‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ బడులు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. అంతేకాదు, ఈ కార్యక్రమంతో ప్రతి విద్యార్థికి ఉన్నత చదువు అబ్బనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ప్రభుత్వ బడుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది.
అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే విద్యా విధానంలో అనేక మార్పుల దిశగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసింది. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే మూత్రశాలలు, విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్ అవసరమైన చోట్ల అదనపు గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. విద్యా బోధనలో మెరుగైన ఫలితాలు సాధించడంతోపాటు, డిజిటల్ విధానం లాంటి పన్నెండు రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు విప్లవాత్మకమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం శుభ పరిణామం. మొత్తంగా ఈ బృహత్తరమైన పథకంతో ప్రభుత్వ బడులు ఇంగ్లిష్ మీడియం బడులుగా మారడం గొప్ప విషయం.
ఉమ్మడి రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు విద్య పట్ల, బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల నిర్లక్ష్యం వహించాయి. దీంతో విద్యావ్యవస్థ కునారిల్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ బడుల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ప్రతి బడిలో విద్యాబోధన, వసతుల కల్పనకు ప్రతి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తుండటం అభినందనీయం. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 20 లక్షలకు పైగా విద్యార్థులున్నారు. రూ.7,289.54 కోట్లతో ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల విద్యాబోధన జరగాలనే నిర్ణయం చరిత్రాత్మకం. ఆంగ్ల విద్య ప్రతి పేదవాడికి గొప్ప వరం. గతంలో ఆంగ్లంలో చదువుకోవాలంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ అక్కడ అధిక ఫీజులు ఉండటంతో ఎంతోమంది ప్రతిభ గల పేద విద్యార్థులు ఇంగ్లిష్ విద్యకు దూరమయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. నేటి యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందాలంటే ఇంగ్లిష్ విద్య తప్పనిసరి. మన తెలుగు భాషను కాపాడుకుంటూనే విద్యార్థులకు ఇంగ్లిష్ విద్యను బోధించడం ఎంతో అవసరం. ఆంగ్ల విద్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలుచేయాలని, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నాణ్యమైన విద్యను ప్రతి పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, విద్యా నిపుణులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో 85 శాతానికి పైగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లోని విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు బోధన ఎంతో మేలు చేయనున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో చిందు, దాసరి, మోచి, డక్కలి మొదలైన నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఇంగ్లిష్ విద్య అందనున్నది. ఒక వర్గం, ఒక కులం, ఒక మతం అని కాకుండా ప్రతి పేద బిడ్డకు సర్కారు చదువు అందనున్నది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువస్తున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం. ఏడో తరగతి వరకు ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్ పాఠ్యాంశాలతో కూడిన పుస్తకాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు శిక్షణనివ్వడమే కాకుండా, త్వరలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యజ్ఞంలో ఎన్నారైలు, పూర్వ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం సూచిస్తున్నది.
విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి. అది జరుగాలంటే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ విద్య అవసరమనే సీఎం కేసీఆర్ ఈ మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ- మన బడి’ సకల విద్యా సమస్యలకు పరిష్కారం. రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొనేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-చిటుకుల మైసారెడ్డి
94905 24724