నేడు దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ ఏ పార్టీ కూడా సంచార జాతుల అభ్యున్నతి కోసం ఆలోచించడం లేదు! సంచారజాతుల జీవన పరిస్థితులను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వారి ప్రగతి కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేశారు.
సంచారజాతులు ఆత్మాభిమానంతో జీవితంలో పైకి ఎదగడానికి సీఎం కేసీఆర్ చేయూతనందించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంచారజాతుల కోసం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 10 ఎకరాల విలువైన భూమిని, రూ.10 కోట్ల నిధులను మంజూరు చేశారు. సంచారజాతుల యువతకు ఉపాధికి ఆర్థిక సాయం, పిల్లల చదువులకు రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సాహం అందిస్తున్నారు.
సంచారజాతుల ఆత్మగౌరవ వేదిక భవనం సంచారజాతుల సమగ్ర కార్యకమాల నిర్వహణకు, భవిష్యత్తు తరాల అవసరాలకు, వారి కార్యాచరణకు అభివృద్ధి క్షేత్రంగా నిలవనున్నది. ఈ భవనం అన్ని సంచారజాతుల సంఘాలకు పలురకాల సేవలు అందించనున్నది. ఉన్నత చదువులు చదివేవారికి, వివిధ రకాల శిక్షణలు పొందేవారికి, సంచారజాతుల సమావేశాలకు, శుభకార్యాలకు, ఉద్యోగాలు చేసే మహిళలు, యువత వసతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర పభుత్వం సంచారజాతులకు చెందిన 1,419 మంది యువత ఉపాధి కోసం రూ.50 వేల గ్రాంటుతో ఈ-ఆటోలను అందించింది. సంచారజాతుల విద్యార్థులకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది. బీసీ బంధు పథకంలో సంచారజాతుల ప్రజలకు చెందిన 12 వేల మంది లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. సంచారజాతుల అభివృద్ధికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంచారజాతుల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
(వ్యాసకర్త: సమన్వయకర్త, అఖిల భారత సంచార జాతుల సంఘం)
-శ్రీనివాస్ తిపిరిశెట్టి
99494 26536