ఊరూరు, వాడవాడ తిరుగుతూ జీవనోపాధిని పొందే పూసల గంప నవ్వింది. మా పూసలవ్వకు సీఎం కేసీఆర్ రూ.లక్ష సాయంతో కొత్త దారి చూపిండు. పూసల గంపలో కావలసిన వస్తువుల కోసం దినమూ గండమే. సేటు దయ తలిస్తేనే ఉద్దెర. లేదంటే ఆ రోజు నోటికి ముద్ద కరువే. రూ.పది వేలు అప్పుపుట్టుడే కష్టంగా ఉన్న ప్రస్తుత కాలంలో సీఎం కేసీఆర్ రూ.లక్ష సాయం కలలో కూడా ఎవ్వరూ ఊహించలేదు. దశాబ్దాలుగా ఎదురుచూసిన కండ్లకు ముఖ్యమంత్రి సాయం ఓ ధైర్యం. అంతకుమించి భరోసా. కార్పొరేటీకరణ, ప్రపంచీకరణ మాటున వృత్తులు ఛిద్రమైనా మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతున్నారు పూసల మహిళలు. రిటైల్ మార్కెట్ మాల్స్, కంగన్ హాళ్లు, కాస్మోటిక్స్ రాకతో కనుమరుగవుతున్న వృత్తిని కాపాడుకుంటూనే తమ తరాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయం.
తెలంగాణ రాష్ట్రంలో పూసల జనాభా కేవలం 40 వేల పైచిలుకు మాత్రమే. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమరాజ్యం తీసుకొస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూసల సామాజిక వర్గం పట్ల చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు.
మా అమ్మ గుంటిపల్లి రామక్క వెంట మాడంతా (నెత్తి) నొప్పిపుడుతుంటే బరువున్న గాజుల గంపతో కాళ్లకు చెప్పులు లేకపోయినా ఊరూ వాడా ఇల్లిల్లూ తిరిగి గాజులమ్మేవాళ్లం. మాతృస్వామ్య వ్యవస్థ పునాదులపై పురుడు పోసుకున్న పూసల సామాజికవర్గం నాడు నేడు మా అమ్మ లాగే పూసల తల్లులు ఇప్పటికీ ఆ వృత్తిని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెత్తిన గంప, చంకలో పిల్లనెత్తుకుని ఊరూరు తిరుగుతూ గడప గడపకు వెళ్లి మహిళల ముత్తైదు వస్తువులైన గాజులు, పూసలు, పూసల గొలుసులు, దువ్వెనలు, పిన్నులు, సూదులు, కాటుక, తిలకం, బొట్టుబిళ్లలు…సవరాలు, హెయిర్ పిన్నులు, హెయిర్ బ్యాండ్లు వంటివి విక్రయిస్తుంటారు. దీంతో వీరు చిరు వ్యాపారులనే ముద్ర పడింది.
పెండ్లిైల్లెనా, శుభకార్యాలైనా ఇప్పటికీ గ్రామీణ తెలంగాణలో పూసలోల్ల గాజులే శుభమనే నమ్మకం బలంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆదరించే ఆరాధించే అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగకు పూసలతల్లి పాత్ర కీలకం. పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు సహా మహిళలు చిన్నా పెద్దా అందరూ అలంకరణ వస్తువులపై ఆధారపడుతుంటారు. నగరాల్లో కంగన్ హాళ్లు, మాల్స్ వంటివి వచ్చినా గ్రామీణ ప్రాంతా ల్లో గాజులు సహా ఇతరత్రా అలంకరణ వస్తువులన్నీ పూసల మహిళనే అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నవ సమాజానికి కూడా అందం అనే నాగరికతను నేర్పుతున్నది పూసల సామాజికవర్గ మహిళనే.
శ్రామిక మహిళగా పేరు తెచ్చుకున్న పూసలవ్వ ఇంటా, బయటా ఆర్థిక విప్లవానికి, ఆర్థిక క్రమశిక్షణకు మారు పేరు. సంచార జీవనగమనంలో ఎప్పుడూ ఆత్మగౌరవంతోనే ముందుకు సాగుతున్నది. మరుగున పడ్డ కులవృత్తులు, చతికిల పడిన చేతివృత్తులను బతికిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అట్టడుగు, అణగారిన చిరు సంచార వ్యాపారులపై దృష్టి కేంద్రీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పూసల, కృష్ణ బలిజ ఆర్థిక ఫెడరేషన్ ఏర్పాటు చేసినా నయాపైసా నిధి మంజూరు కాలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ సామాజికవర్గం కోసం 2014 లో ఫెడరేషన్ రుణాలు, 2019 లో రూ.50 వేల చొప్పున దాదాపు రూ.5 కోట్ల మేర నూరు శాతం సబ్సిడీ రుణాలను అందచేసి ఆర్థికంగా చేయూతనిచ్చింది.
అయితే ఇటీవల బీసీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం కింద పూసల సామాజికవర్గంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటు క్యాబినెట్ భేటీలో, అటు మంత్రివర్గ ఉప సంఘ సభ్యులకు ఈ సామాజికవర్గ ఆర్థిక క్రమశిక్షణపై మాట్లాడి వీరికి ప్రత్యేక రుణాలివ్వాలని ఆదేశించారు. కేసీఆర్ సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో పూసల కుల ఆర్థిక స్థితిగతులను దగ్గరనుంచి గమనించారు. అందుకే ఉమ్మడి ఏపీలో పూసల కులం పట్ల వివక్ష ఉన్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆర్థిక భరోసాతోనే వారిని ఆదుకోవచ్చనే క్షేత్రస్థాయి సమాచారంతో ఆర్థికంగా ఊతమివ్వడం గొప్ప విషయం. బీసీ రుణాల కోసం పూసల సామాజికవర్గం నుంచి తొలి విడతలో 6578 మంది దరఖాస్తు చేసుకోగా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించి రుణాలను మంజూరు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం వృత్తి కులాలకు రూ.లక్ష సహాయం అందించనుండటం చిన్నకులాలకు పెద్ద ఆర్థిక సహాయమే అవుతుంది.
నిజాంకాలంలో పూసల కులానికి రహదారి పత్రాన్ని జారీ చేసేవారు. గ్రామాలలో తిరిగి వస్తువులు అమ్ముకునే వీరిని ఆయా గ్రామపెద్దలు అడ్డుకోకుండా ఉండేందుకు ఈ రహదారి పత్రాలను ఇచ్చారు. కంచి పీఠాధిపతులు సైతం ఇటువంటి రహదారి పత్రాలు (మంగళాశాసనం) జారీ చేశారు. అంటే అనాదిగా వీరు సంచార జాతులనేది సుస్పష్టం. సంచార జాతులను ఎస్టీలు, బీసీ ‘ఏ’ గ్రూపులో చేర్చగా పూసల కులస్థులను మాత్రం బీసీ ‘డీ’ గ్రూపులో చేర్చారు. వెన్నెలకంటి రాఘవయ్య నేతృత్వంలో సాగిన వివిధ సంచార జాతుల అధ్యయనాల్లో పూసల వాళ్లు సంచార జాతి అని కూడా స్పష్టం చేశారు. అనేక కమిషన్ల నివేదికలు, పోరాటాల ఫలితంగా 2009లో మన రాష్ట్ర ప్రభుత్వం వీరిని బీసీ ‘డీ’ గ్రూప్ నుంచి బీసీ ‘ఏ’ గ్రూపులోకి మార్చింది.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పూసల కులస్తులు నెత్తిన గంపనెత్తుకుని జై తెలంగాణ అని నినదించారు. గ్రామాల్లో పూసల కేకలు పెడుతూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవశ్యకతపై ప్రచారం చేశారు. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సుపరిపాలనపై, పథకాలపై కూడా సామాజిక మాధ్యమాలకంటే బలంగా ఇల్లిల్లూ గడప గడపకూ ప్రచారం చేయటం పూసల తల్లుల ప్రత్యేకత. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి మహిళతో పూర్తిగా బంధం, అనుబంధం ఏర్పరుచుకొని ముందుకు సాగే ఆత్మీయ ఆడపడుచు పూసల తల్లి.
తెలంగాణ రాష్ట్రంలో పూసల జనాభా కేవలం 40 వేల పైచిలుకు మాత్రమే. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమరాజ్యం తీసుకొస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూసల సామాజిక వర్గం పట్ల చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు. ఇప్పటికే ఉప్పల్ భగాయత్లో ఎకరం విస్తీర్ణంలో రూ.కోటి తో పూసల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభు త్వం పునాదులు వేయడం గొప్ప విషయం. ఈ సా మాజికవర్గాన్ని కేంద్రం డీఎన్టీలో, రాష్ట్రం ఎంబీసీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. ఈ కులంలో సామాజిక ఉద్యమకారులను గుర్తించి ఎంబీసీ కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో నియమించాలని కోరుతున్నారు.
(వ్యాసకర్త : చైర్మన్ పూసల ఆత్మగౌరవ భవన ట్రస్ట్, ఉప్పల్ భగాయత్)
-గుంటిపల్లి వెంకట్
94949 41001