తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా, కొంత విస్మయం కలిగించేలా సాగుతున్నది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగాలలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిణతి, ప్రజాస్వామ్యంలో ప్రజల గెలుపు, పార్టీల పనితీరు, అభ్యర్థి, పార్టీల తీరుతెన్నులు, మ్యానిఫెస్టోల గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలను కూడా వివరిస్తున్నారు. ఇక ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్తున్నారు.
తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్లమెంటరీ వ్యవస్థ పరి ణతి గురించి పదేపదే చెప్పటం ప్రస్తుత పరిస్థితిలో అనివార్యం. సిద్ధా ంతాలకు తిలోదకాలిచ్చి సీట్ల గెలుపే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న రెండు జాతీయపార్టీల వైఖరిని ప్రజలముందు ఉంచుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విశిష్టతను ప్రజల్లో చర్చకు పెడుతూ సాగుతున్న కేసీఆర్ ప్రచారం పూర్తి భిన్నంగా ఉన్నది.
మరోవైపు తమదే అధికారం, ఎన్నికలవడమే ఆలస్యం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధం అన్నట్టు కాంగ్రెస్ ప్రచారం తిట్లు, బూతులతో సాగుతున్నది. ఎన్నికల్లో ఎదుటివారిపై విమర్శలు సాధారణమే కానీ, ఆ విమర్శలు శృతిమించి వ్యక్తిగత దూషణలకు దారితీశాయి. కామారెడ్డి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నది. ఇక్కడ మాత్రమే కాదు దాదాపు అన్ని ప్రచార సభల్లో ఇంచుమించు ఇలాగే కొనసాగడం గమనార్హం. అంతేకాదు, కనీస మానవత్వాన్ని మరిచి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన కత్తి దాడిని కూడా చాలా హేళన చేసిన తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. కేవలం ప్రచారంలోనే కాకుండా ఎన్నికల కోసం రూపొందించిన ప్రకటనలు సైతం వారి ప్రచారశైలికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి.
ఇక బీజేపీ విషయానికి వస్తే కర్ణాటక ఫలితాల అనంతరం తమ రెగ్యులర్ ఫార్ములాను ఈ ఎన్నికల్లో పక్కనపెట్టినట్టు కనబడుతున్నది. పూర్తిగా బహుజన వాదం ఎత్తుకున్నట్టు కనబడేలా చూసుకుంటున్నది. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన, ఎస్సీ వర్గీకరణ చుట్టే వారి ప్రచారం తిరుగుతున్నది. అయితే ఈ మార్పు శాశ్వతమా? లేక తాత్కాలికమా కాలమే చెప్తుంది. ఈ ఎన్నికల్లో ఒక మంచి ముందడుగు బీఆర్ఎస్ నుంచి పడింది. అదే పాజిటివ్ క్యాంపైన్. తాము చేసింది, చేయవలసింది చెప్పటం, తమ విజన్ను ప్రజల ముందు ఉంచడం. అసంతృప్త వర్గాలను కన్విన్స్ చేయడం, తద్వారా వారిని మెప్పించడం మంచి సంప్రదాయంగా కనబడుతోంది. బహిరంగ సభలతో కేసీఆర్ దూసుకుపోతుంటే మరోవైపు కేటీఆర్, హరీశ్రావులు మీడియా, సోషల్మీడియా, రోడ్ షోలలో తమదైన పాజిటివ్ శైలిలో దూసుకుపోతున్నారు.
ఇటీవల కేటీఆర్ ఎంగేజ్ చేసిన రేడియో మిర్చి, మై విలేజ్ షో, అన్ ఫిల్టర్డ్ విత్ సాండిష్, మారథాన్ ఇంటర్వూలు, పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్ పేరిట జరిగిన వివిధ సమ్మేళనాలన్నీ సంప్రదాయ ఎన్నికల ప్రచారానికి భిన్నమైనవి. కేసీఆర్ తన ప్రసంగాల్లో చెప్తున్నట్టు ప్రజాస్వామ్య పరిణతి కోసం ఈ విధంగా సుహృద్భావ వాతావరణంలో ప్రచారానికి ఒక ముందడుగు పడటం అభినందనీయం.
-పాశం రఘునందన్ రెడ్డి
72077 70469