‘పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం 90 శాతం పూర్తయింది. మన ప్రభుత్వ చొరవతో ఇప్పుడు జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు నీరందుతున్నది. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరులో ముంబైకి బస్సులు ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే వలసలు వెళ్లిన వారు చాలామంది తిరిగివచ్చి వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో పంటలు పండాలనీ, ఇందులో పాలమూరులోనే 20 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నం…’
2018 నవంబర్ 21న మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగానే పాలమూరు నుంచి ముంబై వెళ్లే బస్సులు పూర్తిగా ఆగిపోయాయి. ముంబైకి వలసవెళ్లిన కార్మికులు ఒక్కొక్కరుగా తిరిగి వచ్చేశారు.కేసీఆర్ విజన్ వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టెంపాడు, జూరాల, కోయిల్సాగర్ వంటి పెండింగు ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేయడంతో పాటు ఆర్డీఎస్ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి సాగునీటిని అందించడంతో వలసలు వాపస్ అవ్వడంతో పాటు స్థానికంగా అన్నదాతకు మంచిరోజులు వచ్చేశాయి. కృష్ణానదీ జలాలను మిషన్ కాకతీయ చెరువుల్లోకి సైతం మళ్లించి బీడు భూములను బంగారుపంటలు పండించేలా మార్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్న శుభ తరుణం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చరిత్రలో మర్చిపోలేని రోజు అవ్వనున్నది.
అభివృద్ధి అంటే గొప్ప గొప్ప భవనాలు, అద్దాల మేడలో కాదు. పొట్ట చేతపట్టుకొని ఏండ్ల పాటు వలసపోయిన జీవితాలకు విముక్తి లభించి, సొంతూరిలో సగర్వంగా బతుకుతున్నప్పుడు కనిపించేది. అలాంటి అభివృద్ధి నేడు పాలమూరు వలస కూలీ కండ్లల్లో కనిపిస్తున్నది. తలాపున కృష్ణమ్మ పారుతున్నా ఏటా 14 లక్షల మంది వలసలు పోయే దుస్థితితో నాడు తలదించుకున్న పాలమూరు జిల్లా.. స్వరాష్ట్రంలో నీళ్లతో తడిచిన పొలాలతో.. పచ్చని పంటలతో నేడు తలెత్తుకున్నది. ముంబయి వలస జీవితాలకు స్వస్తి చెప్పి సొంతూరులో దర్జాగా జీవించే పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది. వలసలు వెళ్లినవారంతా సొంతూరులోనే చేతినిండా పనిదొరకడంతో పిల్లాపాపలతో హాయిగా జీవిస్తున్నారు. అంటే తెలంగాణలో మన ఉమ్మడి జిల్లా ఎంత పురోగమించిందో అర్థం చేసుకోవచ్చు.
సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే ముందుగా గుర్తుకొచ్చేది కరువు, వలసలు. తలాపునే కృష్ణమ్మ పారుతున్నా సాగుకు నోచుకోని బీడు భూములు.. తాగడానికి సైతం నీళ్లు లేక అల్లాడిన రోజులు.. కానీ నేడు పాలమూరు రూపురేఖలు మారిపోయాయి. ఎటుచూసినా పంటపొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జిల్లా నుంచి వలసలు దాదాపు నిలిచిపోయాయి. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఏటా 14 లక్షల మంది వలసబాట పట్టిన దుస్థితి ఉండేది. పది, ఇరవై ఎకరాల భూములున్న రైతులు సైతం బతుకుబండి లాగలేక పట్నం బాట పట్టక తప్పని పరిస్థితి. సమైక్య పాలకులు నాలుగు ప్రాజెక్టులను చేపట్టి వాటిని తలా తోక లేకుండా చేసి మధ్యలోనే వదిలేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను మొదలుపెట్టి దశాబ్దకాలమైనా ఏ ఒక్కటీ పూర్తిచేయలేదు.
దీంతో పంట పొలాలకు నీళ్లందక.. తాగడానికీ గుక్కెడు నీళ్లు లేక అన్నమో రామచంద్రా అంటూ జిల్లా ప్రజలు వలసబాట పట్టారు. ప్రత్యేకంగా పాలమూరు జిల్లా నుంచి వలస వెళ్లేవారి కోసమే ఆర్టీసీ బస్సులను ముంబయికి నడిపేవారు. ఆర్టీసీ దాదాపు 18 ఏండ్ల పాటు వీటిని నడిపింది. మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట డిపోల నుంచి ఒక్కో బస్సు చొప్పున ప్రతిరోజూ వలస కూలీలతో కిక్కిరిసి ముంబయికి పయనమయ్యేవి. ఇప్పుడు ఆ ముంబయి బస్సులు ఆగిపోవడమే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. పత్తి, మిర్చి, వరి చేలల్లో పనిచేసేందుకు ఏపీ, కర్ణాటక, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలు తరలివచ్చి ఉపాధి పొందుతున్నారు.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేండ్ల కాలంలోనే పాలమూరు జిల్లా పచ్చగా మారింది. రాత్రనక, పగలనకా సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో పనులు వేగంగా చేపట్టి పెండింగు ప్రాజెక్టులను పూర్తయ్యేలా చేశాం. ప్రాజెక్టుల నీటితో చెరువులనూ నింపడంతో ఒకవైపు సాగునీరు, మరోవైపు తాగునీటి ఇబ్బందులు తీరాయి. మరోవైపు మిషన్ కాకతీయ చెరువుల వల్ల సాగునీటి కష్టాలకు చెల్లుచీటి ప్రారంభమైంది. అన్ని ప్రాజెక్టులు, చెరువుల ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపుగా పదిన్నర లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించడమంటే అది సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైంది.
సాధారణ వర్షపాతానికి కూడా నోచుకోని కరువు నేల అయిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు ఎటుచూసినా నదుల నీరు పారుతున్నది. ఎర్రటి ఎండలున్న సమయంలోనూ అడ్డాకుల మండలం కందూరు వాగులో కల్వకుర్తి ఎత్తిపోతల నీళ్లు పరవళ్లు తొక్కుతూ పాలమూరు పచ్చదనంతో పరుచుకుంటున్నది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సమైక్య పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. పాలమూరు కరువును, వలసలను బూచిగా చూపించి ప్రపంచబ్యాంకు నుంచి నిధులను రాబట్టి వాటిని సీమాంధ్రకు తరలించుకుపోయిన చరిత్ర గత పాలకులది. కృష్ణానది కంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎత్తయిన ప్రాంతంలో ఉన్నదని అందుకే నీటిని అందించే పరిస్థితి లేదని కుంటిసాకులు చెప్తూ వచ్చారు. ఫలితంగా కండ్లముందే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా కన్నీళ్లు రాల్చడం తప్పించి సాగునీటిని మళ్లించే పరిస్థితి లేకుండా పోయింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగు ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నడుం బిగించారు.
2005లో పాలమూరు-రంగారెడ్డి పథకానికి రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం రూపకల్పన చేయగా కేసీఆర్ మద్దతుగా నిలిచి పోరాటాలు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు సర్వే పనులకు జీవో ఇవ్వడానికి సైతం అనేక అడ్డుపుల్లలు వేసింది. తెలంగాణ ఉద్యమ ధాటికి, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఒత్తిడితో ఎట్టకేలకు అయిష్టంగానే 2013లో ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. అయినా తెలంగాణ ఏర్పాటయ్యేవరకు ఆ పనులు ముందుకు సాగకుండా అడ్డుకొన్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టుపై ప్రత్యేకదృష్టి సారించారు. సమైక్య పాలకులు 8.8 లక్షల ఎకరాలతో జూరాల నుంచి ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మార్పులు చేసి ఆయకట్టును 12.30 లక్షల ఎకరాలకు పెంచారు. ఇన్టేక్ పాయింట్ను పుష్కలంగా నీరుండే శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారు.
2015 జూన్ 11న కరివెన వద్ద ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పూర్తయి సాగునీరు పారితే ఎక్కడ సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందో అనే ఈర్ష్యతో వివిధ కేసులతో ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారు. కేసులతో అడ్డుకునే కుట్రలను ఛేదించే క్రమంలో పనులు పూర్తిచేయడం ఆలస్యమైంది. అయినా న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి పనులను పూర్తిచేయడం తెలంగాణ విజయం. ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేసి వెనుకబడిన ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని బీడు భూములకు సాగునీరు అందించి చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. మంత్రిగా, పాలమూరు వాసిగా ఈ మహత్తర ఘట్టానికి సాక్షీభూతంగా నిలవడం నా పూర్వజన్మ సుకృతం.
(వ్యాసకర్త: రాష్ట్ర మంత్రివర్యులు)
-డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్