ఒకప్పుడు వెలి బతుకులు. ఊరికి దూరంగా బిక్కుబిక్కుమంటూ దీనంగా కాలం గడిపిన గడ్డురోజులు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా వలపోతలే మా తలరాతలని బతుకులీడ్చిన దళిత గాధలు. కలతలు ముసురుకొని కన్నీళ్లు తాగిన వెలివాడల దళితులు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో ఆశలు నింపుతున్న అద్భుత సందర్భమిది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకొనే తెలంగాణ దళితబంధు ఓ మహాయజ్ఞంలా కొనసాగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే దళితబంధు రాష్ట్రంలోని సుమారు 16.50 లక్షల దళిత కుటుంబాలకు కాంతిరేఖలా దారిచూపుతున్నది. నాటి ఉద్యమ పార్టీ నేడు బీఆర్ఎస్గా మారి దేశానికి సరికొత్త దిశానిర్దేశం చూపాలని వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ సమయంలో ఇంతటి బృహత్తర పథకాన్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేకాదు ఇలాంటి పథకం దేశంలోని దళితులందరికీ చేరాల్సిన అవసరం ఉందన్న చర్చ జరుగుతున్నది.
దళితుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేలా రూపొందించిన పథకం దళితబంధు. దీన్ని తొలుత కేసీఆర్ 2021, ఫిబ్రవరి 10న నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. ప్రకటించినట్లే 2021లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ‘దళిత ఎంపవర్మెంట్ స్కీం’ కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే 2021, జూలై 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ‘దళిత సాధికారత అమలు-పైలట్ ప్రాజెక్టు ఎంపి క-అధికార యంత్రాంగం విధులు’ అనే అంశంమీద ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పథకానికి ‘తెలంగాణ దళితబంధు పథకం’ అనే పేరును కేసీఆర్ ఖరారు చేశారు.
దళితబంధు అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై 2021, జూలై 26న ప్రగతి భవన్లో తొలి అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు, 15 మంది రిసోర్స్పర్సన్స్ పాల్గొన్నారు. ఆరోజున సీఎం కేసీఆర్ దళితులతో కలిసి భోజనం చేశారు. వారికి పథకం గొప్పతనాన్ని స్వయంగా వివరించారు.
అర్హత ఉన్న ప్రతి దళితునికి మళ్లీ చెల్లింపుల్లేకుండా పూర్తి రాయితీతో ప్రభుత్వం రూ.10లక్షలు దళితబంధు చెల్లిస్తున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఒక్క మాటతో నిరుపేద దళితులు ఒక్కసారిగా లక్షాధికారులయ్యారు. ఇలా రాష్ట్రంలోని దళితులందరికీ పథకం వర్తింపజేస్తామని చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం ద్వారా తెలంగాణలోని 16.50 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది. లబ్ధిదారుడి నుంచి రూ.10వేలతో ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటుచేసింది. లబ్ధిదారులకు ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణనిధి నుంచి సహాయం అందజేసేలా దీర్ఘకాలిక ప్రయోజనాలతో పథకాన్ని రూపొందించడం గొప్ప విషయం. క్షేత్రస్థాయి లో ఈ పథకం అమలు తీరును గమనించేందు కు 6గురితో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి దళితబంధు కమిటీలు ఏర్పాటు చేసి ఎక్కడా దుర్వినియోగం కాకుండా పర్యవేక్షిస్తారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా 2021, సెప్టెంబరు 14న రూ.10లక్షల చొప్పున 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేసింది. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.1,200 కోట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకంలో భాగంగా సీఐపీఎస్, పీఎంఎంఎస్వై సహకారంతో 2021 డిసెంబరులో జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణనిచ్చారు. చేపల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవస్థాపకతలో నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల పాటు ఈ శిక్షణ సాగింది. శిక్షణ పొందిన వారు ఫిషరీస్ యూనిట్లు ఏర్పాటు చేసుకొని, చేపల ఉత్పత్తి, పెంపకం చేస్తున్నారు.
2022, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున రాష్ట్రంలోని పలుచోట్ల 2వేల మంది లబ్ధిదార్లకు దళితబంధు యూ నిట్లు పంపిణీ చేశారు. నీతి ఆయోగ్ దళితబంధు పథకంపై ప్రశంసలు కురిపించడం విశేషం. దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న పథకంగా దళితబంధు నీతి ఆయోగ్ కమిటీ సభ్యుల ప్రశంసలు అందుకున్న ది. విశ్వనాథ్ బిష్ణోయ్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ సభ్యులు కుమార్ జైన్, నిఖిత జాయిన్, యశస్విన్ సరస్వతి, ఇరామయీ తదితరులతో కూడిన నీతి ఆయోగ్ బృందం 2022 సెప్టెంబరు 16న హుజురాబాద్ పట్టణంలో పర్యటించి దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలించి ప్రశంసలతో ముంచెత్తింది. తాజాగా దళితబంధు విజయగాథలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు వెబ్ పోర్టల్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఈ పథకాన్ని రాష్ట్రంలోని 33 జిల్లాలు, 118 నియోజకవర్గ్గాల్లో దళితబంధు యూనిట్స్ మంజూరు చేయడానికి ప్రభు త్వం చర్యలు చేపట్టింది. దళితబంధు కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 36,392 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేసింది. వారిలో 31,088 మంది యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. 2022 -23 బడ్జెట్లో రూ.17, 700 కోట్ల నిధులను కేటాయించింది.ఈ ఏడాది ఒక్కో నియోజక వర్గంలో 1500 కుటుంబాల చొప్పున 118 నియోజకవర్గాల్లో 1,77,00 మంది లబ్ధిదారులకు దళితబంధును వర్తింపజేయనున్నారు. ఈ సంవత్సరం తొలిదశ లో మొత్తం 59, 000 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. దళితులకోసం సాగుతున్న ఈ యజ్ఞం విజ యవంతంగా కొనసాగాలని కోరుకొందాం. (వ్యాసకర్త : ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
-వనం నాగయ్య
94418 77695