సంఘ్ పరివారం వారు సృష్టిస్తున్న మెసేజ్లను క్రాస్ చెక్ చేసుకోకుండా ఫార్వార్డ్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇటువంటి మెసేజ్లు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ మెసేజ్లన్నీ కూడా దేశ లౌకికతత్వాన్ని విచ్ఛిన్నం చేసే భావజాలాన్ని ప్రచారం చేసేవే. ఇటీవల అట్లా ప్రచారంలోకి వచ్చిన మెసేజ్ ఒకటి ఇట్లా ఉంది. అదేమిటంటే.. ‘హిందూ, ముస్లిం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదని అనేవారు.. 1947కు ముందు బీజేపీ లేదు. మరి హిందూ, ముస్లిం పేరిట దేశాన్ని రెండుగా విభజించింది ఎవరు?’
‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పంచి పెడుతుంది. హిందూ స్త్రీల మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా ఎత్తుకుపోతారు. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేస్తారు’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న సమయంలో వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఇటువంటి వాట్సాప్ మెసేజ్లు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అసలు దేశాన్ని మత ప్రాతిపదికన విభజించింది ఎవరు? విచ్ఛిన్నం దిశగా తీసుకెళ్తున్నదెవరు? నిగ్గు తేల్చవలసిన ప్రశ్నలు ఇవి.
1857 నుంచి 1947 వరకు భారత జాతీయోద్యమ చరిత్రను పరిశీలిస్తే.. 1857లో సిపాయిల తిరుగుబాటు పేరుతో చరిత్రలో లిఖితమైన ప్రథమ భారత స్వాతంత్య్రోద్యమం అనంతరం భారత జాతీయోద్యమం అనేక మలుపులు తిరుగుతూ సాగిందని అర్థమవుతుంది. 1857లో హిందూ, ముస్లింల ఐక్యత బలంగా ఉండి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని దాదాపు ఓడించినంత పని చేసింది. హైదరాబాద్లాంటి కొన్ని పెద్ద, సంపన్న రాజ్యాలు ఈ ఉద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ వారికి సహకారం అందించినందు వల్ల అంతిమంగా సిపాయిల తిరుగుబాటు అణచివేతకు గురైంది.
ఈ ఉద్యమానికి ప్రతీకాత్మకంగా నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి, 80 ఏండ్ల వృద్ధుడు బహదూర్ షా జఫర్ను అరెస్టు చేసి రంగూన్ జైలుకు ప్రవాసం పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఒంటరి కారాగారవాసం అనుభవిస్తూ బహదూర్ షా జఫర్ 1862లో కన్నుమూశారు. హిందూ, ముస్లింల ఐక్యత కొనసాగితే ఈ దేశంలో అధికారం చలాయించడం సాధ్యం కాదని బ్రిటిష్ వారికి ఆ సిపాయిల తిరుగుబాటు ద్వారా అర్థమైంది. ఇక విభజించి- పాలించు అన్న పాలసీని రూపొందించి అమలు చేశారు బ్రిటిష్ పాలకులు.
సిపాయిల తిరుగుబాటు అనంతరం రాజ్యాలను ఆక్రమించే విధానానికి స్వస్తి పలికి భారతదేశంలో హైదరాబాద్, కశ్మీర్, మైసూర్, జునాగఢ్ లాంటి బలమైన రాజ్యాలను, ఇతర చిన్నచిన్న రాచరిక సంస్థానాలను బ్రిటిష్ అత్యున్నత అధికారానికి (British Paramount Authority) లొంగి ఉండే స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగనిచ్చారు. అట్లా బ్రిటిష్ వారి ప్రత్యక్ష పరిపాలనలో ఉన్న భూభాగాలతో సహా సుమారు 560 స్వతంత్ర రాచరిక సంస్థానాలు కూడా 1947 నాటికి ఉనికిలో ఉన్నాయి.
అందులో ముస్లిం రాజులు ఉన్నారు, హిందూ రాజులు ఉన్నారు. హిందూ మెజారిటీ కలిగిన హైదరాబాద్ రాజ్యంలో పరిపాలకుడు ముస్లిం. ముస్లిం మెజారిటీ కలిగిన కశ్మీర్లో పరిపాలకుడు హిందూ. ఎవరు రాజైనా అందరూ నిరంకుశంగా ఉన్నారు, ప్రజలను పీడించుకుతిన్నవారే. రాచరికమే నిరంకుశమైనది. 20వ శతాబ్దం తొలి నాటికే హిందూ, ముస్లింల మధ్య చీలికలకు, విభేదాలకు బీజాలు పడ్డాయి. ఆ నాటికి బ్రిటిష్ వారు కలకత్తా రాజధానిగా పరిపాలన సాగిస్తున్నారు.
1905లో బెంగాల్ రాష్ర్టాన్ని మత ప్రాతిపదికన విభజించారు. ముస్లింలు మెజారిటీగా (ప్రస్తుత బంగ్లాదేశ్) ఉన్న ప్రాంతాన్ని తూర్పు బెంగాల్ పేరిట ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారు. ఢాకాలో వారి ప్రోత్సాహంతోనే 1906లో అఖిల భారత ముస్లిం లీగ్ ఏర్పాటైంది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగాయి. ఆ ఉద్యమానికి జడిసి బ్రిటిష్ ప్రభుత్వం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా విభజనకు అనుకూలంగా ముస్లింలను కూడగట్టడాన్ని అప్పటికే ఏర్పాటైన ముస్లిం లీగ్ ప్రారంభించింది. తద్వారా బెంగాల్ ప్రాంతంలో హిందూ, ముస్లింల మధ్య మత కలహాలకు ఆజ్యం పోసింది బ్రిటిష్ ప్రభుత్వం.
1916లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పాటైంది. దానికి ప్రతిగా అప్పటివరకు ఒక కాలేజీగా ఉన్న మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ 1921లో ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా రూపం మార్చుకున్నది. ఈ రెండు యూనివర్సిటీలు ఏర్పాటు కావడానికి బ్రిటిష్ ప్రభుత్వం సహకారం అందించింది. ఈ రెండు వర్గాల మధ్య ఐక్యత భగ్నం కావడమే వారికి కావాల్సింది.
మహారాష్ట్రలో ‘స్వాతంత్య్రం నా జన్మ హక్కు’ నినాదంతో జాతీయోద్యమాన్ని తిలక్ ప్రారంభించారు. జాతీయోద్యమంలోకి ప్రజలను సమీకరించడానికి గణేష్ నవరాత్రులను సామూహిక ఉత్సవాలుగా జరపడం ప్రారంభించారు. అయితే తిలక్ కట్టర్ హిందూ జాతీయవాది కాదు. అన్ని వర్గాల ప్రజలు జాతీయ ఉద్యమంలో భాగం కావాలని ఆయన కోరుకున్నారు. ‘ఎక్కడ నుంచి వచ్చిన వారైనా, ఏ మతం వారైనా ఈ దేశం బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తం కావడానికి సహకరించే వారందరూ దేశ భక్తులే, భారతీయులే’ అని తిలక్ అన్నారు. ఆయన ఉదారవాద వైఖరి సావర్కర్ లాంటి హిందూ జాతీయవాదులకు నచ్చలేదు. అరెస్ట్ అయి అండమాన్ జైలులో ఉన్న సావర్కర్ మెర్సీ పిటిషన్ పెట్టారు.
ఇకముందు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొననని హామీ ఇచ్చి, అండమాన్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల తర్వాత సావర్కర్ ఆ హామీని నిలబెట్టుకున్నారు. జాతీయోద్యమంలో పాల్గొనకుండా 1915లో హిందూ మహాసభను ఏర్పాటు చేసి, హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేయసాగారు. ‘హిందువులు తప్ప మరెవరూ ఈ దేశ పౌరులు కాజాలరు’ అన్న హిందుత్వ సిద్ధాంతాన్ని ఆయన ప్రచారంలోకి తీసుకువచ్చారు. Essentials of Hindutwa అన్న పుస్తకాన్ని ప్రచురించారు. సావర్కర్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని ముస్లిం లీగ్ కూడా సమర్థించింది.
సావర్కర్ నుంచి పొందిన స్ఫూర్తితో 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటైంది. నిజానికి ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేసిందే హిందూ జాతీయ వాదులైన సావర్కర్, ఆర్ఎస్ఎస్ రెండో సర్ సంఘ్చాలక్ గోల్వాల్కర్. Bunch of Thoughts శీర్షికన రాసిన తన పుస్తకంలో.. ‘ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు భారతదేశానికి అంతర్గత ముప్పు’ అని గోల్వాల్కర్ అన్నారు. వారిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఒకవైపు హిందూ జాతీయవాదులు, మరోవైపు ముస్లిం జాతీయవాదులు ద్విజాతి సిద్ధాంతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను ఎంత దెబ్బతీయాలో అంత దెబ్బతీశారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో మత కలహాలు చెలరేగడానికి కారణమయ్యారు. తిలక్ అనంతరం జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన గాంధీ రెండు వర్గాలను సమన్వయపరుస్తూ జాతీయోద్యమాన్ని నడపసాగారు. చాలా కాలం వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో కలిసి నడిచిన ముహమ్మద్ అలీ జిన్నా 1940 నాటికి ముస్లిం లీగ్లో చేరి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని కోరడం ప్రారంభించారు. ఇట్లా 1857 తర్వాత బ్రిటిష్ వారి విభజించి పాలించు కుట్రల కారణంగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఐక్యత లోపించింది. ఇందుకు హిందూ, ముస్లిం జాతీయవాదులు ఇద్దరూ కారణమే.
1947కు ముందు బీజేపీ లేదు కదా మరి దేశాన్ని హిందూ ముస్లిం పేరుతో రెండుగా విభజించింది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు మోదీ భక్తులు. ఈ పేరుతో లేకపోవచ్చు. కానీ, హిందూ మహాసభ పేరుతో, ఆర్ఎస్ఎస్ పేరుతో ఉన్నది. 1951లో భారతీయ జన్సంఘ్ ఆవిర్భవించింది. అవే ఈ నాటి బీజేపీకి పూర్వ రూపాలు. స్వాతంత్య్రం కోసం జరిగిన జాతీయోద్యమంలో ఏ పాత్ర పోషించకపోయినా ద్విజాతి సిద్ధాంతంతో దేశ విభజనకు తోడ్పాటు అందించింది ఈ మతతత్వ శక్తులే. దేశ విభజనను బతికున్నంత కాలం వ్యతిరేకించింది మహాత్మాగాంధీ మాత్రమే. అందుకు ఆయనను హత్య చేసింది ఈ మతతత్వ శక్తులే. ఆయనను హత్య చేసింది ఎవరో అందరికీ తెలిసిందే.
మన చరిత్ర ఏమిటో తెలియకపోతే మనం ఎక్కడికి పోవాలో గమ్యం అర్థం కాదు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక, ప్రజాస్వామిక, సోషలిస్ట్ విలువలు ధ్వంసం కాకుండా కాపాడుకోవాల్సింది ఈ దేశ ప్రజలే. ఈ దేశంలో మతతత్వ ఫాసిజం ప్రబలకుండా చూడాల్సింది ఇప్పటి తరమే. దేశ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే అన్ని రకాల మతతత్వాలను వ్యతిరేకించాల్సిందే. వారిని భారత రాజకీయ రంగం నుంచి నిర్మూలించాల్సిందే. అప్పుడే భారత రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టిన వాళ్లమవుతాం. మతతత్వం మన సంస్కృతి కాదు. శతాబ్దాలుగా దేశం సంతరించుకున్న ఈ విలువలు ఇవ్వాళ విచ్ఛిన్నం అవుతున్నాయి. వీటిని కాపాడుకోవడం, సమున్నతంగా నిలబెట్టుకోవడం కాలం మన ముందు నిలిపిన సవాల్. దేశంలో ఉన్న గంగా జమునా తెహజీబ్ సంస్కృతి నాశనం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలదే.
శ్రీధర్రావ్ దేశ్పాండే