కాంగ్రెస్కు తెలంగాణ ఏర్పడిన పదేండ్ల తర్వాత మొదటిసారి అధికారం లభించింది. అటువంటప్పుడు జనరంజకంగా పాలించి తమ హామీలను నెరవేర్చుతూ మరింత ప్రజాదరణ పొందాలి. మొదటి అసెంబ్లీ సమావేశాలను, తొలి బడ్జెట్ ప్రతిపాదనలను అందుకు సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలని తాము భావించేవి ఆ క్రమంలో ముందుకు తేవచ్చు. కానీ తమ పరిపాలన ఇంకా కుదుటపడకుండానే, ప్రజలకు ఇంకా సానుకూల అభిప్రాయం ఏర్పడక ముందే, బీఆర్ఎస్పై ఎన్నికల రోజుల్లో వలె దాడిని కొనసాగించడమే ప్రధానమైన అజెండా అన్నట్లు వ్యవహరించడం చూసేవారికి విచిత్రంగా తోచటమేగాక, చివరకు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టింది.
Telangana | తమను ఎన్నుకున్న ప్రజలకు చెప్పేందుకు, చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ రెండవవారం నుంచి ఈ రెండున్నర మాసాల్లో కొన్ని అవకాశాలు లభించాయి. ఇంతలోనే ఏదేదో జరిగిపోవాలని ప్రజలేమీ ఆశించడం లేదు. అది సాధ్యం కాదు కూడా. కానీ తొలి లక్షణాలు అంటూ కొన్ని ఉంటాయి. ప్రజలు ఎన్నో ఆశలతో అధికారాన్ని అప్పగించినందున ఎన్నెన్నో ఆశాభావాలతో ప్రతి అడుగును గమనిస్తుంటా రు. తాము ప్రజల కోసం చేయగలదేమిటో, అది గత ప్రభుత్వం కన్నా ఏ విధంగా మెరుగైనదో చెప్పేందుకు, ఆచరణలో చేసేందుకు ఈ తొలిదశలో కొత్త ప్రభుత్వానికి కొన్ని అవకాశాలు లభించాయి. అవి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం, కొత్త బడ్జెట్లో చేసే ప్రతిపాదనలు, 100 రోజుల గడువులోగా అమలుకు తేగలమన్న హామీలను వీలైనంత చేసి చూపించటం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి ఈలోగా ఏవైనా పరిస్థితులు అత్యవసరంగా ముందుకు వస్తే ఆ విషయంలో తగినట్లు వ్యవహరించడం, ఇతర సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించుకోవడం వంటివి.
ప్రభుత్వం ఏర్పడి కొన్నాళ్లు గడిచి అంతా షరా మామూలుగా మారిపోతే అది వేరు. అప్పుడైనా ప్రజల చైతన్యం ఈ సరికి ఎంతగా పెరిగింది, సోషల్ మీడియా ప్రభావం ఎట్లా తయారయింది అంటే అధికారంలోని వారికి విశ్రాంతి అంటూ లేని కాలం వచ్చింది. అందువల్ల ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తొలిదశలోనైనా, అది కూడా మీరు గత ప్రభుత్వంపై వెయ్యిన్నొక్క విమర్శలు చేసి కుప్పతెప్పలుగా హామీలు ఇచ్చినప్పుడు, ప్రభుత్వపు మాటలను చేతలను మూడు కోట్ల మంది ప్రజలు ఆరుకోట్ల కండ్లతో నిరంతరం గమనిస్తుంటారు. ఈ మాట ప్రభుత్వ పెద్దలు గ్రహించలేనిది కాదు. అటువంటప్పుడు ఈ రెండున్నర నెలల కాలంలో వారి వ్యవహరణ అందుకు తగినట్లు ఉందా అనేది ప్రశ్న.
ఈ రోజులలో ప్రభుత్వం కొన్ని చిన్నచిన్న పనులు చేయలేదని కాదు. కానీ సమస్య ఏమంటే అదంతా ప్రతిపక్షంపై ఎడతెగని నిరంతర విమర్శలు, ఆరోపణలు, ఆత్మరక్షణ ప్రయాసల హోరులో కొట్టుకుపోయింది. ఫలితంగా ఈ రోజున ప్రజల నుంచి వినవస్తున్న మాట, ఏమున్నది, ఏం చేస్తున్నారు? ఒకళ్లను ఒకళ్లు తిట్టుకొనుడు తప్ప అని. ప్రభుత్వం జాగ్రత్తగా గుర్తించవలసింది ఏమంటే తిట్టుడు పని’ అనేది ప్రతిపక్షం చేసినట్లయితే ప్రజలు అది వారికి మామూలే, వాళ్ల పని అది కదా అన్నట్లు తీసుకుంటారు. కానీ ప్రభుత్వ పక్షం అట్లా చేస్తే చేయవలసిన పని చేయకుండా ఇదేమిటి అంటారు. ప్రభుత్వం ప్రధాన బాధ్యత పరిపాలన, మంచి పాలన అన్నది ప్రజల అభిప్రాయం. ఆ పని చేస్తూ విమర్శలు కూడా సాగిస్తే అది వేరు. కానీ ప్రస్తుత సందర్భంలో గమనించదగినది ఏమంటే ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటో కనిపించడం లేదు. లేదా అరకొరగా మాత్రమే కనిపిస్తున్నది. అందుకు భిన్నంగా రకరకాల పేర్లతో రాత్రింబవళ్లు అసెంబ్లీ లోపల బయట మొత్తం మంత్రులు, పార్టీలోని ఇతర నాయకులు అయినదానికి కానిదానికి బీఆర్ఎస్ను, కేసీఆర్ను విమర్శించడమే పనిగా మార్చుకున్నారు. శేషం కోపేన పూరయేత్ అన్నట్టు శేషం దూషణః పూరయేత్గా మారింది. ఇది ప్రజలకు నచ్చడం లేదు. ఈ మాట ప్రభుత్వం దృష్టికి వస్తున్నదీ లేనిదీ తెలియదు. అది చాలదన్నట్లు మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత నుంచి ప్రజలు అన్నింటికన్నా ముఖ్యంగా ఎదురుచూస్తున్నది హామీల అమలు కోసం. వాటి తీరు ఎట్లున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 6 గ్యారెంటీలలోని 13 హామీలు, అధికారానికి రాగానే డిసెంబర్ 9న చేయగలమన్న రూ.2 లక్షల రైతు రుణమాఫీ కలిపి మొత్తం 14 హామీలు కాగా, అందులో అమలుకు వచ్చింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే. ఇక బడ్జెట్ కీలకం కాగా, ఆరు హామీలకు రూ.53,196 కోట్లు అనటం మినహా ఏ హామీకి ఎంత అవసరం అనే వివరం లేదు. సదరు హామీలకు ఆ మొత్తం చాలదని, అవిగాక మేనిఫెస్టోలోని అనేక ఇతర హామీల మాటేమిటని సభ్యులు, బయట ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు వివరణ లేదు. ప్రజలు ఎదురుచూస్తున్న ఈ అతి ప్రధానమైన విషయం పరిస్థితి ఈ విధంగా ఉండటం, వందరోజుల గడువుకు ఇంకా నెలరోజులు కూడా లేకపోవడంతో ప్రజలలో ప్రభుత్వం పట్ల విశ్వాసం దెబ్బ తినటం మొదలైంది. అది ఇంకా నశించనైతే లేదు గానీ తగ్గటం మొదలైంది.
ఈ స్థితిని అర్థం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు బదులు ప్రభుత్వ పక్షం ఎన్నికల ప్రచార ధోరణి నుంచి ఇంకా బయటపడక శ్వేతపత్రాలు, మేడిగడ్డకు వరుస సందర్శనలు, అసెంబ్లీలో ప్రతిరోజు దూషణలు, సభలో లేని కేసీఆర్పై పరుషమైన భాషతో సవాళ్లు, ఎవరేది ప్రశ్నించినా, కనీసం వివరించబూనినా అరడజను మంది మంత్రులు విరుచుకుపడుతూ అజెండాతో సంబంధం లేని విషయాలు ముందుకు తేవడం ఒక నిత్యకృత్యం అయింది. ఈ పద్ధతిలో బీఆర్ఎస్పై ప్రజల అనుమానాలను పెంచగలమని, రాజకీయంగా లబ్ధి పొందగలమని, బహుశా అంతే ముఖ్యంగా తమ నిష్క్రియాపరత నుంచి, హామీల అమలు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చగలమని అధికారపక్షం ఆశిస్తుండవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఆ విధంగా లేదని గ్రహించడం, తమ తీరును మార్చుకోవటం వారికే మంచిది.
ఆర్థిక పరిస్థితి పైన, నీటిపారుదల పైన, ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించటం పైన, మేడిగడ్డ పైన సభలో జరిగిన భీకరమైన చర్చలో హరీశ్రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, అక్బరుద్దీన్ల ఆధారసహిత, పటిష్ఠ వాదనలతో చివరకు ప్రభుత్వాన్నే ఆత్మరక్షణలో పడవేయటాన్ని టీవీ చానళ్ళలో చూసిన వారంతా గమనించారు. యథాతథంగా మేడిగడ్డ ఉదంతం ప్రభుత్వానికి ఒక ఆయుధంగా ఉపయోగపడగలదే. కానీ ఆ ఇంజనీరింగ్ వైఫల్యం కేసిఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందన్నట్లు చూపబోవటం ప్రస్తుత ప్రభుత్వం చేసిన మొదటి వ్యూహాత్మక తప్పిదం.
జరిగిన నష్టం పరిమితమైనదని, అందుకు మరమ్మతులు చేయవచ్చునని, లోగడ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయని, మేడిగడ్డపై విచారణ జరిపి దోషులను శిక్షించవలసిందేనని, ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని, పథకాన్ని తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డకు మార్చేందుకు ఫలానా సహేతుకమైన కారణాలున్నాయని, ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించడానికి సంబంధించిన వాస్తవాలని, అధికార పక్షం చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే తాను అసెంబ్లీకి రాజీనామా చేయడమే కాక తిరిగి సభలో అడుగు పెట్టబోనని హరీశ్రావు అడుగడుగునా డాక్యుమెంట్ల ఆధారంగా చేసిన సమర్థవంతమైన వాదనలు, ప్రభుత్వ వాదనలలో గల పరస్పర వైరుధ్యాలను ఆయన ఎత్తిచూపిన తీరు ప్రభుత్వాన్ని ఎంత కలవరపరిచిందో, ఆ ప్రసారాలను చూసిన ప్రజలను అంతగా అబ్బురపరిచింది. ఇటువంటి వాదసంవాదాలు బహుశా తెలుగు రాష్ర్టాల శాసనసభ చరిత్రలోనే ఎప్పుడూ లేవు.
వెరసి ఫలితం ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఇంత ఘనంగా గెలిచి కూడా 100 రోజులు గడవడానికి ముందే ఆ ఘనత వెలవెలబోయింది. అందుకు ఒక కారణం వివిధ హామీల అమలులో తాత్సారాలు, అస్పష్టతలు కాగా, రెండవ కారణం ఈ విధమైన సభా దృశ్యాలు కాగా, మూడవది ఇతరత్రా కనిపిస్తున్న కొన్ని విషయాలు. ఆటోలవాళ్లు తీవ్రసమస్యను ఎదుర్కొంటున్నా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా వారికి రూ.12 వేల ఆర్థిక సహాయం ప్రకటించకపోవడం, ఇతర పరిష్కార మార్గాలు ఏవీ చెప్పకపోవడం వాటిలో ఒకటి.
లక్షలాది ఆటో డ్రైవర్లను ప్రభుత్వం గాలికి వదిలివేసింది. పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చలనం లేదు. పెన్షన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెల్లింపులో జాప్యాలు, నిరుద్యోగ భృతిపై ఉలుకుపలుకు లేకపోవడం, రైతు బీమాను అసలు ప్రస్తావించకపోవడం, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు సహాయంపై కదలిక లేని స్థితి, దళితబంధు ఆపివేత వంటివి అనేకం ఒక పెద్ద జాబితాగా తయారై ప్రజలలోని వివిధ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికలలో తీవ్ర విషయంగా మారిన ఉద్యోగాలకు సంబంధించి, ఇంతవరకు తామన్నట్లు జాబ్ క్యాలెండర్ కానీ, నోటిఫికేషన్లు గానీ లేకపోగా, బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫై చేసి, దాదాపు చివరకు తెచ్చిన సుమారు పాతికవేల ఉద్యోగాలకు ఇప్పుడు నియామక పత్రాలు అందజేసి, అవన్నీ తామే నోటిఫై చేసి ఇచ్చినట్లు చెప్పుకోవటాన్ని గమనించనివారు ఎవరూ యువకులలో గానీ, ప్రజలలో గానీ ఉన్నట్లు లేరు. ఇవన్నీ చాలవన్నట్లు లోగడ బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ లేని వ్యవసాయానికి నీటి కొరతలు, అన్ని రంగాలకు విద్యుత్తు కొరతలు ప్రస్తుతం మొదలయ్యాయి. వాటిపై ప్రభుత్వ చర్యలు కనిపించడం లేదు.
ఇటువంటివి సక్రమంగా జరిపి ప్రభుత్వం ప్రజలలో మంచిపేరు తెచ్చుకుండినట్లయితే అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన అం శాల విషయమై ప్రభుత్వానికి ప్రజలలో మద్దతు లభించి ఉండేదేమో. బీఆర్ఎస్పై విమర్శలకు ప్రజలు విలువ ఇచ్చి ఉండేవారేమో. కానీ అట్లా జరగకపోవడంతో మద్దతు రాకపోవడమే గాక, ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటున్న సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఈ రెండున్నర మాసాల కాలపు ఈ వివిధ అనుభవాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేల్కొలుపు కాగలవా?
-టంకశాల అశోక్