సహజ ధోరణిలోనే సీఎం కేసీఆర్ సాహసోపేతంగా ఎన్నికల శంఖారావం పూరించారు. దాదాపు అన్ని స్థానాల్లో మళ్లీ సిట్టింగులకే అవకాశం కల్పించి పసలేని ప్రచారాలకు స్వస్తి పలికారు. దీంతో సోషల్ మీడియా, ప్రధాన మీడియా ఎన్నికల నగారా మోగించి వార్తలకు రంగులద్దుతున్నది. కండువాల కోలాటం, మంతనాల ముసలం మొదలైపోయింది. కానీ తెలంగాణ ప్రజా రాశులు మాత్రం తమకేం పట్టనట్టు పొలాల్లో తలమునకలై ఉన్నారెందుకు?
ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంపై వారికున్న నమ్మకం అలాంటిది. ఆయన కూడా తాను చేపట్టిన మంచి పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతోనే ఎన్నికల బరిలోకి త్వరగా దిగారు. దమ్మున్న నాయకుడు కాబట్టే ధైర్యంగా ఎన్నికలకు నాలుగు నెలల ముందే తన విన్నింగ్ టీమ్ను ప్రకటించారు. ఎమ్మెల్యేల పనితీరులో చిన్న చిన్న లోపాలున్నా… వాటిని ప్రభుత్వ రథ సారథిగా తాను సరి చేస్తానని ప్రకటించి మరీ ప్రజా తీర్పు కోసం మరోసారి ఎన్నికల కదన రంగంలోకి దూకారు. సహజంగా శాసనసభ ఎన్నికల వేడి ఆరు నెలల ముందే గ్రామాలను తాకుతుంది. ఈసారెందుకు ఎన్నికల హడావుడి వైపు జనం మొహం తిప్పటం లేదన్నదే అసలు ప్రశ్న.
స్వరాష్ట్రంలో మూడోసారి శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు రాజకీయ విశ్లేషకులకు, అధ్యయనపరులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. లోతుగా వెతికితే ప్రజా ధోరణికి అద్దం పట్టే పునాది వాస్తవాలు ఎవ్వరికైనా సులభంగానే అర్థమవుతాయి. తెలంగాణ మౌన మునిలా ఏదో రాజకీయ అభిప్రాయాన్ని పొలిమేరల్లోనే నిలబెట్టి తన పనిలో తాను నిమగ్నమై పోయింది. ఆయాసపడుతున్న అభ్యర్థులు, ప్రయాసపడుతున్న పార్టీలు ఊర్లలోకి అడుగు పెట్టేముందు జనం భావనను పట్టుకోగలిగితే కనీసం వృథా ఖర్చులను నివారించుకోగలుగుతారు. చరిత్ర పొడువునా ఎన్నో భిన్న అనుభవాలను ఆస్వాదించిన తెలంగాణ ప్రజలకు సహజంగానే విశిష్టమైన నైజం అలవడింది. వారు ఎన్నో భావజాలాలు, భావోద్వేగాలను దాటి పురోగతి కోణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుని పరిశీలించి అభిప్రాయం ఏర్పరుచుకుంటున్నారు. మునుపటి తరహాలో పాటనో, మాటనో ప్రేరేపించే మానసిక స్థితిని అధిగమించి, అనుభవంలోకి వచ్చిన దాన్నే గీటురాయిగా తీసుకొని స్థిర భావనను వ్యక్తం చేస్తున్నారు. గతంలోలా టీ కొట్టుల దగ్గరనో, బస్టాండుల వద్దనో, పది మంది కూడే కేంద్రాల్లోనో సర్వే సంస్థలు గాలిస్తే వాస్తవాలు దొరకవు. తోటల్లో మిరపకాయలు తెంపుకున్నట్లుగా కష్టించి పని చేసే జనాల కార్యస్థలాల్లోకి వెళ్లి ఏరుకుంటేనే జనాభిప్రాయాలు దొరుకుతాయి. ఏమనుకుంటున్నది తెలంగాణ? ఎవరి వెంట ఉన్నామని ప్రకటిస్తున్నది తెలంగాణ?
ఉద్యమ కాలంలో తెలంగాణ సమాజానికి కేసీఆర్పై ఏర్పడిన ఈ ఆరాధన భావనను ఈ దశాబ్ది ఇంకా బలోపేతం చేసింది. తెలంగాణ అవసరాలను గుర్తించడంలో కేసీఆర్ వేగానికి సరితూగే నాయకుడు కాగడా పట్టి వెతికినా తెలంగాణలో కనిపించే అవకాశం లేదు. వివిధ వర్గాల ఉన్నతి, వివిధ రంగాల పురోగతికి పాలనా నైపుణ్యం, మానవీయతను జోడించడం వల్ల ప్రభుత్వ పథకాలు సామాజిక ఉద్యమ రూపంలో అమలవుతున్నాయి. ఒకటా.. రెండా.. 450కి పైగా సంక్షేమ పథకాలే పునాదిగా కోట్లాది జనాల బతుకులు మార్చి వారి హృదయాలు గెలుచుకున్న అనుభవాలు బీఆర్ఎస్కు ఉన్నాయి.
సహజంగా ప్రభుత్వంలోకి రాగానే రాజకీయ పార్టీలకు పురాతన అధికార స్వభావం అంటుకుంటుంది. ప్రజలకు దూరంగా జరిగి, దడి కట్టుకున్న వర్గమై, గాలిమేడల మీద కుర్చీలో నాయకత్వం ఆసీనమవుతుంది. చూపు మసకబారి, వినికిడి శక్తికి అడ్డుగోడలు కట్టుకుంటాయి రాజకీయ పార్టీలు.
కులాల లెక్కలు, నోట్ల కుప్పల చుట్టూతా ఎన్నికల వ్యూహాలను పన్నే పాత రాజకీయ నైపుణ్యాలనే నమ్ముకునే నాసి రకపు తనానికి చాలా రాజకీయ పార్టీలు నిలువెత్తు నిదర్శనం. కానీ బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ బతుకుకు బంగారుతనాన్ని పొదిగే పోరులో ఎన్నో నూతన ఆవిష్కరణలకు జీవం పోసింది. జనం చుట్టూ విధానాలు అల్లుకుంటూ వారే తమ జీవితం అన్నట్టు బీఆర్ఎస్ సాగుతున్నది. దానివల్లే ప్రజల గుండెల నిండా గులాబీ జెండా పరుచుకొని ఉన్నది. రాజకీయాలు, పార్టీలు, కమిటీలు, ఎన్నికలు తదితర సహజ ప్రక్రియలను అధిగమించి, ఏదో అనిర్వచనీయమైన అనుబంధాన్ని తెలంగాణ జనం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఏర్పాటు చేసుకున్నారు. అందువల్లనే మూస ధోరణి పగిలి, ఉత్సాహ వైఖరి రాష్ట్రం నలుమూలల విస్తరించింది. ఈ ప్రభుత్వం మాదేననే భావన ప్రతి గడపలో కొలువైంది.
దరిద్రం నుంచి బయటపడేందుకు, పాలనా వివక్ష నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ తండ్లాడిన తీరు, ధిక్కారమే దినంగా గడిపిన పోరు మరిచిపోదామన్నా మరువలేనిది. కేసీఆర్ నడిపించుకొని వచ్చి ఈ నేలను నిలబెట్టిన వైనం ఊరూ వాడకు విశ్వాసాన్ని కల్పించడమే కాదు.. సంబురాలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దిన తీరే సకల జనుల ఆమోదాన్ని పొందింది. తెలంగాణలో పథకాలన్నీ ప్రజలందరికీ ప్రాణపదమైపోయాయి. ప్రాజెక్టులు పర్యాటక ప్రాంతాలై పక్కనే కొలువు దీరుతాయని ఏనాడూ అనుకొని ఉండరు. మిషన్ కాకతీయ పథకం పల్లెలకు ప్రాణధారగా మారి సాగు నీటి ప్రాజెక్టులు పచ్చని పంటలతో రైతు లోకం నుదిటిపై సిరుల తిలకం దిద్దిన తర్వాత ఊర్లకు నోటెంట జై కేసీఆర్ నినాదం తప్ప ఇంకొకటెలా వస్తుంది?
కడుపులో కలల దీపం పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, భూమిపై అడుగు పెట్టగానే కేసీఆర్ కిట్, పలక అందుకోగానే గురుకులాల డైట్… ఇలా అడుగడుగునా అమ్మలా సర్కారే సాదుకుంటున్నప్పుడు సానుకూలతే కదా కనిపించేది! రైతు బంధు, రైతు బీమాలు బడుగు వర్గాల రైతులకు పొలాల్లో జీవితాలను పండించాయి. దళిత బంధు, బీసీ బంధు అణగారిన కులాలను వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగులు వేయించాయి. ఇలా బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు వాడల తలలపై కొత్త పొద్దును పొడిపిస్తున్నాయి.
మారిన తెలంగాణ మళ్లీ మళ్లీ కేసీఆరే కావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నది. రైతులు, బడుగులు, యువకులు మా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని నిర్ణయించేసుకున్నారు. వృద్ధులు ఏమనుకుంటున్నారో అందరికీ తెలిసిన సత్యమే. సెక్రటేరియట్ లాగా, కలెక్టరేట్ల వలె, కాళేశ్వరంలా జనం ఆలోచనలు అద్భుతంగా ఆవిష్కృతమవుతున్నాయి.
పరుగులు పెడుతున్న పాలమూరు లాగా పల్లెలన్నీ గులాబీ జెండానే పట్టుకొని ఉన్నాయి. ప్రగతి కొలమానాలు, కేంద్ర, రాష్ర్టాల గణాంకాలు నిజాలను నిర్ధారణ చేసేశాయి. అందుకే అన్నీ తెలంగాణ అర్థం చేసుకొంది. అందుకే అభ్యర్థులు ఎవరన్నదీ అడగటం లేదు.. ఎన్నికలు ఎప్పుడన్నదీ ఎదురు చూడటం లేదు. ప్రజా నిర్ణయం స్ఫటిక దృశ్యంలా పరుచుకొనే ఉన్నది. చూడలేని వారు గాలిలో మేడలు కడుతూనే ఉంటారు. జనం మాత్రం జనవరిలో అసెంబ్లీ నిండా గులాబీ పంటను పండిస్తారు.
జనం నాడి కోసం లోతుగా పరిశీలించి విశ్లేషించాల్సిన అవసరమే లేదు. వారి భావన బహిరంగమై ఉన్నది. వాస్తవానికి ఇక్కడి సకల జనులకు కేసీఆర్తో భావోద్వేగపూరిత బంధం స్థిరపడిపోయి ఉన్నది. గతంలో అనేక ఆటుపోట్లకు అల్లాడిన జనం నేడు తమ భద్రత, భవిష్యత్తు కేసీఆర్ నాయకత్వంతోనే సుస్థిరమని విశ్వసిస్తున్నది. దేశ రాజకీయ వ్యవస్థలో, నేరుగా ప్రజలతో అనుబంధం ఏర్పడి వారిలో ఆరాధన భావన స్థిరపరచుకున్న నాయకుడు కేసీఆర్.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్ 98853 52242