులను గోస పెట్టిన హస్తం పార్టీ మరోసారి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలంగాణలో కరువు, కాటకాలను కోరి తీసుకొచ్చింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీ కర్షకులపై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తుండటం బాధాకరం.
జలాలను పొలాలకు మలిపితే సిరులు పండుతాయనే విషయాన్ని మరిచిన కాంగ్రెస్ సర్కార్ రైతులను కష్టాలపాలు చేసింది. నీళ్లివ్వలేమని చేతులెత్తేసింది. పంటపొలాలు తడవాలంటే రైతన్నలు ఆకాశం వైపు చూసే దుస్థితిని తీసుకొచ్చింది. నాడు ఉమ్మడి ఏపీలో తెలంగాణ రైతులు ఎలా గోస పడ్డారో.. సరిగ్గా నేడు కూడా అలాంటి పరిస్థితే దాపురించింది. నాటి మన రైతుల గోసను చూడలేక ఎందరో కవులు గళమెత్తారు. ‘నిలిచి కురిసే వాన లేక నిండి పారే చెరువులు ఎండే’ లాంటి పాటలు అప్పటి పరిస్థితులను కండ్లకు కట్టేవి. వాన పడితే నీరు నిలవలేని దుస్థితి అప్పటిది. వాన పడ్డా నీటిని నిల్వ చేసుకునేందుకు చెరువులు లేని పరిస్థితి. ప్రాజెక్టుల నిర్మాణం పేరిట అప్పటి కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేసిందే తప్ప తట్టెడు మట్టి ఎత్తింది లేదు. పంటచేల కాడికి నీళ్లను చేర్చింది లేదు. ఏండ్ల తరబడి ఎవుసానికి నోచుకోని పొలాలు బీడుగా మారేవి. దీంతో పంటచేలు అనే పదాన్నే రైతన్న మర్చిపోయే దుస్థితి ఏర్పడింది.
ఎంతో కష్టపడి కాస్తోకూస్తో సాగు చేస్తే నకిలీ విత్తనాల బెడద తప్పేది కాదు. ఎరువుల కోసం ఎర్రటి ఎండలో నిలబడలేక చెప్పులు లైనులో పెట్టి ఎదురుచూడాల్సి వచ్చేది. ఆడనో ఈడనో పడిగాపులు గాసి ఎరువులు దొరకబడితే.. పురుగుల కంటే ముందే కల్తీ ఎరువులు, పురుగుమందులు పంటను మింగేసేవి. ఆరుగాలం శ్రమించినా పంట చేతికందని రైతన్నకు పొలం గెట్టున ఉండే మర్రిచెట్టే యమపాశమయ్యేది. దాని ఊడలే ఉరితాళ్లుగా మారి రైతన్న ఉసురు తీసేది.
అంతటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడ్డ అన్నదాతలు స్వరాష్ట్రంలో పదేండ్ల పాటు కాలు మీద కాలేసుకొని సక్కనైన తెలంగాణను సాగు చేశారు. తమ బతుకులను బాగు చేసుకున్నారు. ఎవరి కన్ను పడిందో తెలియదు కానీ, కాంగ్రెస్ పాలనలో నాలుగు నెలల్లోనే తెర్లయ్యింది. సాగుకు నీళ్లియ్యక, కరెంటు ఇయ్యక, పెట్టుబడి సాయం ఇయ్యక, పంటకు మద్దతు ధర ఇయ్యక, రైతన్న బతుకుకు భరోసా ఇయ్యక కాంగ్రెస్ సర్కార్ రైతాంగం ఉసురు తీస్తున్నది. కాంగ్రెస్ చెప్పినట్టే.. మల్ల ఆనాటి రోజులు గుర్తుకు రావట్టె.
ఇక బీజేపీ సంగతి సరేసరి. 2014 ఎన్నికల్లో ఎట్లయినా విజయం సాధించాలనుకున్న బీజేపీ.. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని నమ్మబలికి రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని గప్పాలు కొట్టిన మోదీ.. అందుకు విరుద్ధంగా తన మిత్రుడు అదానీ ఆదాయాన్ని పెంచేందుకు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చారు. అవి తమ మెడకు ఉరితాళ్లుగా మారుతాయని, వాటిని రద్దు చేయాలంటూ అన్నదాతలు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఆనాడు రైతన్నలకు దన్నుగా కాదు, కదా కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు కాంగ్రెస్. ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతాంగానికి మద్దతు తెలిపింది కేసీఆర్ ఒక్కరే.
కష్టనష్టాలకోర్చి సాగు చేస్తున్న కర్షకులను ఆదుకోవాల్సింది పోయి బాయికాడ మోటర్లకు మీటర్ల పేరిట రైతన్నల ఉసురు తీయాలని చూసింది బీజేపీ సర్కార్. ఎవుసంలో కొత్త ఒరవడిని సృష్టించి రికార్డు స్థాయిలో తెలంగాణ రైతులు ధాన్యం పండిస్తే.. వాటిని సేకరించాల్సింది పోయి నూకలు తినాలంటూ అవహేళన చేశారు కేంద్ర పాలకులు. వ్యవసాయం పట్ల ఈ రెండు జాతీయ పార్టీల విధానం ఒక్కటే. అరిగోస పెట్టి రైతన్నల ప్రాణాలు తీయడమే.
తెలంగాణ పునర్నిర్మాణ ఆశయమే రైతును రాజును చేయడం. ‘కంపతారు చెట్లు కొట్టి అమ్ముకునే కాలమొచ్చెరా సేతానమేడుందిరా తెలగాణ సేలన్ని బీడాయెరా’ అని పాడుకునే కాడి నుంచి ధాన్యపు రాశులను పండించే స్థాయికి తెలంగాణను చేర్చింది కేసీఆర్ సర్కారే. భూముల విలువ పెంచింది కేసీఆర్ ప్రభుత్వమే. నీళ్లకు నడక నేర్పితే సిరులు పండుతాయని నిరూపించింది కేసీఆరే. నీళ్లను నిల్వ ఉంచాలనే తలంపుతో ఆనాటి కాకతీయ రాజుల ఆలోచనను ఆదర్శంగా తీసుకున్న కేసీఆర్.. మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, పునర్నిర్మాణం చేశారు. కొత్త ప్రాజెక్టులను నిర్మించి, అసంపూర్తిగా ఉన్నవాటిని పూర్తి చేసి తెలంగాణకు జలాభిషేకం చేశారు. ఆయన కృషి వల్లనే ‘వాగు ఎండిపోయెరా పెదవాగు ఎండిపోయెరా కడుపుల పేగు ఎండిపోయెరా’ అని పాడుకునే కాన్నుంచి.. ‘వాగు నిండి పోయెరా పెదవాగు నిండిపోయెరా కడుపు సల్లగా ఉండిపోయెరా’ అని పాడుకునే కాడికి వచ్చినం.
నీళ్లు నిలిస్తే సరిపోదు, ఆ నీళ్ల సరఫరాకు నిరంతర విద్యుత్తు ఉండాలని 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇచ్చారు. నీళ్లు, కరెంట్ ఇస్తే సరిపోదని భావించి.. రైతన్న ఓ అయ్యకాడికో, షావుకారి కాడికో పోకూడదని దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ఇచ్చారు కేసీఆర్. ప్రమాదవశాత్తు మరణించే రైతుల కుటుంబాలకు రైతుబీమాతో భరోసా ఇచ్చారు. సాగుకు నీళ్లిచ్చి, పెట్టుబడి సాయమిచ్చి, కరెంటిచ్చి, సకాలానికి ఎరువులు ఇచ్చి, నీటి తీరువా రద్దు చేసి.. దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు.
పొరపాటునో, గ్రహపాటునో ఆ పాత రోజులు మళ్లీ వచ్చాయి. ఉమ్మడి పాలన నాటి నిర్లక్ష్యపు జాడలు దాపురించాయి. విధ్వంసం మొదలైంది. గత తొమ్మిదిన్నరేండ్లలో సృష్టించిన సంపద కొంతైనా సురక్షితంగా ఉండాలంటే ప్రశ్నించే గొంతుక మనదే అయి ఉండాలే. తెలంగాణను కడుపులో పెట్టుకొని చూసుకునేది కేసీఆరే. పెద్దలు చెప్పినట్టు ఎట్టికైనా, మట్టికైనా మనోడు ఉండాలే. ఇక్కడైనా, ఢిల్లీ అయినా మనోడే మన కోసం మాట్లాడుతడు, పోట్లాడుతడు. తెలంగాణ మాట పార్లమెంట్లో వినిపించాలంటే మనోడు ఉండాలే. మన గొంతు ఉండాలే. అది కేసీఆర్ గొంతు అయి ఉండాలే.
-మేడిపల్లి వెంకటేశ్వర్రెడ్డి
96151 46666